Begin typing your search above and press return to search.

సంచలనం: ఈటల రాజేందర్ భూములను రైతులకు పంచేస్తున్న కేసీఆర్!?

By:  Tupaki Desk   |   29 Jun 2022 10:30 AM GMT
సంచలనం: ఈటల రాజేందర్ భూములను రైతులకు పంచేస్తున్న కేసీఆర్!?
X
తన అనుంగ శిష్యుడిగా ఉండి.. అనంతరం వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో కేసీఆర్ ఆగ్రహానికి గురై.. అనంతరం పార్టీనుంచి బహిష్కరింపబడ్డ మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై అధికార పార్టీ కోపం ఇంకా తగ్గినట్టు లేదు. ఈటల రాజేందర్ పై అసైన్డ్ భూముల కబ్జా ఆరోపణలు చేసి బయటకు పంపిన కేసీఆర్ వాటిపై విచారణకు ఆదేశించి నిగ్గుతేల్చాడు. అనంతరం బీజేపీలో చేరిన ఈటల హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు షాకిచ్చాడు.

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కబ్జా చేసిన భూముల పంపిణీకి రంగం సిద్ధమైంది. రేపో మాపో ఆ భూములను సంబంధిత రైతులకు పంపిణీ చేస్తారా? అంటే అవుననే సమాచారం వినిపిస్తోంది. మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటలోని జమున హ్యాచరీస్ భూముల వ్యవహారం తేల్చేపనిలో అధికారులున్నారు. అధికారులతోపాటు పలు దఫాలుగా కలెక్టర్ చర్చలు జరిపారు.

తుఫ్రాన్ లో రాత్రంతా అధికారులు బిజిబిజీగా గడిపారు. ఈటల భూముల పంపిణీ వ్యవహారంపై మూడు రోజులుగా కలెక్టర్ హరీష్ తో కలిసి తహసీల్దార్, కార్యాలయ అధికారులు పనిచేస్తున్నారని చెబుతున్నారు.ఈరోజు, రేపు సంబంధిత రైతులకు భూములను పంపిణీ చేసే ఛాన్స్ ఉందని సమాచారం.

కబ్జా జరిగినట్టు తేల్చిన అధికారులు రైతుల భూముల్లో హద్దులు కూడా ఖరారు చేసినట్టు సమాచారం అందుతోంది.ఇప్పటికే రెండు సార్లు ఆ భూముల్లో సర్వే నిర్వహించారు అధికారులు. 56 మంది రైతులకు సంబంధించిన 70.33 ఎకరాల భూమి కబ్జా అయినట్టుగా చెబుతున్నారు.

మరోవైపు గత కొన్ని రోజులుగా ప్రజాప్రతినిధులు, అధికారులను కలుస్తూ వస్తున్నారు అచ్చంపేట రైతులు. ఈ నేపథ్యంలోనే రేపోమాపో ఆ రైతులకు భూములను పంపిణీ చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. దీనిపై అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఓవైపు బీజేపీ జాతీయ మహాసభలు హైదరాబాద్ వేదికగా సాగనున్నాయి. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా సహా దేశంలోని ప్రముఖులు హైదరాబాద్ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈటల భూములను రైతులకు పంచడం హాట్ టాపిక్ గా మారింది.