Begin typing your search above and press return to search.

ఏపీ - తెలంగాణ‌కు క‌లిపి బ్యాడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్‌!

By:  Tupaki Desk   |   27 May 2020 5:08 PM GMT
ఏపీ - తెలంగాణ‌కు క‌లిపి బ్యాడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్‌!
X
ఓ గుడ్ న్యూస్‌..మ‌రో బ్యాడ్ న్యూస్‌ ను తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏక‌కాలంలో తెలియ‌జేశారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యంతో రెండు తెలుగు రాష్ట్రాలు ప్ర‌భావితం అవనున్నాయి. ప్రగతి భవన్ లో బుధవారం ఆర్టీసీపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ - ప్రభుత్వ ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు రాష్ట్రంలో బస్సు సర్వీసులు పునరుద్ధరించిన తర్వాత పరిస్థితిని వివరించగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఆర్టీసీ బస్సులకు గురువారం నుంచి కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు సిఎం కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులు జెబిఎస్ తో పాటు - ఇమ్లీవన్ లో కూడా ఆగేందుకు అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు.

సీఎం కేసీఆర్ నిర్ణ‌యానికి ముందు ఆర్టీసీ అధికారులు ప‌రిస్థితిని సీఎంకు వివ‌రించారు. ``ఇటీవల జరిగిన పరిణామాల వల్ల ఆర్టీసీ బాగా నష్టపోయింది. సమస్య కొలిక్కి వచ్చి గాడిన పడుతున్న తరుణంలో కరోనా వచ్చింది. కొద్ది రోజుల క్రితం ఆర్టీసీ బస్సులు నడవడానికి అవకాశం ఇచ్చినప్పటికీ రాత్రిపూట కర్ఫ్యూ కారణంగా పూర్తి స్థాయిలో బస్సులు తిరగడం లేదు. దీంతో ఆర్టీసీకి ఆదాయం రావడం లేదు. రోజుకు 11 నుంచి 12 కోట్ల వరకు ఆదాయం రావాలి. ఎండాకాలం - పెళ్లిళ్ల సీజన్ లో 15 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. కానీ, ఇప్పుడు కేవలం 2 కోట్ల రూపాయలు మాత్రమే వస్తుంది. కేవలం 39 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే వస్తున్నది. దీనికి ప్రధాన కారణం రాత్రి పూట విధించే కర్ఫ్యూ. ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు రాత్రి 7 గంటల లోపు గమ్యస్థానాలకు చేరుకోవడం సాధ్యం కావడం లేదు. ఎండాకాలం కావడంతో ప్రజలు అయితే ఉదయం - లేదంటే సాయంత్రం మాత్రమే ప్రయాణం చేయడానికి మొగ్గు చూపుతున్నారు. పగటి పూట మాత్రమే బస్సులు నడపడం వల్ల ప్రజలకు ఉపయోగపడడం లేదు’’ అని ఆర్టీసీ అధికారులు సీఎం కేసీఆర్‌ కు విన్న‌వించారు.

దీంతో ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల విషయంలో సీఎం కేసీఆర్ ప‌లు నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపులు ఉంటాయని సీఎం తెలిపారు. ``కర్ఫ్యూ సమయంలో కూడా ఆర్టీసీ బస్సులు గమ్యస్థానం చేరడానికి అవకాశం ఇస్తారు. బస్టాండ్లలో ట్యాక్సీలు - ఆటోలు తదితర రవాణా వాహనాలను అనుమతి ఇస్తారు. బస్ టికెట్ కలిగిన ప్రయాణీకులు కర్ఫ్యూ సమయంలో కూడా ప్రైవేటు వాహనాల్లో తమ ఇళ్లకు చేరుకోవడానికి పోలీసులు అభ్యంతర పెట్టరు.`` అని వెల్ల‌డించారు.

కాగా, జిల్లాల నుంచి వచ్చే బస్సులన్నీ జేబీఎస్‌ లోనే ప్రయాణీకులను దింపుతుండ‌గా గురువారం నుంచి ఇమ్లీబన్ కు కూడా బస్సులు వచ్చిపోతాయని వెల్ల‌డించారు. హైదరాబాద్ నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి, మరికొన్ని రోజుల వరకు నగరంలో సిటీ బస్సులు నడపవ‌ద్ద‌ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అతర్రాష్ట్ర బస్సులను కూడా మరికొన్ని రోజుల పాటు నడప‌వ‌ద్ద‌ని ఆయ‌న తేల్చిచెప్పారు. దీంతో తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న రెండు నిర్ణ‌యాల విష‌యంలో నిరాశ‌ను మిగిల్చారు.