Begin typing your search above and press return to search.

మీరు ఊహించని మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన జపాన్

By:  Tupaki Desk   |   1 March 2021 10:30 AM GMT
మీరు ఊహించని మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన జపాన్
X
ఆర్థిక.. హోం.. సంక్షేమం.. వైద్య ఆరోగ్య..క్రీడా.. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ దేశంలో అయినా మనకు తెలిసిన మంత్రిత్వ శాఖలే ప్రభుత్వాల్లో ఉంటాయి. కానీ.. మన ఊహకు అందని రీతిలో ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. అదే సమయంలో ఆలోచింపచేస్తుంది. ఇంతకీ ఆ శాఖ ఏమంటారా? ‘ఒంటరితనం’. నిజంగానే.. ఒంటరితనానికి సంబంధించి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది జపాన్.

అలాంటి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే.. దానికి కారణం కరోనానే. ఈ మహమ్మారి పుణ్యమా అని వచ్చిన సామాజిక.. ఆర్థిక సమస్యలు అన్ని ఇన్ని కావు. ఇది చేసిన విలయతాండవంలో పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకోవటం తెలిసిందే. కోవిడ్ కారణంగా ఒంటరితనంతో మరణిస్తున్న వారి సంఖ్య జపాన్ లో గడిచిన పదకొండేళ్లలో ఎప్పుడూ లేనంతగా పెరిగింది.

జాతీయ సమస్యలకు ఏ మాత్రం తగ్గని రీతిలో పెరుగుతున్న ఆత్మహత్యల సమస్యను ఎదుర్కొనేందుకు ‘లోన్లీనెస్ మినిస్ట్రీ’ అని ఏర్పాటు చేస్తూ జపాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఇదే తరహాలో ఒక మంత్రిత్వ శాఖను యూకేలో ఏర్పాటు చేశారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న జపాన్ తాజాగా తమ దేశంలోనూ ఈ తరహా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది.

ఈ మంత్రిత్వ శాఖ దేశంలో తగ్గిపోయిన జననాల రేటును అధిగమించటం.. ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థల పునరుజ్జీవింపజేసే అంశాలపై ఫోకస్ చేయనుంది. టెట్సుషి సకామోటో ఈ మంత్రిత్వ శాఖను నిర్వహించనున్నారు. మిగిలిన దేశాల మాదిరి జపాన్ లో కోవిడ్ తన ప్రభావాన్ని చూపింది. ఈ మహమ్మారి పుణ్యమా అని దేశ రాజధాని టోక్యోలో ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు ఒంటరిగా జీవిస్తున్నారు. అసలే కోవిడ్. బయటకు వెళ్లే పరిస్థితి లేదు. దీనికి తోడు ఇంటికే పరిమితం కావటంతో ఒంటరితనంతో ఉన్న మహిళలు మరింత ఒంటరిగా మారారు. దీంతో పలు మానసిక సమస్యలు మీద పడ్డాయి.

ఈ బుల్లిదేశంలో కోవిడ్ బారిన పడినోళ్లు 4.26లక్షలు. ఈ మహమ్మారి బలి తీసుకున్న వారి సంఖ్య 7577. అదే సమయంలో గత ఏడాదిలో జపాన్ లో ఆత్మహత్యకు పాల్పడిన మహిళల సంఖ్య దీనికి దగ్గరగా ఉండటం ఆందోళనకు గురి చేస్తోంది. గత ఏడాది జపాన్ లో 6976 మంది మహిళలు ఆత్మహత్యకు పాల్పడగా.. అంతకు ముందు ఏడాది కంటే పదిహేను శాతం ఎక్కువ కావటం గమనార్హం. పురుషుల కంటే మహిళలే ఎక్కువగా సూసైడ్ చేసుకున్న వారిలో ఉన్నారు.

కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారిలో మహిళలే ఎక్కువ. గత ఏడాది తొలి తొమ్మిది నెలల్లో 1.44 మిలియన్ల మంది తమ ఉద్యోగాల్ని కోల్పోతే.. అందులో యాభై శాతానికి పైనే మహిళలు ఉన్నారు. దీనికి తోడు ఇంట్లోని మగవారు కరోనా బారిన పడటంతో.. వారి బాగోగులతో పాటు.. ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొవాల్సిన పరిస్థితి వీరిపై పడింది.దీనికి తోడు.. ఇంటి పని.. శారీరక సమస్యలు.. లైంగిక వేధింపులు బాగా పెరిగిపోయాయి. దీంతో.. వారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. దీనికి చెక్ పెట్టేందుకు ఏర్పాటు చేసిన మంత్రిత్వ శాఖ ఏం చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.