Begin typing your search above and press return to search.

ప్లీనరీ స్పెషాలిటీ : జగనే శాశ్వత అధ్యక్షుడు...?

By:  Tupaki Desk   |   29 Jun 2022 2:11 PM GMT
ప్లీనరీ స్పెషాలిటీ : జగనే శాశ్వత అధ్యక్షుడు...?
X
వైసీపీకి సర్వసత్తాక అధికారి వైఎస్ జగన్. ఆయన రెక్కల కష్టం, చెక్కిన శిల్పం వైసీపీ. కాంగ్రెస్ నుంచి జగన్ ఒంటరిగా వచ్చి పార్టీ పెట్టారు. తరువాత ఒక్కొక్కరుగా వచ్చి చేరారు. మధ్యలో కొందరు నేతలు వెళ్ళిపోయారు. మళ్ళీ మరికొందరు వచ్చారు. అధికారంలో ఉండడంతో చాలా మంది ఆ పార్టీని ఈ రోజు దాకా అట్టేబెట్టుకుని ఉన్నారు. ఇలా ఎన్ని జరిగినా జగన్ మాత్రం వైసీపీకి అసలైన పెత్తందారు.

ఆయన అధ్యక్ష పోస్టుకు వచ్చిన పేచీ పూచీ ఏమీ లేదు. పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అన్నది పక్కన పెడితే జగన్ జీవించి ఉన్నంతకాలం వైసీపీకి ప్రెసిడెంట్ గా ఉంటారు. అలా ప్రతీ ప్లీనరీ వేదికగా కార్యకర్తలు ఎన్నుకుంటారు. అయితే ఈసారి ప్లీనరీలో అలా కాకుండా ఏకంగా వైసీపీ రాజ్యాంగాన్ని సవరించాలనుకుంటున్నారు అని తెలుస్తోంది. వైసీపీకి ఇక మీదట శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఉంటారని చెబుతున్నారు.

మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈసారి ప్లీనరీలో ఇదే డిక్లేర్ చేస్తారు అని అంటున్నారు. అలాగే జగన్ తో పాటు వైఎస్ విజయమ్మ కూడా వైసీపీకి శాశ్వత గౌరవ అధ్యక్షురాలిగా ఉంటారట. ఈ విషయంలో రెండవ మాట లేదు అంటున్నారు. ప్లీనరీకి విజయమ్మ వస్తారా అంటే ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అయితే తప్పకుండా అని చెప్పారు. అంటే ఈసారి ప్లీనరీతో విజయమ్మ ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతారు అన్నమాట.

ఆమె ఈ మధ్యకాలంలో జగన్ తో ఎక్కడా కనిపించడంలేదు. ఆ మాటకు వస్తే ఆమె ఆంధ్రాను, వైసీపీ రాజకీయాలను పూర్తిగా వదిలేసినట్లుగా కనిపిస్తున్నారు. తెలంగాణాకే ఆమె పరిమితం అయ్యారు.

అపుడపుడు తన కుమార్తె షర్మిలతో కలసి ఆమె కొత్తగా పెట్టిన వైఎస్సార్టీపీతో కనిపిస్తున్నారు. అంటే ఆమె కూతురు పార్టీలో ఉన్నారు అని ప్రచారం కూడా సాగుతోంది. దాంతో ప్లీనరీ వేళ విజయమ్మ రాకపోతే పెద్ద రాజకీయ రచ్చ మీడియా వేదికగా జరిగే చాన్స్ ఉంటుంది.

కానీ ఆ డౌట్లు ఏవీ లేకుండా మేడం వస్తారని వైసీపీ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఇక ఆమె కోరిక మేరకు గౌరవ అధ్యక్ష బాధ్యతల నుంచి విముక్తి కలిగిస్తారు అని వస్తున్న వార్తలు కూడా పూర్వ పక్షం చేయాలని వైసీపీ భావిస్తోందిట. అంటే వైసీపీలో విజయమ్మ శాశ్వత గౌరవ అధ్యక్షురాలిగా ఉంటారన్న మాట.

చూడాలి మరి. కొద్ది రోజులలో మొదలుకాబోతున్న ప్లీనరీలో ఇలా ఎన్ని విశేషాలు జరుగుతాయో. ఇక 2022లో ప్లీనరీ తరువాత 2027లోనే ప్లీనరీని నిర్వహిస్తామని ఆ పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి కొత్త వార్తను కూడా చెబుతున్నారు. 2017 తరువాత ఇపుడు జరుపుతున్నామని ఆయన గుర్తు చేశారు. అంటే ప్రతీ అయిదేళ్ళకు ఒక మారు ప్లీనరీ ఉంటుంది అని వైసీపీ నేతలు చెబుతున్నారు.