Begin typing your search above and press return to search.

లోకేష్‌ పాదయాత్రపై జగన్‌ ప్రభుత్వం కలవరపడుతోందా?

By:  Tupaki Desk   |   23 Jan 2023 11:36 AM
లోకేష్‌ పాదయాత్రపై జగన్‌ ప్రభుత్వం కలవరపడుతోందా?
X
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పేరుతో ఏపీలో చేపట్టనున్న పాదయాత్రపై ప్రస్తుతం అందరి దృష్టీ నెలకొంది. మరో నాలుగు రోజుల్లో అంటే జనవరి 27 నుంచి లోకేష్‌ పాదయాత్ర మొదలుకానుంది. టీడీపీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం వరకు లోకేష్‌ పాదయాత్ర సాగనుంది. ఈ నేపథ్యంలో జనవరి 27న కుప్పంలో పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి అటు నారా, ఇటు నందమూరి కుటుంబాలు మొత్తం హాజరవుతాయని చెబుతున్నారు. దివంగత సీఎం ఎన్టీఆర్‌ కుమారులు, కుమార్తెలు, వారి సంతానమంతా వస్తారని అంటున్నారు.

మరోవైపు లోకేష్‌ పాదయాత్రకు పోలీసుల నుంచి ఇంతవరకు అనుమతులు రాలేదు. నెల క్రితమే తాము అనుమతులు కోరుతూ డీజీపీకి, చిత్తూరు జిల్లా ఎస్పీకి, పలమనేరు డీఎస్పీకి లేఖలు రాసినా స్పందన లేదని టీడీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. అలాగే ఇదే విషయాన్ని మెయిల్‌ చేయడంతోపాటు స్వయంగా డీజీపీ కార్యాలయంలో హార్డ్‌ కాపీలను సైతం అందజేశామని టీడీపీ నేతలు చెబుతున్నారు.

పాదయాత్రకు సమయం దగ్గరపడుతున్నా పోలీసులు స్పందించడం లేదని.. కావాలనే లోకేష్‌ పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తీరా తీరిగ్గా స్పందించిన డీజీపీ లోకేష్‌ పాదయాత్రలో ఎవరెవరిని కలుస్తాడు? ఏ రోజు పాదయాత్ర ఎక్కడ ముగిస్తారు? ఎవరెవరితో ఏ రోజు మాట్లాడతారు? ఏ రోజు ఎక్కడి నుంచి పాదయాత్ర మొదలవుతుంది? ఎన్ని వాహనాలు పాల్గొటాయి? ఎంత మంది పాదయాత్రలో పాల్గొంటారు వంటి వివరాలన్నీ అడిగారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

సాధారణంగా పాదయాత్ర సాగేటప్పుడు ఆ రోడ్డున పోయేవారితోపాటు సమీప గ్రామాలు, పట్టణాల ప్రజలు, కూలీలు, రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, వలస కూలీలు, విభిన్న వర్గాల ప్రజలు ఇలా ప్రతి ఒక్కరూ లోకేష్‌ ను చూడటానికో లేదా ఆయనతో కలిసి కాస్త దూరం నడవడానికో రావచ్చని.. ఖచ్చితంగా ఎంతమంది పాల్గొంటారు అని డీజీపీ అడిగితే తామెలా చెప్పగలమని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు, షర్మిల, జగన్‌ ఇలా పలువురు పాదయాత్రలు చేశారని.. అప్పుడు ఇన్ని ప్రశ్నలు ఏ ప్రభుత్వమూ, పోలీసులు వేయలేదని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. పైగా వైవీ సుబ్బారెడ్డి లాంటి వైసీపీ నేతలు జగన్‌ పాదయాత్ర సమయంలో దానికి పోలీసుల అనుమతి అవసరం లేదన్నారని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి జగన్‌ సొంత పత్రిక సాక్షిలో వచ్చిన కథనాలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అలాగే జగన్‌ తల్లి విజయమ్మ ఇటీవల తెలంగాణలో షర్మిల పాదయాత్ర సందర్బంగా ఒక టీవీ చానెల్‌ తో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల వీడియోను పోస్టు చేశారు.

సాధారణంగా ప్రతిపక్ష నేతలు పాదయాత్రలు చేస్తున్నపుడు ప్రభుత్వ వ్యతిరేక వర్గాలు, ప్రభుత్వంతో నష్టపోయిన ప్రజలు కలిసి తమ బాధలను చెప్పుకుంటారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇలా ఎవరైనా వచ్చి లోకేష్‌ ను కలిస్తే.. అవి మీడియాలో రావడం ఖాయం. అప్పుడు తమ ప్రభుత్వానికి ఆయా వర్గాల్లో చెడ్డపేరు వస్తుందని వైసీపీ ప్రభుత్వం భయపడుతుందంటున్నారు.

కందుకూరు, గుంటూరు తొక్కిసలాటల్లో ప్రజలు మరణించిన ఘటనలను సాకుగా చూపి లోకేష్‌ పాదయాత్రను అడ్డుకోవడానికే జీవో నంబర్‌ 1ను తెచ్చిందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే రోడ్లపై బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్‌ షోలను నిషేధిస్తూ జీవో నంబర్‌ 1 తెచ్చిందని మండిపడుతున్నారు.

ఓవైపు లోకేష్‌ పాదయాత్రను తాము పట్టించుకోబోమని.. అసలు తాము లోకేష్‌ ను గుర్తించడం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు మంత్రులు లోకేష్‌ పాదయాత్రను అడ్డుకుంటామని ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు వివిధ కారణాలను సాకుగా చూపి ఇప్పటివరకు లోకేష్‌ పాదయాత్రకు పోలీసులు అనుమతే ఇవ్వలేదు. అయితే పోలీసులు అనుమతి ఇచ్చినా.. ఇవ్వకపోయినా లోకేష్‌ పాదయాత్ర కొనసాగుతుందని టీడీపీ వర్గాలు తేల్చిచెబుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.