Begin typing your search above and press return to search.

మోడీని విమర్శించిన ఆ సీఎంకు జగన్ కౌంటర్

By:  Tupaki Desk   |   7 May 2021 2:30 PM GMT
మోడీని విమర్శించిన ఆ సీఎంకు జగన్ కౌంటర్
X
ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ అండగా నిలిచారు. కరోనా కట్టడి విషయంలో ప్రధాని నరేంద్రమోడీ వైఖరిపై కొద్దిరోజులుగా విపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ప్రధాని మోడీ లక్ష్యంగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ విమర్శలు గుప్పించారు. దీనికి ఏపీ సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. దేశం ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఈ వ్యాఖ్యలు తగదంటూ హేమంత్ సోరెన్ కు జగన్ హితవు పలికారు.

ఇటీవలే ప్రధాని నరేంద్రమోడీ గురువారం ఏపీ, జార్ఖండ్, తెలంగాణ, ఒడిషా సీఎంలతో ఫోన్ లో మాట్లాడారు. కరోనా మహమ్మారి పరిస్థితిపై సీఎంలతో మోడీ చర్చించారు. ఈ చర్చలపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ప్రధానితో ఫోన్ కాల్ తర్వాత జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ట్వీట్ చేశారు. 'మోడీ మన్ కీ బాత్ మాట్లాడినట్టు మాట్లాడారని.. అలా కాకుండా పరిస్థితుల గురించి మాట్లాడి.. ఆ తర్వాత సమస్యల గురించి అడిగి తెలుసుకుంటే బాగుండేది’ అని హేమంత్ ట్వీట్ చేశారు. ప్రధాని తాను మాత్రమే మాట్లాడారని.. ఎదుటి వ్యక్తిని మాట్లాడనివ్వలేదని అన్నారు. సమస్యలపై చెబుతామంటే చాన్స్ ఇవ్వలేదని సోరెన్ మండిపడ్డారు.

హేమంత్ సోరెన్ చేసిన ట్వీట్ కు శుక్రవారం ఏపీ సీఎం జగన్ వరుస ట్వీట్ లతో కౌంటర్ ఇచ్చారు. 'మన మధ్య విభేదాలు ఎన్నున్నా కూడా ఈ సమయంలో రాజకీయాలు చేయడం దేశాన్ని బలహీనపరుస్తుందని జార్ఖండ్ సీఎం సోరెన్’కు జగన్ సూచించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో వేలెత్తి చూపించడం మాని ప్రధానికి అండగా నిలుద్దాం అని హేమంత్ సోరెన్ కు జగన్ హితవు పలికారు.

ఇక హేమంత్ సోరెన్ ప్రధాని మోడీపై ట్వీట్ పై బీజేపీ నేతలు మండిపడ్డారు. అసోం బీజేపీ నేత హిమాంత బిస్వాల్, జార్ఖండ్ బీజేపీ నేత బాబూలాల్ మరాండి తదితరులు దుమ్మెత్తిపోశారు.