Begin typing your search above and press return to search.

10 లక్షల మంది మనసు దోచే పథకానికి జగన్ శ్రీకారం

By:  Tupaki Desk   |   25 Nov 2020 8:50 AM GMT
10 లక్షల మంది మనసు దోచే పథకానికి జగన్ శ్రీకారం
X
ఆర్థిక లోటు ఇబ్బంది పెడుతున్నా.. దాన్ని లెక్క చేయకుండా సంక్షేమ పాలనా రథాన్ని నడిపిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడిచిన కొద్ది రోజులుగా వినూత్న పథకాల్ని వరుస పెట్టి అమలు చేస్తున్నారు. ఈ రోజు నుంచి ఆయన షురూ చేసే పథకంతో దాదాపు పది లక్షల మంది లబ్థి పొందుతారని చెబుతున్నారు. ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయని ఈ కొత్త పథకంతో చిరు వ్యాపారులకు మేలు చేయటమే కాదు.. వారికి ఉండే ఆర్థిక ఇబ్బందుల నుంచి కాస్తంత ఉపశమనం కలిగేలా చేస్తుందని చెప్పాలి.

జగనన్న తోడుపథకంలో భాగంగా ఏపీ వ్యాప్తంగా గ్రామాలు.. పట్టణాల్లో ఐదు అడుగుల పొడవు.. ఐదు అడుగుల వెడల్పు స్థలంలో కానీ.. అంత కంటే తక్కువ స్థలంలో సొంతం కానీ తాత్కాలికంగా కానీ షాపులు పెట్టుకొని వ్యాపారం చేసే వారికి రూ.10వేల మొత్తాన్ని ఎలాంటి వడ్డీ లేకుండా రుణ సాయం చేస్తుంటారు. ఇందుకోసం రూ.వెయ్యి కోట్ల మేర నిధుల్ని ఈ పథకం కింద ఇవ్వనున్నారు.

ఈ పథకాన్ని ఈ రోజున ఆన్ లైన్ లో ప్రారంభించనున్నారు సీఎం జగన్. ఇప్పటివరకు పదిలక్షల మంది ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకం కింద సాయాన్ని అందించనున్నారు. దీంతో.. చిన్న చిన్నవ్యాపారాలు చేసుకునే వారు.. తమ ఆర్థిక అవసరాల కోసం పెద్ద ఎత్తున వడ్డీకి ప్రైవేటు వ్యక్తుల వద్ద రుణాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ పథకానికి అత్యధికంగా అప్లికేషన్లు.. గుంటూరు.. తూర్పుగోదావరి.. విశాఖ.. చిత్తూరు.. అనంతపురం జిల్లాల్లో చేసుకున్నారు. మిగిలిన జిల్లాల్లోనూ వేలాది మంది వ్యాపారులు ఈ పథకంలో భాగస్వామ్యం అయ్యేందుకు దరఖాస్తులు పెట్టుకోవటం గమనార్హం.