Begin typing your search above and press return to search.

కరోనా సోకిన వారిని ద్వేషించకండి: జగన్

By:  Tupaki Desk   |   1 April 2020 2:30 PM GMT
కరోనా సోకిన వారిని ద్వేషించకండి: జగన్
X
కరోనా కట్టడి కోసం ఏపీ సీఎం జగన్ పకడ్బందీ ప్రణాళికలు రచించిన సంగతి తెలిసిందే. జనతా కర్ఫ్యూ నాడే ఏపీని షట్ డౌన్ చేస్తూ తాత్కాలిక లాక్ డౌన్ కు పిలుపునిచ్చిన ముందు చూపు జగన్ ది. మార్చి 24 అర్థ రాత్రి నుంచి లాక్ డౌన్ అమలులోకి రాగానే మన రాష్ట్రంలో దాని అమలు కోసం పోలీసు యంత్రాంగాన్ని క్షేత్ర స్థాయి నుంచి మానిటర్ చేస్తున్నారు జగన్. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించేందుకు గానూ గ్రామ వలంటీర్లను సమర్థవంతంగా వాడుకున్న జగన్....దాదాపుగా కరోనాను కంట్రోల్ చేయడంతో సఫలమయ్యారు. అయితే, అనూహ్యంగా ఢిల్లీ ఉదంతం నేపథ్యంలో గడచిన 24 గంట్లో రాష్ట్రంలో 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో, రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 87కు చేరింది. ఈ నేపథ్యంలో సచివాలయంలో సీఎం జగన్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. గడచిన రెండు రోజుల్లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం బాధ కలిగించిందన్న జగన్....ప్రజలెవరూ అధైర్యపడవద్దని సూచించారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారిని గుర్తించి పరీక్షలు చేయిస్తున్నామని - ఢిల్లీ నుంచి వచ్చి అధికారులకు సమాచారమివ్వని వారెవరైనా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.

ఏపీ నుంచి 1,085 మంది ఢిల్లీలో జరిగిన ఓ సదస్సుకు వెళ్లారన్న జగన్....వారిలో 585 మందికి కరోనా టెస్టులు నిర్వహించామన్నారు. 585లో 70 పాజిటివ్ వచ్చాయని...మరో 500 కేసుల రిపోర్టులు రావాల్సి ఉందని అన్నారు. ఢిల్లీ నుంచి వచ్చినవారు - వారితో సన్నిహితంగా మెలిగిన వారు ఎవరైనా ఉంటే 104కు ఫోన్ చేసి కరోనా టెస్టులు చేయించుకోవాలని జగన్ పిలుపునిచ్చారు. వైరస్ వస్తే ఏదో జరిగిపోతుందన్న భయం వద్దని - కరోనా కూడా ఒక జ్వరం - ఫ్లూ లాంటిదేనని ధైర్యం చెప్పారు. అయితే, కరోనా అనేది వేగంగా వ్యాప్తి చెందే వైరస్ అని - మనమంతా అప్రమత్తంగా ఉంటే దానిని తరిమికొట్టవచ్చని అన్నారు. దేశాధినేతలు - ప్రధానమంత్రులకు - వారి కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకిందని - చాలా మందికి నయం అయిపోయి సాధారణ జీవితం గడుపుతున్నారని అన్నారు. వైరస్ సోకడం తప్పు కాదని...వైరస్ సోకడం పాపం అనే భావనతో ఉండవద్దని అన్నారు. వైరస్ వస్తే ఏదో జరిగిపోతుందని అనుకోవద్దని - వైరస్ సోకిన వారిపై వ్యతిరేకత చూపించవద్దని ప్రజలకు సీఎం జగన్ పిలుపునిచ్చారు.

ఢిల్లీ నుంచి వచ్చిన వారు - వారితో సన్నిహితంగా ఉన్నవారు - విదేశాల నుంచి వచ్చిన వారు - కరోనా అనుమానిత లక్షణాలున్నవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని జగన్ పిలుపునిచ్చారు. అనుమానం ఉన్నవారు గ్రామ వాలంటీర్లు - ఏఎన్ ఎం - ఆశా వర్కర్లకు తెలపాలని - వారు ప్రతి ఇంటికి వచ్చి ప్రజల ఆరోగ్యంపై సర్వే చేస్తున్నారని జగన్ చెప్పారు. కరోనా సోకితే ఏమైపోతుందో అన్న భయం వద్దని జగన్ భరోసా ఇచ్చారు. కరోనా సోకిన వారిలో 80 శాతం కేసులను ఇంటి వద్ద వైద్యంతోనే నెగెటివ్ చేయొచ్చని జగన్ అన్నారు. మిగతా 20 శాతంలో కూడా 14 శాతం మందికి ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందించి నయం చేయవచ్చని చెప్పారు. మిగిలిన 6 శాతం మందికి మాత్రమే ఐసీయూకి తరలించి చికిత్స అందించాల్సి ఉంటుందన్నారు. అయితే, వయసు పైబడిన వాళ్లతో పాటు కిడ్నీ - బీపీ - షుగర్‌ లాంటి వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని - వారిపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందని జగన్ వివరించారు. అన్ని రకాల పరిస్థితులను తట్టుకునేందుకు ప్రభుత్వం - వైద్య సిబ్బంది సిద్ధంగా ఉందని - ఐసొలేషన్ వార్డులు - క్వారెంటైన్ సెంటర్లు - వెంటిలేటర్లు సిద్దం చేసి ఉంచామని చెప్పారు. ఢిల్లీ సదస్సుకు వెళ్ళి వచ్చిన వారు స్వచ్ఛందంగా 104కు ఫోన్ చేసి - పరీక్షలకు రావాలని సూచించారు జగన్.

కరోనా సోకిన వారిని చిన్నచూపు చూడవద్దని - వారిపై వ్యతిరేక భావం ఉండకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు జగన్. సంక్షోభ సమయంలో సేవలందించాల్సిందిగా ప్రైవేటు సంస్థలను కోరిన జగన్‌.. ఇలాంటి సమయంలో వైద్యులు - నర్సులు - వైద్య కళాశాలలు ముందుకు రావాలని అన్నారు. ప్రజా ప్రతినిధులు - అధికారులు - ఉద్యోగులు అందరూ సహకరించాలని చెప్పారు జగన్‌. లాక్ డౌన్ పీరియడ్‌ లో జనం ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని - నిత్యావసర సరుకులు అందుబాటు ధరల్లో ఉండేలా చర్యలు చేపట్టామని చెప్పారు. కరోనాను కట్టడి చేసేందుకు సామాజిక - భౌతిక దూరం పాటించడం చాలా ముఖ్యమని - నిర్దేశించిన సమయాల్లో మాత్రమే బయటికి వచ్చి కావాల్సినవి కొనుగోలు చేయాలని అన్నారు. రైతులు తమ దిగుబడులను విక్రయించుకునేందుకు ఆందోళన చెందవద్దని - ప్రభుత్వం తగు ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు జగన్. రైతులు - రైతు కూలీలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు వ్యవసాయ పనులకు వెళ్లవచ్చని జగన్ అన్నారు.

కరోనా వస్తే ఎక్కడికో తీసుకుపోతారనే భయం వద్దని - కరోనా బాధితుల నుంచి వైరస్ వేరే వారికి సోకకుండా 14 రోజుల పాటు విడిగా ఐసోలేషన్ లో ఉంచి మంచి చికిత్స అందిస్తామని - భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే, అదే సమయంలో కరోనా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే...మనతో పాటు మన కుటుంబ సభ్యులు - చుట్టుపక్కల వారు - సమాజంలోని వ్యక్తులకు కరోనా సోకే ప్రమాదముందని అన్నారు. లాక్ డౌన్ ప్రకటించడంతో రాష్ట్రంలో ఆదాయం తగ్గి - ఖర్చులు పెరిగడంతో ఖజానాపై అనుకోని భారం పడిందని జగన్ అన్నారు. ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా వారి జీతాలను వాయిదా వేసుకున్న ప్రజాప్రతినిధులు - ఐఏఎస్ - ఐపీఎస్ - గెజిటెడ్ - ఎన్జీఓలు - గ్రూప్ డీ ఉద్యోగులు - ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు - పెన్షనర్లకు జగన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.