Begin typing your search above and press return to search.

సోదరుల మధ్య డ్రామా నడుస్తోందా ?

By:  Tupaki Desk   |   10 Jun 2023 9:51 AM GMT
సోదరుల మధ్య డ్రామా నడుస్తోందా ?
X
అందిరికీ ఇదే అనుమానంగా ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాలలో ఆమంచి సోదరులంటే తెలియనివారుండరు. రెండుసార్లు ఆమంచి కృష్ణమోహన్ ఎంఎల్ఏగా గెలిచారు. ఎంఎల్ఏ హోదాలో కృష్ణమోహన్ తెరమీద కనిపించినా తెరవెనుక ఉండి కథంతా నడిపించింది తమ్ముడు ఆమంచి స్వాములే అన్న విషయం అందరికీ తెలిసిందే. పార్టీ వ్యవహారాలు, కుటుంబ, వ్యాపార వ్యవహారాలు మొత్తాన్ని స్వాములే చూసుకునేవారు. అలాంటిది ఇపుడు కృష్ణమోహన్ను కాదని స్వాములు జనసేనలో చేరబోతున్నారంటే ఎవరు నమ్మటంలేదు.

చీరాలలో పోటీచేయాలని పట్టుదలగా ఉన్న కృష్ణమోహన్ను సీఎం పరుచూరు నియోజకవర్గానికి ఇన్చార్జిగా పంపారు. చీరాల ఇన్చార్జిగా కరణం వెంకటేష్ ను నియమించారు. వచ్చేఎన్నికల్లో వెంకటేష్ కు చీరాలలోను ఆమంచికి పరుచూరులోను టికెట్ ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయినట్లు పార్టీలో టాక్ నడుస్తోంది. ఇదే సమయంలో తనకు జగన్ ఏదన్నా పదవి ఇవ్వకపోతారా అని స్వాములు చాలాకాలం ఎదురుచూశారు.

ఎంతకాలం ఎదురుచూసినా ఉపయోగంలేకపోవటంతో లాభంలేదని స్వాములు జనసేనలో చేరడానికి డిసైడ్ అయ్యారట. ఈమేరకు ఇప్పటికే పార్టీ అధినేత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ తో స్వాములు భేటీ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ ఖాయంచేసేట్లయితే తాను జనసేనలో చేరటానికి రెడీగా ఉన్నట్లు స్వాములు పవన్ కు చెప్పారట.

అయితే పవనే టికెట్లపై చంద్రబాబునాయుడు మీద ఆధారపడ్డారు. అలాంటిది స్వాములుకు పవన్ ఏమి హామీ ఇవ్వగలరు ? టీడీపీతో పొత్తులో జనసేనకు ఎన్ని సీట్లొస్తాయి ? వచ్చే నియోజకవర్గాలేవో పవన్ కే తెలీదు.

ఈ పరిస్ధితుల్లో స్వాములు జనసేనలో చేరి ఎక్కడినుండి పోటీచేస్తారు. అయితే పరిస్ధితులు అనుకూలిస్తే ఈనెల 12వ తేదీన తన మద్దతుదారులతో జనసేనలో చేరటానికి రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. చీరాలలో పవన్ తో స్వాములున్న పోస్టర్లు కనబడుతున్నాయి.

ఇక్కడే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. స్వాములు జనసేనలో చేరబోతున్నట్లుగా కలరింగ్ ఇచ్చుకుని కృష్ణమోహన్ను మళ్ళీ పరుచూరు నుండి తప్పించి చీరాల ఇన్చార్జిగా జగన్తో ప్రకటించేట్లుగా ఒత్తిడి పెట్టడమే వ్యూహమే ప్రచారం పెరిగిపోతోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.