Begin typing your search above and press return to search.

అనంతలో ఫ్యాక్షన్ రాజకీయాలకి ఇక ముగింపు వచ్చినట్టేనా ?

By:  Tupaki Desk   |   27 Nov 2021 2:48 PM GMT
అనంతలో ఫ్యాక్షన్ రాజకీయాలకి ఇక ముగింపు వచ్చినట్టేనా ?
X
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలు అంటే అనంతపురం జిల్లా అనే నానుడి ఉంది. ఇప్పుడు ప్రజలు అభివృద్ధి, సంక్షేమం, పిల్లల భవిష్యత్ గురించి అలోచన చేస్తున్నారు. ఫ్యాక్షన్‌ కు పుట్టినిల్లులాంటి అనంతపురం జిల్లాలో రెండు కుటుంబాల మధ్య దశాబ్దాల వైరం ఉంది.

అందులో ఒకటి పరిటాల కుటుంబం. రెండోది జేసీ ఫ్యామిలీ. రెండు కుటుంబాలదీ ఒకే జిల్లానే అయినా, వారి రాజకీయాలు, వ్యవహారాలు సాగించేది వేరు వేరు ప్రాంతాల్లో. ఇప్పుడు ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నప్పటికీ, గతంలో వేర్వేరు. పరిటాల రవి టీడీపీని తన కనుసన్నల్లో నడిపిస్తే, కాంగ్రెస్‌ పార్టీలో జేసీ బ్రదర్స్‌ది వన్‌మెన్‌ షో. కాంగ్రెస్‌ జాతీయ పార్టీ అయినప్పటికీ జిల్లాను జేసీ దివాకర్‌ రెడ్డి ముందుండి నడిపేవాడు. ఈ క్రమంలోనే పరిటాల రవి, జేసీల మధ్య రాజకీయ వైరం ఏర్పడింది.

అంతేతప్ప రెండు కుటుంబాల మధ్య కొట్టుకోవడాలు, చంపుకోవడాలు లేవు. కాకపోతే రాజకీయ వైరం ముదురు పాకాన పడింది. రాష్ట్ర విభజన తర్వాత జేసీ బ్రదర్స్ కాంగ్రెస్‌ను వీడి టీడీపీలోకి వచ్చారు. బద్ద శత్రువులైన పరిటాల, జేసీలు ఒకే పార్టీలో ఉండటం చాలా మందికి మింగుడు పడలేదు.

జేసీ హాజరైన వేదికలపైకి పరిటాల సునీత వచ్చినా ఏ రోజు పలుకరించుకోలేదు. కనీసం ఒకరి ముఖం ఒకరు చూసుకోలేదు. జేసీ బ్రదర్స్ ప్రత్యక్ష రాజకీయాల నుంచి సైడై వారి కుమారులను రంగంలోకి దించారు. ఇటు సునీతతోపాటు ఆమె తనయుడు శ్రీరామ్ యాక్టివ్ అయ్యారు.కాలం మారింది. పగలు, కక్షలు తగ్గాయి. యువ నాయకులు ఎంట్రీతో పాతవన్నీ పక్కన పెట్టి శ్రీరామ్, జేసీ కుమారులు పవన్, అస్మిత్‌ లు కలిశారు.

చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నారు కూడా. ఇది చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. దీనికంటే ఆశ్చర్యం ఏంటంటే, ఇటీవల లోకేష్ జిల్లా పర్యటనలో జేసీ ప్రభాకర్‌ రెడ్డి, పరిటాల శ్రీరామ్ కలవడం. ఆలింగనాలు నవ్వులు పువ్వులు ఇలా ఒకటేంటి, ఫ్యాక్షన్ సినిమా ఎండింగ్‌లో ఉండే సీన్‌లు కనిపించాయి.

రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌ గా మారాయి. ప్రస్తుతం పరిటాల కుటుంబానికి రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులతో రాజకీయ శతృత్వం ఉంది. వీరి మధ్య ఫ్యాక్షన్ గొడవలేమి లేకపోయినా, అంతకుమించిన రాజకీయ వైరం ఉంది. నాలుగు రోజుల క్రితం వరదల్లో 10 మంది చెన్నేకొత్తపల్లి వద్ద నీటిలో చిక్కుకపోయారు. వారిని రక్షించేందుకు హెలికాప్టర్ వచ్చింది. ఈ సమయంలో ఎమ్మెల్యే ప్రకాష్‌ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చందు అక్కడికి వచ్చారు.

అదేటైమ్‌ లో పరిటాల శ్రీరామ్‌ కూడా రావడంతో ఇద్దరూ ఎదురెదురై ఒకర్నొకరు పలకరించుకున్నారు. ఆప్యాయంగా భుజాలు భుజాలు కలుస్తూ ముందుకు నడిచారు. ఈసమయంలో అక్కడ ఈలలు, కేకలు మామూలుగా లేవు. ఇలా వరస పరిణామాలు చూస్తే మార్పు మొదలైందా అంటే.. అవుననే అనుకుంటున్నారట అక్కడి జనం.

ఎప్పటికీ కలవవు అనుకున్న జేసీ, పరిటాల కుటుంబాలు కలవడం ఏంటి, ఆప్యాయంగా కౌగిలింతలతో మాట్లాడుకోవడం ఏంటి, ఇప్పటికీ పచ్చగడ్డివేస్తే భగ్గుమనే తోపుదుర్తి సోదరులతో మాటలు కలపడం ఏంటి అనంత ఫ్యాక్షన్ చరిత్రలో ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో పరిటాల శ్రీరామ్ అనంత లో కొత్త రాజకీయ ఒరవడికి శ్రీకారం చుట్టారు. చూడాలి మరి ఈ కొత్త రాజకీయం ఎంతవరకు సక్సెస్ అవుతుందో.