Begin typing your search above and press return to search.

ఎంపీ ర‌ఘురామ ఆ వ్య‌వ‌హారంలో పూర్తిగా ఇరుక్కున్న‌ట్టేనా?

By:  Tupaki Desk   |   6 July 2022 7:31 AM GMT
ఎంపీ ర‌ఘురామ ఆ వ్య‌వ‌హారంలో పూర్తిగా ఇరుక్కున్న‌ట్టేనా?
X
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భీమ‌వ‌రం పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో విధి నిర్వహణలో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ఫరూక్‌ బాషాపై ఎంపీ రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యులు దాడికి పాల్ప‌డిన సంగ‌తి తెలిసిందే. జూలై 5న సోమ‌వారం ఉదయం విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఫ‌రూక్ బాషాపై దాడి చేసి, అత‌డిని ఎంపీ ర‌ఘురామ మ‌నుషులు కిడ్నాప్‌ చేశార‌ని వార్త‌లు వచ్చాయి. ఈ వ్య‌వ‌హారంలో ఎంపీ ర‌ఘురామ పూర్తిగా ఇరుక్కున్నట్టేన‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్ ను కిడ్నాప్ చేసే ముందు ఎంపీకి భ‌ద్ర‌త‌గా ఉన్న కొందరు సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుళ్లతో ర‌ఘురామ కుటుంబ స‌భ్యులు వచ్చి నడిరోడ్డుపైనే ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ను చిత‌క‌బాదార‌ని వీడియోలు వెలుగుచూశాయి. ఇవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. కానిస్టేబుల్ ఫ‌రూక్ బాషా ఐడీ కార్డు లాక్కొని, ఈడ్చుకుంటూ ఎంపీ ఇంటికి తీసుకెళ్లి.. ఎంపీ ఇంటిలో రెండు గంటలకు పైగా కానిస్టేబుల్ ను చిత్రహింసలకు గురిచేశార‌ని అంటున్నారు. అనంతరం అనుమానిత వ్యక్తిగా గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు.

ఈ ఘ‌ట‌న‌పై ఓవైపు ఎంపీ కుటుంబ స‌భ్యులు, మ‌రోవైపు కానిస్టేబుల్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కాగా త‌న ఇంటి స‌మీపంలో త‌చ్చట్లాడుతుంటే గుర్తు తెలియ‌ని వ్య‌క్తిగా భావించి త‌న అనుచ‌రులు అత‌డిని ప్ర‌శ్నించార‌ని ఎంపీ చెబుతున్నారు. మ‌రోవైపు కానిస్టేబుల్ వాద‌న మ‌రోలా ఉంది. ప్ర‌ధాన‌మంత్రి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌ర్య‌టిస్తున్న నేప‌థ్యంలోనే నిఘా డ్యూటీలో ఉన్నాన‌ని కానిస్టేబుల్ చెబుతున్నారు. అయితే తాను ఉన్న‌ది ఎంపీ ఇంటికి కిలోమీట‌ర్ దూరంలో అని కానిస్టేబుల్ చెబుతున్నాడు.

హైద‌రాబాద్, విజయవాడ, భీమవరంలలో ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకునేందుకు ఆందోళనలకు కొందరు సిద్ధమవుతున్నట్టు పోలీసులు గుర్తించారని చెబుతున్నారు. దాంతో ఏపీ నుంచి హైదరాబాద్‌ వచ్చిన సంఘాల ప్రతినిధులు, ఆందోళనకారులు, అనుమానితుల కదలికలను గుర్తించేందుకు ఏపీ ఇంటెలిజెన్స్‌ విభాగం కొందరు కానిస్టేబుళ్లను హైదరాబాద్‌లో స్పాటర్స్‌గా నియమించింద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఏపీ అధికారులు అనంతపురానికి చెందిన కానిస్టేబుల్‌ ఫరూక్‌ బాషాను హైదరాబాద్‌లోని ఐఎస్‌బీ గేటు వద్ద స్పాటర్‌గా నియమించార‌ని స‌మాచారం.

మ‌రోవైపు ఎంపీ ర‌ఘురామ మాత్రం త‌న‌ను హత్యచేయడానికి, త‌న‌ కుటుంబాన్ని హత్య చేయడానికి ఏపీ సీఐడీ పోలీసులు తన ఇంటివద్ద రెక్కీ చేస్తున్నారంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అయితే సోష‌ల్ మీడియాలో వెలుగుచూసిన వీడియోలు అన్నీ ఈ వ్య‌వ‌హారంలో ర‌ఘురామ‌దే త‌ప్పు అన్న‌ట్టు చూపుతున్నాయ‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ర‌ఘురామ‌రాజు, ఆయ‌న కుమారుడు, వ్య‌క్తిగ‌త సిబ్బంది, సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్ల‌పై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని చెబుతున్నారు.

ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫ‌రూఖ్ ను రఘురామ ఇంటిలోకి చొరబడుతూ ఉండగా పట్టుకోలేదని అంటున్నారు. ఐఎస్‌బి ప్రాంతంలో ఉండ‌గా రఘురామ సెక్యూరిటీ గార్డులు బలవంతంగా ఎత్తుకుపోయారని చెబుతున్నారు. ఈ వివాదం.. వీడియోలు కూడా బయటకు రావడంతో.. ఆయన సెక్యూరిటీకి నియమించిన సీఆర్పీఎఫ్‌ జవాన్లను కూడా సస్పెండ్ చేశారు. ఆ వీడియోలు కూడా క‌ల్పితం కాద‌ని.. పుటేజ్ స‌రిగ్గానే ఉంద‌ని అంటున్నారు. ఆ వీడియోల‌ను కూడా రోడ్డు మీద వ్య‌క్తులే తీశార‌ని చెబుతున్నారు.

ఎంపీ ర‌ఘురామ ఇంటివద్ద కానిస్టేబుల్ ను ప్రశ్నిస్తున్నట్లుగా ఉన్న వీడియోలు ఇదివరకే బయటకు వచ్చిన‌ సంగ‌తి తెలిసిందే. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫ‌రూఖ్ ను పట్టుకుని.. కొట్టినందుకు ఎంపీ భద్రతా సిబ్బందిని నోయిడా సీఆర్పీఎఫ్ కమాండెంట్ సస్పెండ్ కూడా చేశారు.

మ‌రో వైపు పరూఖ్ ఇప్ప‌టికే రఘురామ, ఆయన కొడుకు, ఆయన భద్రత సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. వెలుగు చూసిన వీడియోలు కూడా ఎంపీదే త‌ప్ప‌ని నిరూపిస్తున్నాయ‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఎంపీ ర‌ఘురామ తీవ్ర ఇబ్బందుల్లో ప‌డిన‌ట్టేన‌ని చెబుతున్నారు.