Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు కొత్త రూల్ ఆ నేత‌ల్లో ఆందోళ‌న పెంచుతోందా?

By:  Tupaki Desk   |   15 Aug 2022 11:30 AM GMT
చంద్ర‌బాబు కొత్త రూల్ ఆ నేత‌ల్లో ఆందోళ‌న పెంచుతోందా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీ గెలుపు వ్యూహాలు ప‌న్నుతోంది. ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు ఇప్ప‌టి నుంచే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల ఎంపిక‌, త‌దిత‌రాల‌పై దృష్టి సారిస్తున్నారు. కాగా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి చంద్ర‌బాబు ఒక సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నార‌ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. బాబు తీసుకున్న నిర్ణ‌యం కొంత‌మంది టీడీపీ నేత‌ల్లో ఆందోళ‌న పెంచుతోంద‌ని చెబుతున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒక కుటుంబానికి ఒక్క సీటే ఇవ్వాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించార‌ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఒక‌వేళ చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యమే నిజ‌మైతే కొంత‌మంది టీడీపీ నేత‌ల కుటుంబాల్లో ఒక్క‌రికే సీటు ద‌క్కే అవ‌కాశాలున్నాయి. ఈ విధంగా చూసిన‌ప్పుడు అనంత‌పురం జిల్లాలో జేసీ దివాక‌ర్ రెడ్డి, జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, క‌ర్నూలు జిల్లాలో కోట్ల కుటుంబం నుంచి కోట్ల సూర్య‌ప్ర‌కాష్ రెడ్డి, ఆయ‌న స‌తీమ‌ణి కోట్ల సుజాత‌మ్మ‌, భూమా కుటుంబం నుంచి భూమా అఖిల ప్రియ‌, భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి, ఎస్వీ మోహ‌న్ రెడ్డి, కేఈ కుటుంబంలో కేఈ కృష్ణ‌మూర్తి, కేఈ ప్ర‌భాక‌ర్, కేఈ శ్యామ్ బాబుల్లో ఒక‌రికే సీటు ద‌క్కుతుంది.

ఇంత‌కుముందు వ‌ర‌కు ఈ కుటుంబాల నుంచి ఇద్ద‌రి చొప్పున సీట్లు ద‌క్కాయి. ఇద్ద‌రూ అసెంబ్లీకి కానీ, లేదంటే ఒక‌రు అసెంబ్లీకి పోటీ చేస్తే, మ‌రొక‌రు పార్ల‌మెంటుకు పోటీ చేయ‌డం కానీ చేసేవారు. ఇప్పుడు చంద్ర‌బాబు ఒక కుటుంబానికి ఒకే టికెట్ అనే నిర్ణ‌యం తీసుకుంటే ఈ కుటుంబాల్లో ఎవ‌రో ఒక‌రికి మాత్ర‌మే సీటు ద‌క్కుతుంది.

అలాగే అనంత‌పురం జిల్లాలో ప‌రిటాల సునీత‌, ఆమె కుమారుడు ప‌రిటాల శ్రీరామ్ రెండు టికెట్లు.. రాఫ్తాడు, ధ‌ర్మ‌వ‌రం ఆశిస్తున్నారు. అలాగే మాజీ ఎంపీ డీకే ఆదికేశవుల నాయుడి కుటుంబంలో ఆయ‌న స‌తీమ‌ణి డీకే స‌త్య‌ప్ర‌భ‌, ఆయ‌న కుమారుడు శ్రీనివాస్ రాజంపేట ఎంపీ, చిత్తూరు అసెంబ్లీ సీట్ల‌ను ఆశిస్తున్నార‌ని చెబుతున్నారు. అలాగే మాజీ మంత్రి అమ‌ర్నాథ్ రెడ్డి కుటుంబం కూడా ప‌ల‌మ‌నేరు, పుంగ‌నూరు టికెట్ల‌ను ఆశిస్తోంద‌ని అంటున్నారు.

ఇక ఉత్త‌రాంధ్ర‌లోని శ్రీకాకుళం జిల్లాలో దివంగ‌త ఎర్రం నాయుడి కుటుంబం నుంచి అచ్చెన్నాయుడు, ఎర్రం నాయుడు కుమారుడు రామ్మోహ‌న్ నాయుడు, కుమార్తె భ‌వానీ సీట్లు ఆశిస్తున్నారు. వీరిలో ఇప్ప‌టికే అచ్చెన్నాయుడు, భ‌వానీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. రామ్మోహ‌న్ నాయుడు ఎంపీగా ఉన్నారు.ఇక విజ‌య‌న‌గ‌రంలో జిల్లా నుంచి గ‌త ఎన్నిక‌ల్లో అశోక్ గ‌జ‌ప‌తిరాజు ఎంపీగా, ఆయ‌న కుమార్తె అదితి గ‌జ‌ప‌తిరాజు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా వీరిద్ద‌రూ సీట్లు ఆశిస్తున్న‌ట్టు స‌మాచారం.అదేవిధంగా విజ‌య‌న‌గ‌రం జిల్లా నుంచే మాజీ మంత్రి కిమిడి క‌ళా వెంక‌ట్రావు, ఆయ‌న సోద‌రుడి స‌తీమ‌ణి కిమిడి మృణాళిని సీట్లు ఆశిస్తున్నారు. ఇలాగే మ‌రికొన్ని చోట్ల కొన్ని కుటుంబాలు రెండు టికెట్లు కోరుతున్నాయ‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో ఒక కుటుంబంలో ఒకరికే సీటు అని చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకుంటే ఆయా రాజ‌కీయ కుటుంబాలు ఎలా స్పందిస్తాయ‌నేది వేచిచూడాల్సిందే. అస్స‌లు ఒక కుటుంబం ఒక సీటు మాత్ర‌మే అనే నిర్ణ‌యం టీడీపీకి విజ‌యాన్ని ఇస్తుందా? అనేవి ప్ర‌స్తుతానికి స‌మాధానం లేని ప్ర‌శ్న‌లు.