Begin typing your search above and press return to search.

పెరుగుతున్న గుండెపోటు.. ఆందోళనలో భారతీయులు..!

By:  Tupaki Desk   |   10 Dec 2022 5:36 AM GMT
పెరుగుతున్న గుండెపోటు.. ఆందోళనలో భారతీయులు..!
X
గుండెపోటుతో మరణించారనే వార్త ఒకప్పుడు చాలా అరుదుగా వినిపించేది. అది కూడా ముసలితనంలో ఉన్నవారిలో కన్పించేది. కానీ ఇప్పుడు మాత్రం గుండెపోటు అనే మాట ప్రతి నిత్యం ఎక్కడో ఒక చోట వినాల్సి వస్తుంది. అది కూడా చిన్న.. పెద్ద అని తేడా లేకుండా వస్తుండటం ప్రతి ఒక్కరినీ కలవరపాటుకు గురి చేస్తోంది.

ఇటీవల కాలంలో భారత్ లో గుండెపోటు మరణాలు.. స్ట్రోక్ కు గురవుతున్న వారి సంఖ్య ఊహించని స్థాయిలో పెరిగిపోయిందని లోకల్‌ సర్కిల్స్ సర్వేలో వెల్లడైంది. 357 జిల్లాలకు చెందిన 32 వేల మంది ప్రజల అభిప్రాయాన్ని సేకరించి నివేదికను తయారు చేశారు. ఈ సర్వే ప్రకారం.. తమ పరిచయస్తుల్లో ఒకసారి లేదా అంతకంటే ఎక్కువ కోవిడ్ బారిన పడిన వారు 61శాతం ఉన్నారని చెప్పారు.

28 శాతం మంది తీవ్రంగా వైద్య పరిస్థితులు అనుభవించినప్పటికీ కోవిడ్ బారిన పడలేదని వెల్లడించారు. 62 శాతం మంది రెండు సార్లు టీకాలు వేయించుకున్నట్లు చెప్పారు. 11 శాతం మంది ఒకే డోస్ టీకాలు తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే 8 శాతం మంది టీకాలు వేసుకోలేదని తెలిపారు.

గుండెపోటుకు గురైన వారిలో టీకాలు వేయించుకున్న వారితో పాటు వేయించుకోని వారు సైతం ప్రభావితమైనట్లు సర్వేలో వెల్లడైంది. సుమారు 51 శాతం మంది పౌరులు గత రెండేళ్లలో తమ సన్నిహితులు ఒకరు లేదా అంత కంటే ఎక్కువ మంది గుండెపోటు లేదా మెదడు స్టోక్.. రక్తం గడ్డకట్టడం.. నరాల సంబంధిత సమస్యలు.. క్యాన్సర్ సంబంధిత వ్యాధితో.. ఆకస్మిక పరిస్థితులకు గురైనట్లు వెల్లడించారు.

ఆరోగ్యవంతమైన యువకులు.. మధ్య వయస్సు గలవారు.. పురుషులు.. స్త్రీలు అనేక మంది మరణించినట్లు వెల్లడించారు. గత మూడు నెలల కాలంలో ఈ ఆకస్మిక మరణాలు ఎక్కువగా నమోదైనట్లు పేర్కొన్నారు. జిమ్.. డాన్స్ చేసేటప్పుడు.. నడక వంటి శారీరక శ్రమలో నిమగ్నమైన సమయంలో గుండెపోటుకు గురయ్యారని వెల్లడించారు.

ఈ సమయంలో వారంతా ఆందోళనకు గురి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం ఉన్నాయని పేర్కొన్నారు. అయితే కోవిడ్ టీకాలు వేయించుకున్న వారికి.. టీకాలు వేయించుకోని వారికి గుండెపోటు సంబంధిత విషయాల్లో పెద్దగా తేడా ఏమీ లేదని సర్వేలో వెల్లడైంది. అయితే టీకాలు తీసుకున్న వారు గుండెపోటుకు గురై నప్పటికీ ఎక్కువగా కోలుకున్నారని తేలింది.

తీవ్రమైన కోవిడ్ కు గురై ఆస్పత్రిలో చేరిన వారిలో 20 శాతం నుంచి 30 శాతం వరకు ట్రోపోనిన్ స్థాయిలు పెరగడం.. సిరల థ్రోంబో ఎంబోలిజం.. గుండెపోటు.. అరిథ్మియాల ద్వారా మయోకార్డియల్ ప్రమేయం ఉన్నట్లు రుజువు ఉందని ప్రభుత్వ మార్గదర్శకాలు చెబుతున్నాయి.

కోవిడ్ లేదా దాని సంబంధిత వ్యాధుల సమస్యలను సాధ్యమైనంత వరకు తగ్గించేలా కోవిడ్ రీఇన్‌ఫెక్షన్‌లను నివారించాల్సిన అవసరం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ సర్వేలో వెల్లడైన విషయాలను లోకల్ సర్కిల్ త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలిపారు. ఈ వివరాలను పరిశీలించి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.