Begin typing your search above and press return to search.

బ్రిటన్‌ ను ఇండియా రూల్‌ చేయనుందా?

By:  Tupaki Desk   |   28 March 2020 10:10 AM GMT
బ్రిటన్‌ ను ఇండియా రూల్‌ చేయనుందా?
X
శతాబ్దాల రాజరికం.. ఎన్నో దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకుని పాలించిన రాజ్యం. తెల్లదొరల పాలన అంటే గుర్తుకు వచ్చేది బ్రిటన్‌. మనల్ని దాదాపు 200 సంవత్సరాలకు పైగా పాలించిన బ్రిటీష్‌ రాజ్యంలో త్వరలోనే భారత పాలన రాబోతోందని ప్రచారం సాగుతోంది. శతాబ్దాల పాటు భారతదేశాన్ని పాలించి సంపదన్నంతా దోచుకెళ్లి సంపన్న రాజ్యంగా వెలుగొందని ప్రస్తుత బ్రిటన్‌ విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఈ పరిణామంలో భారతీయులు పాలన పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. మనల్ని దోచుకున్న బ్రిటీష్‌ వారి సొంత గడ్డపైనే భారతీయులు పరిపాలన చేయబోయే అరుదైన ఘట్టం త్వరలో ఆవిష్కృతం కాబోతోంది. దీనికి కారణం కరోనా వైరసే.

ప్రస్తుతం బ్రిటన్‌ అంటే లండన్‌ లో కరోనా వైరస్‌ తీవ్ర రూపం దాల్చింది. చైనా తర్వాత అమెరికా - ఇటలీ - స్పెయిన్ అనంతరం బ్రిటన్‌ దారుణ పరిస్థితులు ఎదుర్కొంటోంది. లండన్‌ లో ప్రజలపై తీవ్ర ఆంక్షలు విధించారు. ఆ దేశవ్యాప్తంగా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కరోనా వైరస్‌ ప్రభావంతో ఆ దేశాధినేతలే తీవ్రంగా సతమతమవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే బ్రిటన్‌ పాలకులంతా కరోనా వైరస్‌ బారిన పడ్డారు. రాణి - ప్రిన్సెస్‌ దంపతులు - ప్రధానమంత్రి - మంత్రులు కూడా కరోనా వైరస్‌ బారిన పడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వారంతా క్వారంటైన్‌ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో దేశాన్ని.. రాజ్యాన్ని పాలించే వారు లేకపోయారు. ప్రస్తుతం దేశం - రాజ్యానికి దిశానిర్దేశం చేయడానికి తాత్కాలికంగా కొందరికి అధికారం అప్పగించే అవకాశం ఉంది.

బ్రిటన్‌ లో ఇన్‌ చార్జ్‌ పాలన అమలు చేయబోతున్నారు. ఈ క్రమంలో ఆ దేశ పాలనను భారతీయుల చేతిలోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్థిక మంత్రిగా ఉన్న రిషి - హోంమంత్రిగా ఉన్న ప్రీతిలకు ఆ తాత్కాలిక బాధ్యతలు చేపట్టేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. ప్రీతి - రిషి భారత సంతతికి చెందినవారు. వారు అప్పట్లోనే హోంమంత్రి - ఆర్థిక మంత్రులుగా బాధ్యతలు చేపట్టడంతోనే భారతదేశం గర్వించింది. ఇప్పుడు ఆ దేశ పరిపాలన పగ్గాలు భారతీయుల చేతుల్లోకి వెళ్లే అరుదైన సందర్భం రానుంది. ఎందుకంటే భారత సంతతికి చెందిన వారు అయినప్పటికీ మన దేశంలో మాదిరి బ్రిటన్‌ లో కూడా రాణి - రాజు - ప్రధానమంత్రి అనంతరం హోంమంత్రి - ఆర్థికమంత్రి కీలకమైన వ్యక్తులు. ఇప్పుడు బ్రిటన్‌ లో ఆ కీలక స్థానాల్లో ఉన్న ప్రీతి - రిషి బ్రిటీష్‌ సామ్రాజ్య పాలనను తాత్కాలికంగా చేపట్టనున్నారు. ఈ మేరకు త్వరలోనే అమలు చేయనున్నారు. ఎందుకంటే దేశాన్ని నడిపించే నాయకుడు లేక ప్రస్తుతం కరోనా వైరస్‌ తీవ్రంగా వ్యాపిస్తోంది. ఇప్పుడు ఆ వైరస్‌ కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకుంటూనే ప్రజలను కాపాడాల్సిన బాధ్యత తాత్కాలిక పరిపాలకుడిపై ఆధారపడి ఉంది. లండన్‌ లో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే రిషి లేదా - ప్రీతి తాత్కాలికంగా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఇదే గనుక జరిగితే 200 ఏళ్ల చరిత్రలో బ్రిటన్‌ ను ఏలే వ్యక్తి భారతీయుడు అవుతాడు. పైగా బానిస బతుకు బతికిన భారతీయులు ప్రస్తుతం బ్రిటన్‌ బాధ్యతలు చేపట్టడం గమనార్హం.