Begin typing your search above and press return to search.

క‌రోనాతో భార‌త సంత‌తి ఎయిడ్స్ స్పెష‌లిస్ట్ మృతి

By:  Tupaki Desk   |   1 April 2020 5:00 PM GMT
క‌రోనాతో భార‌త సంత‌తి ఎయిడ్స్ స్పెష‌లిస్ట్ మృతి
X
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మాన‌వాళిని అత‌లాకుత‌లం చేస్తోంది. ఆ వైర‌స్ రాజును చూడ‌డం లేదు.. పేద‌ను చూడ‌డం లేదు.. ఆ వైర‌స్ ధాటికి మ‌నుషులు కుప్ప‌ల్లా రాలుతున్నారు. ఎంతోమంది ఆ వైర‌స్ బారిన ప‌డుతూ తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఆ మ‌హమ్మారి ప్ర‌పంచంలో వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. అయితే ఈ వైర‌స్ వైద్యుల‌ను కూడా వ‌ద‌ల‌డం లేదు. వైర‌స్ సోకిన వారికి వైద్యం అందిస్తున్న వైద్యులు - వైద్య సిబ్బందికి కూడా వైర‌స్ పాకుతోంది. కోవిడ్-19 బాధితులకు చికిత్స చేస్తున్న వైద్యులు కూడా దీనికి బలవుతున్నారు. వైర‌స్ సోకిన వారిలో చాలామంది వైద్యులు ఉన్నారు. ఈ క్ర‌మంలో ద‌క్షిణాఫ్రికాలో భారత సంతతికి చెందిన ప్రముఖ వైరాలజిస్ట్ మృత్యువాత ప‌డ్డారు. దీంతో ప్ర‌పంచంతో పాటు భార‌త‌దేశం నివ్వెర పోయింది. ప్రొఫెసర్ గీతా రామ్‌ జీ కరోనా వైరస్‌ కారణంగా కన్నుమూసినట్లు అధికారులు ప్రకటించారు.

ప్రపంచంలోనే ప్రముఖ వైరాలజిస్ట్‌‌ గా గుర్తింపు పొందిన డాక్టర్ గీతా రామ్‌ జీ (64) భార‌త్ కు చెందిన వారు. వ్యాక్సిన్‌‌ లు - హెచ్‌ ఐవీపై పరిశోధనలు చేస్తూ ఆమె దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డారు. వారం కిందటే బ్రిట‌న్ (లండన్‌) నుంచి దక్షిణాఫ్రికాకు చేరుకున్నారు. ఆ కొన్ని రోజుల‌కు ఆమె అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప‌రీక్ష‌లు చేయ‌గా క‌రోనా వైర‌స్ సోకింద‌ని నిర్ధారించారు. కరోనా వైరస్‌ తో బాధ‌ప‌డుతూ గీతా రామ్‌ జీ మృతి చెందార‌ని దక్షిణాఫ్రికా మెడికల్ రిసెర్చ్ కౌన్సిల్ ప్ర‌క‌టించింది.

దక్షిణాఫ్రికా వైద్య పరిశోధన మండలి క్లినికల్‌ ట్రయల్స్‌ విభాగం ప్రిన్సిపల్ రిసెర్చర్‌ గా గీతా రామ్‌ జీ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. హెచ్‌ ఐవీ నిర్మూలనపై విభాగం డైరెక్టర్‌ గా కూడా ఉన్నారు. హెచ్ ఐవీపై చేసిన పరిశోధనల‌తో ఆమె ప్రపంచ గుర్తింపు పొంద‌డంతో పాటు పలు అవార్డులను పొందారు. ఎయిడ్స్ నిర్మూలనలో సరికొత్త పద్ధతులను ఆవిష్కరించడంతో యూరోపియన్ డెవలప్‌ మెంట్ క్లినికల్ ట్రయల్స్‌ పార్ట్‌ నర్‌ షిప్స్ (ఈడీసీటీపీ) 2018లో ‘అసాధారణ మహిళా శాస్త్రవేత్త’ అనే అవార్డు గీత‌కు అందించారు. హెచ్‌ ఐవీ కారణంగా దక్షిణాఫ్రికాలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఆమె విశేషంగా కృషి చేశారు. ద‌క్షిణాఫ్రికాలో స్థిరపడ్డ భారత సంతతికే చెందిన ఫార్మసిస్ట్‌ ప్రవీణ్‌ రామ్‌ జీ ఆమె భ‌ర్త‌.