Begin typing your search above and press return to search.

కరోనా..పేరు విన్నారా? వినకుంటే తెలుసుకోవటం తప్పనిసరి

By:  Tupaki Desk   |   18 Jan 2020 5:36 AM GMT
కరోనా..పేరు విన్నారా? వినకుంటే తెలుసుకోవటం తప్పనిసరి
X
జ్వరం.. జలుబు.. ఇవేమీ పెద్ద జబ్బులు కావు. కానీ.. మారిన కాలానికి తగ్గట్లు చూస్తే.. ఇప్పుడీ రోగ లక్షణాలే మనిషి ప్రాణాలు తీసేస్తున్నాయి. జ్వరం పెద్ద విషయం కాదు. కానీ.. స్వైన్ ఫ్లూ కావొచ్చు.. డెంగ్యూ కావొచ్చు.. ఈ రెండింటిలోనూ జ్వరం కామన్. ప్రాణం మీదకు తీసుకొచ్చేది ఈ జ్వరమే. ఇలా చిన్నవిగా అనుకునే సమస్యలే ఇప్పుడు ప్రాణాలు తీసేస్తున్న పరిస్థితి. దీనికి కారణం జలుబు.. జ్వరం లాంటి సాధారణ జబ్బుల్ని తీసుకొచ్చే సరికొత్త వైరస్ ప్రపంచాన్ని వణికిస్తూ ఉంటుంది.

ఇప్పడు అలాంటి వైరస్ ఒకటి తాజాగా బయటకు వచ్చింది. దీనిపేరు కరోనా. చైనాలో వెలుగుచూసిన ఈ అంతుచిక్కని వైరస్ తో ఇప్పుడు కొత్త వణుకు మొదలైంది. ఇప్పటికే ఇద్దరి ప్రాణాలు తీసిన ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా చూసుకోవటం పెద్ద సమస్యగా మారింది. చైనాలో స్టార్ట్ అయి.. థాయ్ లాండ్.. జపాన్ లోనూ దీని బాధితులు ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ వైరస్ ఎలా వస్తోంది? ఎలా మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది? అన్నది ఇప్పుడో పెద్ద ప్రశ్నగా మారింది. తాజాగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ తో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ప్రపంచానికి సవాలుగా మారిన ఈ అంతుచిక్కని వైరస్ చైనాలో తొలిసారిగా బయటపడింది. తాజాగా జపాన్.. థాయ్ లాండ్ లోనూ ఈ వైరస్ వెలుగు చూడటంతో భారత్ అప్రమత్తమైంది. చైనాకు వెళ్లే వారు ఈ వైరస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

కరోనా వైరస్ ఎక్కడ నుంచి ఎలా వ్యాప్తి చెందుతోందన్నది స్పష్టంగా తెలీటం లేదంటున్నారు. ఊహాన్ సముద్రపు ఆహారాన్ని అమ్మే ఒక మార్కెట్ నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లుగా భావిస్తున్నారు. ఈ వైరస్ ఎలా సోకుతుందన్న దాని మీద స్పష్టత రావటం లేదు. అయితే.. ఈ వైరస్ సోకిన వారికి తొలుత జలుబు లక్షణాలు కనిపిస్తాయి. తర్వాత శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. తీవ్రమైన న్యుమోనియా వచ్చే అవకాశం ఉంది. చైనాకు వెళ్లే వారు పచ్చి మాంసం తినకూడదని.. పశు పోషణ కేంద్రాలు.. కబేళాలకు వెళ్లకూడదని చెబుతున్నారు. దగ్గు ముక్కుకారటం లాంటి లక్షణాలున్న వారికి దూరంగా ఉండాలని.. మాస్క్ లు ధరించాలని చెబుతున్నారు. సో.. బీకేర్ ఫుల్.