Begin typing your search above and press return to search.

అసెంబ్లీ ర‌ద్దు.. స‌రే.. టీడీపీలో ఎంత మంది రెడీ..!

By:  Tupaki Desk   |   23 Sep 2021 5:40 AM GMT
అసెంబ్లీ ర‌ద్దు.. స‌రే.. టీడీపీలో ఎంత మంది రెడీ..!
X
రాష్ట్ర ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో ఈ విష‌య‌మే ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే.. పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నుంచి రాష్ట్ర అధ్య‌క్షుడు కింజ‌రాపు అచ్చ‌న్నాయుడు వ‌ర‌కు ఇద్ద‌రు నేత‌లు కూడా సీఎం జ‌గ‌న్‌ను చేసిన డిమాండ్‌.. ద‌మ్ముంటే.. అసెంబ్లీని ర‌ద్దు చేసి.. ఎన్నిక‌ల‌కు రావాల‌ని..! ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో త‌మ‌కు ప్ర‌జ‌లు సంపూర్ణ మ‌ద్ద‌తు క‌ట్ట‌బెట్టార‌ని.. వారికి మ‌రింత సేవ చేసే బాధ్య‌త పెరిగింద‌ని.. సీఎం జ‌గ‌న్ చెప్పారు. అస‌లు ప‌రిష‌త్‌కు మేం పోటీ కూడా ఇవ్వ‌లేద‌ని.. టీడీపీ నాయ‌కులు చెబుతూ.. చేసిన కామెంట్ ఇది. మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్దాం రండి అంటూ.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు, అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

మ‌రి.. ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా చేశారా ? లేక కావాల‌నే చేశారా ? అనేది.. ఆస‌క్తిగా మారింది. అంతేకాదు.. ఒక‌వేళ‌.,. ఇప్ప‌టికిప్పుడు అసెంబ్లీ ఎన్నిక‌లే వ‌స్తే.. చంద్ర‌బాబు కానీ, టీడీపీ నాయ‌కులు కానీ.. ఏమేర‌కు రెడీగా ఉన్నారు ? అనేది ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌గా మారింది. ఎందుకంటే.. సార్వత్రిక ఎన్నిక‌లు జ‌రిగి కేవ‌లం రెండున్న‌రేళ్లు మాత్రమే (ఇంకా రెండు నెల‌లు త‌క్కువే) అయింది. సో.. ఆ ఎన్నిక‌ల్లో పార్టీకి తీవ్ర‌మైన ఎదురు దెబ్బ త‌గిలింది. అప్ప‌టి నుంచి అనేక మంది నాయ‌కులు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇది ఒక స‌మ‌స్య అయితే.. ఆర్థికంగా కూడా పార్టీలో నేత‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు.

దీనికి ఇటీవ‌ల జ‌రిగిన మునిసిప‌ల్‌ ఎన్నిక‌లే నిద‌ర్శ‌నం. ఈ ఎన్నిక‌ల‌ను టీడీపీ బ‌హిష్క‌రించ‌లేదు క‌దా! అయిన‌ప్ప‌టికీ.. అభ్య‌ర్థుల‌కు అంతో ఇంతో నిధులు స‌మ‌కూర్చాల్సిన అవ‌స‌రం వ‌స్తే.. నాయ‌కులు చేతులు ఎత్తేశారు. మ‌రి మునిసిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌లోనే ఈ ప‌రిస్థితి ఉంటే.. ఇప్ప‌టికిప్పుడు అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌స్తే.. పార్టీలో ఖ‌ర్చు చేసేవారు ఎవ‌రు ఉన్నారు? అనేది ప్ర‌శ్న‌. పోనీ.. పార్టీనే స‌మ‌కూర్చుతుం ది! అనుకున్నా.. 2014, 2019 ఎన్నిక‌ల్లో పెట్టుబ‌డులు పెట్టిన వారిలో చాలా మంది.. ఇప్పుడు అమ‌రావ‌తి రాజ‌ధాని వివాదంతో ఆర్థికంగా ఇబ్బందులు ప‌డుతున్నారు.

అంతేకాదు.. చాలా మంది పారిశ్రామి క వేత్త‌లు ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు. క‌రోనా వ‌ల్ల కావొచ్చు. లేదా.. మోడీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల వ‌ల్ల కావొచ్చు. సో.. ఇప్పుడు.. గ‌త ఎన్నిక‌ల్లో మాదిరిగా.. ఖ‌ర్చు పెట్టే ప‌రిస్థితి లేదు. మ‌రోవైపు అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ ప‌రిస్థితి ఇబ్బందిగా మారింది. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కుల లేమి క‌నిపిస్తోంది. ఇంకొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ హ‌వా క‌నిపిస్తోంది.

మ‌రోవైపు.. ప్ర‌భుత్వ ప‌థ‌కాల జోరు తీవ్రంగా ఉంద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. క్షేత్ర‌స్థాయిలో అంటే.. విజ‌య‌వాడ‌, విశాఖ, తిరుప‌తి, క‌ర్నూలు వంటి మ‌హాన‌గ‌రాల్లో టీడీపీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు పెరిగాయి. వెర‌సి.. ఇప్ప‌టికిప్పుడు అసెంబ్లీ ర‌ద్ద‌యితే.. న‌ష్ట‌పోయేది టీడీపీనేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.