Begin typing your search above and press return to search.

ఇండియన్స్ నే కాదు.. అమెరికన్స్ ను కుప్ప కూలుస్తున్న హిండెన్ బర్గ్!

By:  Tupaki Desk   |   24 March 2023 11:41 AM GMT
ఇండియన్స్ నే కాదు.. అమెరికన్స్ ను కుప్ప కూలుస్తున్న హిండెన్ బర్గ్!
X
మందిది మంగళవారం.. మనది సోమవారం అన్నట్టుగా ఉంది హిండెన్ బర్గ్ పరిస్థితి. మన దేశంలోనే అపర కుబేరుడు.. అప్పటివరకూ ప్రపంచ టాప్ 3 కుబేరుడిగా ఉన్న గౌతం అదానీ కంపెనీలపై అమెరికా సంస్థ హిండెన్ బర్గ్ రిపోర్ట్ కుప్పకూల్చింది. గౌతం అదానీని టాప్ 3 నుంచి 30కి పడిపోయేలా చేసింది. దాదాపు 12 లక్షల కోట్లు ఆయన సంపద కరిగిపోయేలా హిండెన్ బర్గ్ రిపోర్ట్ ప్రేరేపించిందన్న విమర్శలున్నాయి. అయితే ఇండియన్స్ నే ఈ సంస్థ టార్గెట్ చేసిందని బీజేపీ ఆరోపించింది. అయితే ఇప్పుడు ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్స్ పై సంచలన నివేదిక బయటపెట్టింది. అయితే ఆయన కొత్త కంపెనీపై సంచలన రిపోర్ట్ విడుదల చేసింది. అయితే అది అదానీ అంత గట్టిగా లేవు. దీంతో ఈ హిండెన్ బర్గ్ నివేదికలు కేవలం ఇండియన్స్ ను టార్గెట్ చేయడానికేనా? అన్న విమర్శలు మొదలయ్యాయి.

అదానీ సంపద 60శాతం పడిపోయేలా చేసిన హిండెన్ బర్గ్ తాజాగా అమెరికా కంపెనీ ‘బ్లాక్ ఇంక్’ను టార్గెట్ చేసింది. ఈ కంపెనీలో షార్ట్ పొజిషన్లు ఉన్నట్టు హిండెన్ బర్గ్ గురువారం వెల్లడించింది. ట్విట్టర్ మాజీ ఫౌండర్ జాక్ డోర్సె ఈ పేమెంట్స్ కంపెనీ బ్లాక్ ఇంక్ ను ఏర్పాటు చేశాడు.

ఈ సంస్థ యూజర్ల సంఖ్యను ఎక్కువ చేసి చూపించడంతోపాటు కొత్త కస్టమర్లను చేజిక్కించుకునేందుకు చేస్తున్న ఖర్చునూ అధికం చేసి ఈ కంపెనీ చెబుతోందని హిండెన్ బర్గ్ ఆరోపిస్తోంది. రెండేళ్ల పాటు బ్లాక్ ఇంక్ పై పరిశోధనచేశామని డెమొగ్రాఫిక్స్ ను తనకు అనుకూలంగా మలుచుకొని ఈ కంపెనీ లాభపడుతోందని గుర్తించామని హిండెన్ బర్గ్ తెలిపింది. బ్లాక్ ఇంక్ అకౌంట్లలో 40-75 శాతం దాకా అకౌంట్లు పేక్ అకౌంట్లేనని ఆ కంపెనీ మాజీ ఉద్యోగులు అంచనా వేసినట్టు హిండెన్ బర్గ్ తెలిపింది. ఇందులో మోసం జరిగిందని.. అదనపు అకౌంట్లను క్రియేట్ చేయడమో లేదా ఎక్కువ అకౌంట్లు ఒకే వ్యక్తికి చెందినవిగానో తెలుస్తోందని ఆరోపించింది.

ఒక పెద్ద సామ్రాజ్యాన్నే సృష్టించిన జాక్ డోర్సే 5 బిలియన్ డాలర్లకు పైగా వ్యక్తిగత సంపద కూడబెట్టినట్టు ఆరోపించింది.

అయితే బ్లాక్ ఇంక్ పై హిండెన్ బర్గ్ రిపోర్టు ఆ కంపెనీపై ప్రభావం చూపలేదు. దాని షేర్ వాల్యూను కానీ.. నష్టాన్ని కానీ పెద్దగా చూపించలేదు. దీంతో హిండెన్ బర్గ్ భారతీయ సంస్థలు, పారిశ్రామికవేత్తలనే టార్గెట్ చేస్తోందా? అమెరికన్లపై పైపైనే నివేదికలు బయటపెట్టిందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.