Begin typing your search above and press return to search.

జ‌య‌ల‌లిత రూ..913కోట్ల ఆస్తికి వార‌సులు దీప‌క్‌ - దీప‌లే..హైకోర్టు తీర్పు

By:  Tupaki Desk   |   28 May 2020 11:10 AM GMT
జ‌య‌ల‌లిత రూ..913కోట్ల ఆస్తికి వార‌సులు దీప‌క్‌ - దీప‌లే..హైకోర్టు తీర్పు
X
తమిళనాడు ప్ర‌జ‌ల ఆరాధ్య‌దైవం.. మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల‌పై వివాదం రాజుకుంటూనే ఉంది. దీనిపై ఒక‌ప‌క్క ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటుంటే మ‌రోప‌క్క ఆమె వార‌సులుగా చెప్పుకుంటున్న ఆమె మేన‌ల్లుడు, మేన‌కోడ‌లు న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో జ‌య‌లలిత ఆస్తుల‌పై రోజుకో ప‌రిణామం జ‌రుగుతోంది. దాదాపు రూ.913 కోట్ల ఆస్తులపై హైకోర్టులో వాదోప‌వాదాలు జ‌రుగుతున్నాయి. దీనిపై తాజాగా మ‌ద్రాస్ హైకోర్టు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆ ఆస్తికి వార‌సులు జ‌య‌లలిత మేనల్లుడు దీపక్‌, మేనకోడలు దీప అని హైకోర్టు తేల్చిచెప్పింది.

జయలలిత సోదరుడి సంతానం దీప‌క్‌, దీప‌ల‌ను ద్వితీయ శ్రేణి వారసులుగా మద్రాసు హైకోర్టు బుధవారం స్పష్టమైన తీర్పు ఇచ్చింది. భారత వారసత్వ చట్టం ప్రకారం వారిద్దరినీ జయలలితకు ద్వితీయ శ్రేణి వారసులుగా ప్రకటిస్తున్నట్లు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్‌.కృపాకరన్‌, జస్టిస్‌ అబ్దుల్‌ ఖుదూ్‌సలతో కూడిన ధర్మాసనం నిర్ణ‌యించింది. జయలలిత నివాసగృహం వేదా నిలయాన్ని ప్రభుత్వం స్మారక మందిరంగా మార్చకూడదంటూ మేనకోడలు దీప పిటిష‌న్ దాఖలు చేసిన విష‌యం తెలిసిందే. ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రభుత్వానికి కొన్ని ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

జయలలితకు సంబంధించి కొన్ని ఆస్తులను కేటాయించి, ఆమె పేరుతో సేవాభావంతో కూడిన ట్రస్టును నిర్వహించే బాధ్యతలను దీప, దీపక్‌లకు అప్పగించాలని, దీనిపై 8 వారాల్లోగా తమకు నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జయలలిత ఆస్తులను నిర్వహించేందుకు ప్రత్యేక ట్రస్టులను నియమించాలని కోరుతూ అన్నాడీఎంకే నాయ‌కుడు పుగళేంది, జానకి రామన్‌ దాఖలు చేసిన పిటిషన్లను ఈ సంద‌ర్భంగా కోర్టు తోసిపుచ్చింది. ఈ క్ర‌మంలోనే జయలలిత నివాసం పోయెస్‌ గార్డెన్‌ను స్మారక మందిరంగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణ‌యించ‌డంతో ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునేటప్పుడు దానికి సంబంధించి నష్ట పరిహారం జయలలిత వారసులు దీపా, దీపక్‌లకు ఇవ్వాల‌ని ధర్మాసనం ఆదేశించింది.

జయ నివాస స్థలాన్ని స్వాధీనం చేసుకుని దానికి నష్ట పరిహారం చెల్లించే బదులు ఆ ధ‌నంతో నీటి పథకాలు, నీటి వనరుల శుద్ధీకరణ పనులకు ఉపయోగించవచ్చునని హైకోర్టు సూచించింది. ప్రజాధనాన్ని స్మారక మందిరాల నిర్మాణానికి దుర్వినియోగం చేయరాదని తెలిపింది. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడమే దివంగత నేతలకు అసలైన నివాళి అని గుర్తుచేసింది. జయ నివాసాన్ని స్మారక మందిరంగా చేయ‌డాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించాలని, అవసరమైతే కొంత భాగాన్ని స్మారక మందిరంగా మార్చి, మిగిలిన భాగాన్ని ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ఉపయోగించే విషయాన్ని పరిశీలించాలని సూచించింది.

ఈ క్ర‌మంలో జ‌య వార‌సులు దీప, దీపక్‌లకు 24 గంటలూ భద్రత కల్పించాలని, జయ ఆస్తులలో ఒకదానిని విక్రయించగా వచ్చే ధనాన్ని బ్యాంక్‌లో డిపాజిట్‌ చేసి ఆ వడ్డీని వారి భద్రతా చర్యలకు వినియోగించవచ్చునని హైకోర్టు తెలిపింది. అయితే జయ నివాసం రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా స్వాధీనం చేసుకునేలా గవర్నర్‌ భన్వరీలాల్‌ ఈనెల 22వ తేదీన ఆర్డినెన్స్‌ జారీ చేసిన త‌ర్వాత హైకోర్టు తీర్పు ఈ విధంగా రావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి రాష్ట్ర ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.