Begin typing your search above and press return to search.

మద్యం దుకాణాలకు రిజర్వేషన్లపై జోక్యం చేసుకోలేం : స్పష్టం చేసిన హైకోర్టు !

By:  Tupaki Desk   |   24 Nov 2021 9:30 AM GMT
మద్యం దుకాణాలకు రిజర్వేషన్లపై జోక్యం చేసుకోలేం : స్పష్టం చేసిన హైకోర్టు !
X
మద్యం దుకాణాల కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని, తెలంగాణ రిపబ్లికన్‌ పార్టీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌ రెడ్డిలతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది.

ఈ విచారణ లో భాగంగా మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో లేదని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లకు చట్టబద్ధత లేకపోయినప్పటికీ, కేవలం సానుభూతి, దయతో కల్పించిందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

మద్యం దుకాణాల కేటాయింపులో ప్రభుత్వం ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్ కల్పించిందని, అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలు 15.45 శాతం, ఎస్టీలు 9.08 శాతం ఉన్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. జనాభా ప్రాతిపదికను పరిగణలోకి తీసుకోకుండా రిజర్వేషన్లు ఖరారు చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.

దీనిపై స్పందించిన ధర్మాసనం, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కు విరుద్ధమో చెప్పాలని ప్రశ్నించింది. మద్యం దుకాణాల కేటాయింపు రిజర్వేషన్లలో జోక్యం చేసుకోలేమని, ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది. అయితే, మరిన్ని వివరాలు సమర్పించేందుకు కొంత సమయం ఇవ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోరగా.. విచారణ డిసెంబరు 20కి వాయిదా వేసింది.