Begin typing your search above and press return to search.

కేంద్రం మీద హరీశ్ కు అంత కోపం ఎందుకంటే?

By:  Tupaki Desk   |   5 July 2020 7:04 AM GMT
కేంద్రం మీద హరీశ్ కు అంత కోపం ఎందుకంటే?
X
విషయం మీద అవగాహన ఉన్న నేతలతో వచ్చిన చిక్కే ఇది. వారు ఎవరినైనా తప్పు పట్టేస్తారు. మొనగాడి ప్రభుత్వం అనే దాని పాలసీని నిలదీస్తారు. వారు ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేస్తారు. తాజాగా అలాంటి పనే మొదలు పెట్టారు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు. కేంద్రం అనుసరిస్తున్న విధానాల్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. వారి పాలసీ కారణంగా తెలంగాణ రైతులు నష్టపోతున్న వైనాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు.

ఇంతకీ జరిగిందేమంటే.. కేంద్రం అనుసరిస్తున్న ఎగుమతి.. దిగుమతి విధానం తెలంగాణ రైతులకు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఇస్తుందన్నది ఆయన వాదన. ఈ విధానంలో మార్పురావాలని ఆయన బలంగా కోరుకుంటున్నారు. అదెలా అంటే.. కందులు తెలంగాణలో పుష్కలంగా పండుతాయి. అది కూడా నాణ్యమైన పంట. కానీ.. కేంద్రం మాత్రం ఆఫ్రికా నుంచి కందుల్ని దిగుమతి చేసుకుంటోంది. దీన్ని తప్పు పడుతున్నారు హరీశ్.

దిగుమతుల్ని తాను వ్యతిరేకించటం లేదని చెప్పే హరీశ్.. కొరత ఉన్నప్పుడు దిగుమతి చేసుకోవాలే తప్పించి.. మన రైతులు అద్భుతంగా పంటలు పండిస్తున్నప్పుడు.. వాటిని కొనుగోలు చేయాలే తప్పించి.. దిగుమతి చేయటం ద్వారా మన రైతులు నష్టపోతారు కదా? అన్నది హరీశ్ వాదన.

కేంద్రం అనుసరిస్తున్న ఎగుమతి.. దిగుమతి పాలసీని మార్చాలని ఆయన కోరుతున్నారు. తెలంగాణలో కందులే కాదు.. నాణ్యమైన పత్తిని పండిస్తున్నారని.. ఆ పంటకు వచ్చే లాభం రైతులకే నేరుగా చెందాలన్నది హరీశ్ డిమాండ్. పరిశ్రమలకు.. దళారులకు లాభం కలిగిస్తూ.. రైతులకు నష్టం వాటిల్లే విధానాన్ని రద్దు చేయాలని ఆయన కోరుతున్నారు. హరీశ్ ధర్మాగ్రహాం కేంద్రాన్ని ఎంతమేర కదిలిస్తుందో కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.