Begin typing your search above and press return to search.

హార్డిక్ పాండ్యా.. కెప్టెన్సీ కాదు.. కెప్టెన్సీ లక్షణాలు నేర్చుకో..

By:  Tupaki Desk   |   28 Jun 2022 12:30 AM GMT
హార్డిక్ పాండ్యా.. కెప్టెన్సీ కాదు.. కెప్టెన్సీ లక్షణాలు నేర్చుకో..
X
మహేంద్ర సింగ్ ధోనీ.. టీమిండియా కెప్టెన్లలో అత్యుత్తమం. కానీ, జట్టు ట్రోఫీలు, టోర్నీలు గెలిచినప్పుడు.. కప్ జట్టులోని జూనియర్ల చేతికిచ్చేవాడు. అది ప్రపంచ కప్ అయినా ద్వైపాక్షిక సిరీస్ అయినా సరే ఇదే పద్ధతి పాటించేవాడు. అంతేకాదు.. జట్టులోని జూనియర్లు కష్టాల్లో ఉంటే కెప్టెన్ గా భరోసా నింపేవాడు. వారిని మ్యాచ్ విన్నర్లుగా చేసేవాడు. 2007 ప్రపంచ కప్ ఫైనల్లో జోగిందర్ శర్మతో చివరి ఓవర్ వేయించడం కానీ.. 2013 చాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మను ఓపెనర్ గా పంపడంలో కానీ.. విరాట్ కోహ్లీని భవిష్యత్ కెప్టెన్ అయ్యేలా, మేటి బ్యాట్స్ మన్ అయ్యేలా దన్నుగా నిలవడంలో కానీ.. ధోనీ పాత్ర మరువలేం. ధోనీ అనే కాదు.. భారత క్రికెట్ లో చాలామంది కెప్టెన్లు సహచరులను ప్రోత్సహించేవారు. ధోనీ ఇంకాస్త ఎక్కువగా మద్దతిచ్చేవాడు. అందుకే భారత క్రికెట్ లోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా నిలిచాడు. ఓ విధంగా చెప్పాలంటే కెప్టెన్లకు బెంచ్ మార్క్ ఏర్పాటు చేశాడు.

కోహ్లి, రోహిత్ అతడి బాటలోనే..కెప్టెన్ గా ధోనీ నెలకొల్పిన ప్రమాణాలను కోహ్లి, రోహిత్ ఆ తర్వాత అనుసరించారు. కోహ్లి తన ఐదేళ్ల కెప్టెన్సీలో ఎన్నోసార్లు జూనియర్లకు మద్దతుగా నిలిచాడు. కప్ లు అందుకుని వారి చేతుల్లో పెట్టి తాను వెనుక నిల్చున్నాడు. తాత్కాలిక సారథిగా వ్యవహరించిన సందర్భాల్లో రోహిత్ కూడా ఇంతే చేశాడు. ఇక రోహిత్ పూర్తి స్థాయి కెప్టన్ అయ్యాడు కాబట్టి మున్ముందు ఇలానే ఉంటాడనడంలో సందేహం లేదు.

మరోవైపు ఐర్లాండ్ తో రెండు టి20ల సిరీస్ కోసం ఈ దేశంలో పర్యటిస్తున్న టీమిండియాకు సారథ్యం వహిస్తున్న హార్దిక్‌ పాండ్యా ఇందుకు భిన్నంగా ప్రవర్తించాడంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మరీ ఇంత స్వార్థం పనికిరాదు అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. కెప్టెన్‌గా జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించాలని, అంతే తప్ప నేనే అంతా నడిపిస్తున్నాకదా అని విమర్శిస్తున్నారు. సీనియర్లను చూసి కాస్త నేర్చుకో అంటూ చురకలు అంటిస్తున్నారు. అది కూడా అరంగేట్ర ఆటగాడు ఉమ్రాన్ మాలిక్ పట్ల వ్యవహరించిన తీరుకు...

ఉమ్రాన్ కాదని.. హార్దిక్ బౌలింగా?టీమిండియా పేస్ ఆల్ రౌండర్ అయిన హార్దిక్ గాయాలతో రెండేళ్లుగా జట్టుకు దూరమయ్యాడు. కోలుకుని ఇప్పుడిప్పుడే జట్టులోకి తిరిగి వచ్చాడు. ఇటీవలి దక్షిణాఫ్రికాతో సిరీస్ లో రాణించాడు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ మంచి ప్రదర్శనే కనబర్చాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ .. ఇంగ్లండ్ తో టెస్టుకు వెళ్లిపోవడంతో ఐర్లాండ్ తో సిరీస్ కు పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చారు. డబ్లిన్‌ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌కు వరణుడు ఆటంకం కలిగించాడు.

దీంతో మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించారు. ఇక టాస్‌ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. ఐర్లాండ్‌ 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. పాండ్యా సేన 9.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 111 పరుగులు సాధించింది. తద్వారా ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది 1-0 ఆధిక్యంలో నిలిచింది. 3 ఓవర్లలో 11 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్‌ తీసిన యజువేంద్ర చహల్‌ను ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది. అయితే, హార్దిక్‌ పాండ్యాపై అభిమానుల ఆగ్రహానికి కారణం.. అరంగేట్ర ఆటగాడు ఉమ్రాన్‌ మాలిక్‌ పట్ల వ్యవహరించిన విధానం. ఈ మ్యాచ్‌లో స్పీడ్‌స్టర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌తో ఒకే ఒక ఓవర్‌ బౌలింగ్‌ చేయించిన పాండ్యా.. తాను మాత్రం రెండు ఓవర్లు వేశాడు.

ఉమ్రాన్ కు పూర్తి కోటా ఇవ్వాలిగా?150 కిలోమీటర్ల వేగంతో బంతులేస్తాడనే పేరున్న ఉమ్రాన్ నిలకడ కొనసాగిస్తే భవిష్యత్ లో భారత్ కు ప్రధాన బౌలర్ కాగలడు. దక్షిణాఫ్రికాతో సిరీస్ కు అతడిని ఎంపిక చేసి ఆడించక పోవడంపై ప్రశ్నలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐర్లాండ్ తో సిరీస్ లో ఉమ్రాన్ కు తొలి మ్యాచ్ లోనే అవకాశం దక్కింది. కానీ, మ్యాచ్ లో అతడికి ఒకే ఓవర్ ఇచ్చి.. హార్దిక్ 2 ఓవర్లు వేయడం గమనార్హం. ప్రధాన పేసర్ కాని హార్దిక్ 2 ఓవర్లు వేయడమేంటని అభిమానులు సోషల్‌ మీడియా లో ప్రశ్నిస్తున్నారు.

కెప్టెన్‌గా ముందు జట్టు గురించి ఆలోచించాలి.. ఆ తర్వాతే నీ గురించి అంటూ చురకలు అంటిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా రెండు ఓవర్లు బౌలింగ్‌ చేసిన పాండ్యా 26 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. ఉమ్రాన్‌ మాలిక్‌ తన ఓవర్‌లో 14 పరుగులు ఇచ్చాడు. కాగా ఐపీఎల్‌-2022లో 14 సార్లూ 'ఫాస్టెస్ట్‌ బాల్‌' అవార్డు గెలుచుకున్న ఉమ్రాన్‌ మొత్తంగా 22 వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే.