Begin typing your search above and press return to search.

అనంతపురంలో హిజ్రాల మధ్య గ్యాంగ్ వార్.. లోతుల్లోకి వెళితే ట్విస్టులెన్నో

By:  Tupaki Desk   |   30 July 2021 4:30 PM GMT
అనంతపురంలో హిజ్రాల మధ్య గ్యాంగ్ వార్.. లోతుల్లోకి వెళితే ట్విస్టులెన్నో
X
ఇప్పుడు చెప్పేది రీల్ కథ కాదు. రియల్ స్టోరీ. వినేందుకే విచిత్రంగా.. ఇప్పటివరకు చాలామంది వినని కొత్త రీతిలో చోటు చేసుకున్న ఈ గ్యాంగ్ వార్ ఇప్పుడు సంచలనంగా మారింది. రౌడీలు.. రాజకీయ పార్టీలకు చెందిన వారు.. మరికొన్ని వర్గాల మధ్య అధిపత్య పోరు చూసి ఉంటారు లేదంటే కనీసం విని ఉంటారు. కానీ.. అందుకు భిన్నంగా హిజ్రాల మధ్య సాగిన అధిపత్య పోరు.. గ్యాంగ్ వార్ ను తలపించిందని చెబుతారు. సినిమా రేంజ్ లో సాగిన ఈ గ్యాంగ్ వార్ కు సంబంధించిన విషయాలు బయటకు వస్తున్న కొద్దీ షాకుల మీద షాకులు తగులుతున్నాయి. రాయలసీమ.. హైదరాబాద్.. బెంగళూరుతో పాటు ఇతర ప్రాంతాల నుంచి అనంతపురం వచ్చిన ఈ హిజ్రాల మధ్య నెలకొన్న గొడవ రెండు వర్గాలుగా మారి కొట్టేసుకోవటం.. దాడులు..కిడ్నాపులు.. ఆరోపణలు.. నిరసనలతో అనంతపురం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది.

అసలేం జరిగిందంటే.. అనంతపురంలోని జయమణెమ్మ ఫంక్షన్ హాల్లో ''మన విజయం'' హిజ్రా అసోసియేషన్ కు చెందిన మయూరి ఆధ్వర్యంలో 'ఉలిగమ్మ ఉత్సవం' నిర్వహించారు. దీనికి కడప.. కర్నూలు.. చిత్తూరు.. అనంత.. నెల్లూరు.. బళ్లారి ప్రాంతానికి చెందిన 500 మంది హిజ్రాలతో పాటు.. హైదరాబాద్.. కర్ణాటకకు చెందిన మరో 120 మంది హిజ్రాలు హాజరయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు పంచాయితీ అప్పుడే మొదలైందట.
హైదరాబాద్ కు చెందిన సునితా నాయక్ ఆధ్వర్యంలో నడిచే సంఘానికి డబ్బులు చెల్లించకూడదని కర్ణాటక.. ఏపీకి చెందిన హిజ్రాలు డిసైడ్ చేశారట. దీనికి హైదరాబాద్ హిజ్రాలు అభ్యంతరం వ్యక్తం చేశారట. దీనిపై మాటామాటా పెరిగిందని.. ఉత్సవం ముగిసిన తర్వాత తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లే సమయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.

తమ ఊళ్లకు వెళ్లేందుకు హైదరాబాద్..కర్ణాటకకు చెందిన పలువురు అనంతపురం శివారులోని తపోవనం వద్దకు చేరుకోగా.. అక్కడ మరోసారి వాదులాట జరిగిందని.. ఈ సందర్భంగా అనంతపురానికి చెందిన చెందిన హిజ్రా రుక్సానాపై వారు దాడి చేసినట్లుగా చెబుతున్నారు. ఇది సినిమా రేంజ్ లో తన్నులాట జరిగిందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఒకరి వర్గానికి చెందిన హిజ్రాలను మరో వర్గం కిడ్నాప్ చేసిందని.. వారిని విడుదల చేయాలని ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో రాయలసీమ జిల్లాలకు చెందిన కొందరు హిజ్రాలపై దాడి చేసిన బెంగళూరుకు చెందిన హిజ్రాలు కొందరు నగలు.. డబ్బులతో ఊడాయించినట్లుగా చెబుతున్నారు.

దీంతో.. ఈ వర్గాల మధ్య రాయబారాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో అనంతపురం కలెక్టరేట్ వద్ద హిజ్రాలు పలువురు నిరసన ప్రదర్శన చేశారు. తమ వాళ్లను వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు వారి మధ్య సాగుతున్న రచ్చ బయటకు వచ్చింది. దీంతో అనంతపురం పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దాడులు.. ప్రతిదాడులకు పాల్పడి.. శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చిన పోలీసుల దెబ్బకు హిజ్రాలు కామ్ గా ఉన్నారంటున్నారు. ఏమైనా.. ఈ గ్యాంగ్ వార్ ఇంకా ఒక కొలిక్కి రాలేదన్న మాట వినిపిస్తోంది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. ఈ మొత్తం ఉదంతంపై విచారణ జరుపుతున్నారు. గ్యాంగ్ వార్ కు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని అనంతపురం పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.