Begin typing your search above and press return to search.

ఒడిశా రైలు ప్రమాద స్థలంలో భరించలేని దుర్వాసన.. ఎందుకంటే?

By:  Tupaki Desk   |   10 Jun 2023 12:33 PM GMT
ఒడిశా రైలు ప్రమాద స్థలంలో భరించలేని దుర్వాసన.. ఎందుకంటే?
X
ఒడిశాలో రైలు ప్రమాదం ఎంత బీభత్సం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 288 మంది మరణించగా... 1100 మందికి పైగా గాయాలయ్యాయి. అయితే ప్రమాదం జరిగిన స్థలం దగ్గర విపరీతమైన దుర్వాసనలు వెలువడుతున్నాయట. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేశారు.

అయితే స్థానికులు ఫిర్యాదు అందుకున్న అధికారులు అక్కడ ఇంకా మృతదేహాలు ఉన్నాయని భావిస్తున్నారు. రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దుర్వాసన రావడానికి గల కారణాలను తెలుసుకునే పనిలో పడ్డారు.

ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్‌ పరిధిలోని బహనాగా బాజార్‌ రైల్వే స్టేషన్‌ లో వారం రోజుల క్రితం అంటే జూన్‌ 2వ తేదీన ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన 7 రోజులు గడిచినా ఇప్పటికీ బహనాగా బాజార్‌ ప్రజలు ప్రమాద దృశ్యాలను మరువలేకపోతున్నారు అక్కడి స్థానికులు.

బహనాగా బాజార్‌ ప్రాంతంలో ఉంటున్నవారు చెబుతున్న దానిప్రకారం.... సంఘటనా స్థలంలో ఇంకా మృతదేహాలు ఉండే అవకాశం ఉంది. అటువైపు వెళుతున్నప్పుడు దుర్వాసన వెలువడుతోందని వారు అంటున్నారు. అయితే రైల్వే అధికారులు సంఘటనా స్థలంలో తనిఖీలు చేపట్టగా... ఒక్క మృతదేహం కూడా లభ్యం కాలేదు. కానీ చుట్టు పక్కల ప్రాంతాల్లోకి దుర్వాసన మాత్రం వస్తోంది.

ఎన్‌డీఆర్ఎఫ్‌ సంఘటనా స్థలంలో రెండుసార్లు పరిశీలనలు జరిపిందని, ఆ తరువాతనే సైట్‌ క్లియరెన్స్‌ ఇచ్చిందని సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే సీపీఆర్ఓ ఆదిత్య కుమార్‌ చౌదరి తెలిపారు. ఇది జరిగిన తరువాత కూడా స్థానికుల ఫిర్యాదుతో రాష్ట్రప్రభుత్వ అధికారుల బృందం సంఘటనా స్థలంలో పరిశీలనలు జరిపిందన్నారు. అయితే సంఘటనా స్థలంలో ఉన్న గుడ్ల కారణంగానే ఈ విధమైన దుర్వాసన వస్తున్నదన్నారు.

రైల్వే సీపీఆర్ఓ తెలిపిన వివరాల ప్రకారం యశ్వత్‌పూర్‌- హౌరా ఎక్స్‌ప్రెస్‌లో సుమారు 4 టన్నుల గుడ్లు లోడ్‌ చేశారు. ప్రమాద సమయంలో ఆ గుడ్లన్నీ పగిలిపోయాయి. ఈ ఘటన జరిగి ఏడు రోజులు కావడంతో ఆ గుడ్లన్నీ విపరీతంగా కుళ్లిపోయాయి. అందుకే ఇప్పుడు ఆ ప్రాంతంలో విపరీతమైన దుర్వాసన వస్తున్నదన్నారు. ఈ గుడ్ల చెత్తను తొలగించేందుకు బాలాసోర్‌ మున్సిపల్‌ సిబ్బంది సహాయం తీసుకుంటున్నామన్నారు.