Begin typing your search above and press return to search.

ఏంది.. షర్మిల పార్టీలో అప్పుడే అధిపత్య పోరు! షాకిచ్చిన నేత ఎవరంటే?

By:  Tupaki Desk   |   30 July 2021 4:30 PM GMT
ఏంది.. షర్మిల పార్టీలో అప్పుడే అధిపత్య పోరు! షాకిచ్చిన నేత ఎవరంటే?
X
రాజకీయాలకు మించిన సిత్రం మరొకటి కనిపించదు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించనలేనంత అనిశ్చిత రాజకీయాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడో జరిగే ఒక పరిణామం కొన్నిసార్లు పార్టీని తెగ ఇబ్బందికి గురి చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అందరిని సర్ ప్రైజ్ చేశారు వైఎస్ షర్మిల. పార్టీ పెట్టినప్పటికి.. ఇంతకీ తెలంగాణ రాజకీయాల్లో పట్టుకు షర్మిలకు ఉన్న అవకాశాలు ఏమిటన్న విషయంపై ఎంత థింక్ చేసినా కూడా అర్థం కాదన్న మాట తరచూ రాజకీయ నేతల మాటల్లో వినిపిస్తూ ఉంటుంది. తన ఎంట్రీతో రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు షాకిచ్చిన ఆమె.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనన్న విషయాన్ని ఆమె మరోసారి ఫ్రూవ్ చేశారు.

తెలంగాణలో పార్టీ నిర్మాణంలో తలమునకలుగా ఉండటమే కాదు.. ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఘాటు వ్యాఖ్యలు చేయటం ఒక ఎత్తు అయితే..ఒక్క మాట కూడా అనిపించుకోకుండా ఉండటం షర్మిలకే సాధ్యమని చెప్పాలి. ఇప్పటివరకు టీఆర్ఎస్ అధినేత మీద ఘాటు విమర్శ చేసిన వారిపై విరుచుకుపడే గులాబీ దళం.. షర్మిల విషయంలో మాత్రంఅంతులేని సంయమనం పాటించటం కనిపిస్తూ ఉంటుంది. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు షర్మిల తరచూ ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడుతూ తనను తాను బిజీగా ఉంచుకోవటమే కాదు.. తరచూ వార్తల్లో కనిపిస్తూ.. తానేదో చేయనున్నట్లుగా వ్యవహరిస్తుంటారు.

అలాంటి షర్మిలకు పార్టీ పరంగా ఉన్న బలం అంతంత మాత్రమే. తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలకు ఇప్పటికే పార్టీ ఇన్ చార్జులుగా పలువురును నియమించారు. తాజాగా అలాంటి ఇన్ ఛార్జ్ ఒకరు పార్టీ పదవికి రాజీనామా చేయటమే కాదు.. పార్టీకి గుడ్ బై చెప్పి షర్మిలకు షాకిచ్చారు. పార్టీ పెట్టారో లేదో.. అప్పుడే ఒకరు ఇలా రాజీనామా చేయటం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనికి కారణం పార్టీలో నెలకొన్న అధిపత్య పోరేనని చెబుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పార్టీ ఇన్ చార్జిగా ప్రతాప్ రెడ్డిని నియమించగా.. జిల్లాకు చెందిన మరో నేత తీరుపై ఆయన గుర్రుగా ఉన్నట్లు చెబుతారు.

పార్టీ నేత రాఘవరెడ్డి తీరుపై ఆగ్రహంతో ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేశారంటున్నారు. పార్టీలో నెలకొన్న అధిపత్య పోరే దీనికి కారణమంటున్నారు. తరచూ ప్రభుత్వ విధానాల్ని తప్పు పడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించే షర్మిలమ్మ తొలుత.. పార్టీ అంతర్గతవ్యవహారాల మీద ఫోకస్ పెడితే మంచిదంటున్నారు. పార్టీని పూర్తిస్థాయిలో విస్తరించకుండానే అధిపత్య పోరు షురూ కావటమా? అన్న విస్మయం వ్యక్తమవుతోంది. పార్టీ నేత రాజీనామా ఆమెకు ఎదురుదెబ్బగా చెబుతున్నారు. పార్టీ నుంచి బయటకు వస్తున్న చేవెళ్ల ప్రతాప్ రెడ్డి నోరు తెరిచి.. ఏదైనా వ్యాఖ్యలు చేస్తే.. షర్మిలమ్మకు డ్యామేజ్ తప్పదన్న మాట వినిపిస్తోంది. చూస్తుంటే.. షర్మిలమ్మకు కొత్త సవాళ్లు షురూ అయినట్లేనన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.