Begin typing your search above and press return to search.

లెక్క తేడా కొడుతోంది.. గులాబీ ఎమ్మెల్యే ఇంటిపై రాళ్లు రువ్విన రైతులు

By:  Tupaki Desk   |   17 Oct 2020 11:10 AM GMT
లెక్క తేడా కొడుతోంది.. గులాబీ ఎమ్మెల్యే ఇంటిపై రాళ్లు రువ్విన రైతులు
X
కోపం కట్టలు తెంచుకుంది. సహనానికి పరీక్ష పెడుతున్నారంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన రైతులు.. తాజాగా నిర్వహించిన ఆందోళనలో ఊహించని చర్యకు పాల్పడి సంచలనంగా మారారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చిన మెట్ పల్లి రైతులు భారీ ధర్నాను నిర్వహించారు. మొక్కజొన్న పండించిన రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న వేళ.. తమ పంటను కొనేందుకు సర్కారు ఏర్పాటు చేయకపోవటాన్ని తప్పు పడుతున్నారు.

తమ సమస్య పరిష్కారం కోసం మెట్ పల్లిలో భారీ ఎత్తున మహాధర్నాను నిర్వహించారు. ఈ ధర్నాలో దాదాపు మూడు వేల మందికి పైగా రైతులు తరలిరావటం చూస్తే.. సమస్య తీవ్రత ఎంతన్న విషయం కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుందని చెప్పాలి. వీరి ధర్నా కారణంగా ట్రాఫిక్ భారీగా ఆగిపోయింది. దీంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు.

మొక్కజొన్న పంట సాగు.. నిల్వల విషయంలో ఇప్పటికే సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకోవటం.. దేశవ్యాప్తంగా భారీ ఎత్తున పంట పండటంతో.. దీని డిమాండ్ తగ్గిపోవటమే కాదు.. ధర తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోనే యాసంగి సీజన్ లో మొక్కజొన్న పంట అస్సలు పండించొద్దని సీఎం కేసీఆర్ సూచన చేశారు. ఇక.. మహాధర్నా విషయానికి వస్తే.. తమ సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్న ఆవేదనను రైతులు వ్యక్తం చేస్తున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. మహా ధర్నాలో పాల్గొన్న కొందరు రైతులు కోరుట్ల ఎమ్మెల్యే కమ్ టీఆర్ఎస్ నేత విద్యాసాగర్ ఇంటిపైకి రాళ్లు రువ్వారు. దీంతో.. ఈ ధర్నా ఉద్రిక్తంగా మారింది. ఇప్పటివరకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలిచిన రైతులు.. ఇప్పుడు అందుకు భిన్నంగా అధికారపార్టీ ఎమ్మెల్యే ఇంటిపైకి రాళ్లురువ్వటం ప్రభుత్వానికి సరైన సంకేతం కాదంటున్నారు. ఎన్నికష్టాలు వచ్చినా ఓర్చుకునే రైతుకు ఎంత కడుపు మండితే తప్పించి..ఇలాంటి చర్యలకుపూనుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు. ఏమైనా మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం కేసీఆర్ సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చేసినట్లు చెప్పక తప్పదు.