Begin typing your search above and press return to search.

క‌విత‌కు ఊహించ‌ని షాక్‌.. ఈడీ వాద‌న‌ల్లో రెండు నిమిషాల‌కోసారి ఆమె పేరు!

By:  Tupaki Desk   |   30 May 2023 8:57 PM GMT
క‌విత‌కు ఊహించ‌ని షాక్‌.. ఈడీ వాద‌న‌ల్లో రెండు నిమిషాల‌కోసారి ఆమె పేరు!
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ క‌విత‌కు.. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో ఊహించ‌ని ప‌రిణామం ఎదురైంది. ఈ కేసును విచారిస్తున్న ఈడీ అధికారులు రెండు రోజుల కింద‌ట రౌస్ ఎవెన్యూస్ హౌస్ కోర్టులో దాఖ‌లు చేసిన చార్జిషీట్‌లో ఆమె పేరును ప్ర‌స్తావించ‌లేదు. అయితే.. మంగ‌ళ‌వారం జ‌రిగిన సుదీర్ఘ వాద‌న‌ల్లో మాత్రం ప్ర‌తి రెండు నిముషాల‌కు ఒక‌సారి క‌విత పేరును ప్ర‌స్తావించారు. లిక్కర్ పాలసీ ద్వారా పెద్ద కుంభకోణమే జరిగిందని, అరుణ్ పిళ్లై సౌత్ గ్రూప్‌లో కీలక వ్యక్తి అని ఈడీ త‌ర‌ఫున న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు.

క‌ల్వ‌కుంట్ల‌ కవితకు సంబంధించిన వ్యక్తిగా ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో అరుణ్ పిళ్లై వ్యవహరించారని ఈడీ త‌రఫున న్యాయ‌వాది అన్నారు. లిక్కర్ దందాలో వచ్చిన లాభాలతో స్థిరాస్తులు భారీగా కొన్నారని, లిక్కర్ వ్యాపారానికి సంబంధించి కవితతో పలుమార్లు సమావేశాలు జరిగాయని, ఆమెచాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని కోర్టుకు వివ‌రించారు. ఫీనిక్స్ శ్రీహరితో కలిసి కవిత భర్త అనిల్, బుచ్చిబాబులు హైదరాబాద్‌లో ప్రాపార్టీలు కొన్నారని తెలిపారు. లిక్కర్ కేసులో కవిత పాత్రపై నోటీసులు ఇచ్చి విచారణ జరిపామ‌ని కోర్టుకు వివ‌రించారు.

ఇదిలావుంటే, ఢిల్లీ లిక్క‌ర్‌ కుంభకోణంలో మొత్తం రూ. 623 కోట్ల అవినీతి జరిగిందని ఈడీ తేల్చింది. హవాలాకు ఉపయోగించిన నోట్లను కూడా ఈడీ బయటపెట్టింది. రూ.50, రూ.20 ల నోట్ల ఫోటోలను ఛార్జిషీటులో ఈడీ పొందుపరిచింది. హైదరాబాద్ నుంచి రూ.30 కోట్లు హవాలా మార్గంలో నిందితులు తరలించారని ఈడీ అధికారులు తేల్చారు. ఢిల్లీ బెంగాలీ మార్కెట్‌లోని హవాలా బ్రోకర్ల ద్వారా నిందితులు వ్యవహరం నడిపినట్లు ఈడీ తేల్చింది. ఈ వ్యవహారంలో ఇద్దరు హవాలా బ్రోకర్లను ఈడీ అరెస్ట్ చేసింది. మనీశ్ సిసోడియాను 29వ నిందితునిగా చేర్చింది.