Begin typing your search above and press return to search.

ఏపీలో ఆ కుంభకోణంపై ఈడీ విచారణ షురూ.. 26 మందికి నోటీసులు!

By:  Tupaki Desk   |   5 Dec 2022 8:30 AM GMT
ఏపీలో ఆ కుంభకోణంపై ఈడీ విచారణ షురూ.. 26 మందికి నోటీసులు!
X
ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఇటీవల కాలంలో దూకుడు పెంచింది. వివిధ రాష్ట్రాల్లో కుంభకోణాలు, మనీలాండరింగ్‌ తదితర వ్యవహారాలపై భారీ ఎత్తున దృష్టి సారించింది. విచారణను వేగవంతం చేస్తోంది.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంపై ఈడీ విచారణ షురూ చేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో ఏపీ స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పోరేషన్‌.. జర్మనీకి చెందిన సీమెన్స్‌ సంస్థతో యువతకు నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చే విషయమై ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం విలువ రూ.3,350 కోట్లు.

ఈ రూ.3,350 కోట్లలో 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.370 కోట్లు. కాగా ఈ ప్రభుత్వ వాటాలోని రూ.370 కోట్లలో సుమారు 242 కోట్ల రూపాయలను పక్కదారికి మళ్లించారని అభియోగాలు నమోదయ్యాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో నిర్వహించిన ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

మరోవైపు యువతకు వృత్తి నైపుణ్యాలు అందించడానికి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న జర్మనీ సంస్థ సీమెన్స్‌ శిక్షణ పేరుతో రూ.370 కోట్లు తీసుకుంది. ఇందుకు సంబంధించి జీఎస్టీని కూడా చెల్లించకపోవడంతో అసలు విషయం బయటపడింది. ఫేక్‌ ఇన్‌ వాయిస్‌లతో ఎగనామం పెట్టారని జీఎస్టీ అధికారులు గుర్తించారు. దీనిపై వైసీపీ ప్రభుత్వం మరోవైపు సీఐడీ విచారణకు గతంలోనే ఆదేశించింది. ఇప్పుడు సీఐడీ కేసును తన పరిధిలోకి తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూపీ లాగుతోంది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్‌టాపిక్‌గా మారింది.

ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణానికి సంబంధించి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ గంటా సుబ్బారావు, మాజీ డైరెక్టర్‌ లక్ష్మీ నారాయణ, ఓఎస్డీ నిమ్మగడ్డ ప్రసాద్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. డిసెంబర్‌ 5న హైదరాబాద్‌ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఈ కుంభకోణంలో వీరితోపాటు నిందితులుగా ఉన్న మొత్తం 26 మందికి ఈడీ నోటీసులు ఇచ్చింది. యువతకు నైçపుణ్య శిక్షణ పేరుతో రూ.234 కోట్ల నిధులు మళ్లించినట్లు విచారణ అధికారులు గుర్తించారు. అనేక షెల్‌ కంపెనీలు ఏర్పాటు చేసి నిధులు మళ్లించినట్టు అభియోగాలు ఉన్నాయి.

ఇప్పుడు ఈడీ ఈ కేసును విచారిస్తుండటంతో పెద్ద తలకాయల పేర్లు బయటకొస్తాయని భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో మున్ముందు కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని భావిస్తున్నారు.

ఇన్‌వెబ్‌ సర్వీస్‌ నుంచి సీమెన్స్‌తో పాటు డిజైన్‌ టెక్‌ కంపెనీకి నిధుల మళ్లింపు జరిగింది. కార్పొరేషన్‌ మాజీ ఎండీ గంటా సుబ్బారావుకు చెందిన ప్రతీక్‌ ఇన్ఫో సర్వీసెస్‌కు రూ. కోట్ల నిధులను మళ్లించినట్టు చెబుతున్నారు.

సీమెన్స్‌ 90 శాతం నిధులను విడుదల చేసిందా..? లేదా..? సీమెన్స్‌ సంస్థ 90 శాతం నిధులు విడుదల చేస్తే ఆ నిధులమేయ్యాయనే కోణంలో ఈడీ దర్యాప్తు సాగిస్తోంది. అలాగే సీమెన్స్‌ నిధులు విడుదల చేయకుండానే నాటి ఏపీ ప్రభుత్వం తన వాటాను విడుదల చేసిందా అనే అంశంలోనూ విచారణ చేస్తోంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.