Begin typing your search above and press return to search.

భరించలేని బరితెగింపు: రంగా హత్య వేళ ఆస్తుల్ని ధ్వంసం చేసింది మేమే

By:  Tupaki Desk   |   23 Oct 2021 4:55 AM GMT
భరించలేని బరితెగింపు: రంగా హత్య వేళ ఆస్తుల్ని ధ్వంసం చేసింది మేమే
X
తెగింపు తప్పేం కాదు. బరితెగింపుతోనే ఇబ్బంది అంతా. ఇప్పుడు అలాంటి తీరునే ప్రదర్శిస్తున్నారు కొందరు ప్రజాప్రతినిధులు. కోర్టు.. పోలీసులు.. చట్టం లాంటివి ఉంటాయన్న విషయాన్ని పట్టించుకోకుండా.. తామేం మాట్లాడినా నడిచిపోతుందన్నట్లుగా వ్యాఖ్యలు చేయటం ఇప్పటివరకు సినిమాల్లోనే చూశాం. ఇప్పుడు రియల్ గానే సరికొత్త ‘సినిమా’ను చూపిస్తున్నారు. తాజాగా కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ మాత్రం ఆలోచించకుండా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు విస్మయానికి గురి చేస్తున్నాయి.
రంగా హత్య వేళ కాకినాడలో టీడీపీ నేతల ఆస్తుల్ని మేమే ధ్వంసం చేశామని.. అప్పట్లో కాకినాడలో ఐదు రోజులు కర్ప్యూ విధించారన్నారు. రంగాను చంపితేనే తాము ఊరుకోలేదని.. అలాంటిది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డిని తిడితే ఎందుకు ఊరుకుంటామన్న ద్వారంపూడి.. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మీద కాకినాడలోనే దాడి చేయాలని నిర్ణయించామని.. కానీ తమ అధిష్ఠానం నుంచి అలాంటివి చేయొద్దని చెప్పటంతో ఆగినట్లుగా సంచలన ప్రకటన చేశారు.

తాజాగా నిర్వహించిన కాకినాడ జనాగ్రహ దీక్ష వేళ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు.. పవన్ కల్యాణ్ తో పాటు న్యాయస్థానాలపైనా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ముఖ్యమంత్రి జగన్ ను విమర్శించటానికి ఏ కారణం లేక లేనిపోని పదజాలంతో చంద్రబాబును దూషిస్తున్నారన్నారు. ఓపక్క కోర్టుల్ని అడ్డు పెట్టుకుంటున్నారన్న ఆయన ‘అయినప్పటికి జగన్మోహన్ రెడ్డి పోరాడుతున్నారు. చంద్రబాబు బ్రిటిష్ వారి లక్షణాలు ఉన్నాయి. కులాలు.. వర్గాలు.. గ్రూపులను విడగొడతారు’ అని విమర్శించారు.

పవన్ కల్యాణ్ ను ఆయన విడిచి పెట్టలేదు. ఆయనకు సూటి సవాలు విసిరారు. నువ్వు జనసేన సింహం అయితే చంద్రబాబుకు తొత్తుగా మారకుండా ఒంటరిగా పోటీ చేయాలని సవాలు విసిరారు. ‘నువ్వు ఎక్కడ పటీ చేసినా ఓడించి తీరుతాం. ప్యాకేజీలకు అలవాటు పడి చంద్రబాబుకు తొత్తుగా మారితే నీ జాతి నిన్నుక్షమించదు. మేమంతా రంగా నుంచి రాజకీయాలు నేర్చుకున్నాం’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చట్ట వ్యతిరేక చర్యల్ని చేశామన్న విషయాన్ని అంత ఓపెన్ గా చెప్పేసిన ద్వారంపూడి మాటలు ఇప్పుడు కలకలంగా మారాయి.