Begin typing your search above and press return to search.

పిట్ట పోరు.. పిట్ట పోరు పిల్లికి లాభం.. తెలుగు రాష్ట్రాల విలవిల!

By:  Tupaki Desk   |   18 July 2021 9:45 AM GMT
పిట్ట పోరు.. పిట్ట పోరు పిల్లికి లాభం.. తెలుగు రాష్ట్రాల విలవిల!
X
పిట్ట పోరు.. పిట్ట పోరు పిల్లి తీరిస్తే ఏమవుతుందో వందల ఏళ్ల క్రితమే మన పెద్దలు చిన్న సామెతతో చెప్పేశారు. ఆ విషయాన్ని మర్చిపోయిన ఇద్దరు ముఖ్యమంత్రులకు ఇప్పుడు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. అదే సమయంలో.. వివాదాల్ని ఎలా పరిష్కరించుకోవాలన్న విషయాన్ని తన తీరుతో ఇద్దరికి అర్థమయ్యేలా చేసింది కేంద్రం. కలిసి ఉంటే కలదు సుఖమన్నసామెతను ఇప్పటికైనా ఫాలో అయితే మరిన్ని చిక్కుల్లో పడకుండా ఉంటారు. విడిపోయి కలిసి ఉండాలన్న ప్రాథమిక నినాదాన్ని పక్కన పెడితే వచ్చే ఇబ్బందుల్ని ఉద్యమ నాయకుడిగా విజయం సాధించి.. ప్రజానాయకుడిగా రూపాంతరం చెందిన కేసీఆర్ అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

నిత్యం ఎదుటోడి మీద తప్పులు ఎత్తి చూపించటమే తప్పించి.. తాను తప్పులు చేయకూడదన్న విషయాన్ని మర్చిపోతే ఏం జరుగుతుందన్న విషయం కేసీఆర్ కు ఇప్పటికైనా అర్థమై ఉంటుంది. రాష్ట్రాల మధ్య తగవుల్ని తీర్చే వేళ.. కేంద్రం ఎప్పుడూ తాను పెద్దన్న పాత్రను పోషించాలనుకుంటుందే తప్పించి.. న్యాయంగా.. ధర్మంగా లెక్కలు తేల్చాలనుకోవటం అస్సలు ఉండదు. అందునా కేంద్రంలో మోడీ సర్కారు ఉన్నప్పుడు.. అలాంటివి ఆశించటమే అత్యాశే అవుతుంది. ఏడేళ్ల మోడీ పాలనను నిశితంగా చూసినప్పుడు రాష్ట్రాలకు పెద్ద పీట వేయటం లాంటివేమీ కనిపించవు. వీలైనంతవరకు రాష్ట్రాల మీద కేంద్రం అధిక్యతను ప్రదర్శించాలన్న ధోరణే కనిపిస్తుంది తప్పించి.. కేంద్రం.. రాష్ట్రాల మధ్య దూరాన్ని తగ్గించాలన్న భావన అస్సలు కనిపించదు.

రాష్ట్రాల జుత్తును తన గుప్పిట్లో ఉంచుకోవాలనుకునే మోడీ సర్కారుకు.. రెండు తెలుగురాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం అనుకోని వరంగా మారింది. తమకు ఎంతకు కొరుకుడుపడనివిగా ఉండే తెలుగు రాష్ట్రాల సాఫ్ట్ వేర్ ను క్రాక్ చేయాలన్న ధోరణి బీజేపీ అధినాయకత్వానికి మొదట్నించి ఉన్నదే. దీనికి తోడు.. తెలుగు రాష్ట్రాలకున్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో.. అదే పనిగా కేంద్రం వద్దకు వెళ్లి చేతులు జాచాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు జల వివాదం పేరుతో వచ్చిన అవకాశాన్ని కేంద్రం మాత్రం ఎందుకు ఒప్పుకుంటుంది? కొండ నాలుకకు వేస్తే ఉన్న నాలుక పోయిన చందంగా.. తాను నిర్మించే పలు ప్రాజెక్టులు అనుమతి లేకున్నా నిర్మిస్తున్న కేసీఆర్.. ఏపీ జల దోపిడీ చేస్తుందంటూ గుండెలు బాదుకోవటం.. నీ సంగతి చూస్తా అంటూ.. ఏపీని ఇరుకున పడేసేలా విద్యుదుత్పత్తి చేపట్టటం ద్వారా.. ఏపీ కేంద్రం వద్దకు వెళ్లేలా చేశారు.

ఇలాంటి అవకాశం కోసమే చూస్తున్న కేంద్రం.. కామ్ గా ఉండి.. తానేం చేయాలో అది చేసేసింది. రెండు తెలుగు రాష్ట్రాల జుత్తును తన చేతుల్లో పెట్టుకొని.. అప్పుడెప్పుడో పూర్తి అయిన ప్రాజెక్టులకు సంబంధించిన అజమాయిషీని బోర్డు పరిధికి తీసుకురావటం ద్వారా.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దిమ్మ తిరిగే షాకిచ్చింది. కేంద్రం జారీ చేసిన గెజిట్ ను అంగీకరించేది లేదని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. అదంత తేలిక కాదన్నది మర్చిపోకూడదు. ఎంట్రీ అన్నదే లేకుండా జాగ్రత్త పడాలే కానీ.. ఒకసారి ఎంట్రీ ఇచ్చాక తన చేతికి వచ్చిన అవకాశాన్ని కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవటానికి ఇష్టపడదు. పద్మవ్యూహంలోకి వెళ్లటమే కానీ తిరిగి రావటం సాధ్యం కాదన్నట్లుగా.. కేంద్రం చేతికి తీసుకెళ్లి అధికారాన్ని అప్పజెప్పిన తర్వాత.. తన చేతిలో ఉంచుకోకుండా రాష్ట్రాలకు ఎందుకు ఇస్తుందన్న మాట రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

మాటలు తేడా వచ్చినప్పుడు.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకున్నా.. ఒకరి ప్రతిపాదనలు మరొకరికి షేర్ చేసుకొని.. ఉభయ తారకం లాంటి నిర్ణయాలు తీసుకోవాలే తప్పించి.. పోరుబాటలోకి నడిచి.. కేంద్రం వద్దకు వెళితే ఇలాంటి పరిస్థితే ఉంటుంది. ముడి వేయటం చాలా తేలిక. కానీ.. విప్పదీయటమే కష్టం. తాజా పరిస్థితిని చూస్తే.. విభజనచట్టంలో తనకు సంక్రమించిన అధికారాలను అడ్డుపెట్టుకొని కృష్ణానదితో పాటు గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టులు సహా నిర్మాణంలో ఉన్న వివాదాస్పద ప్రాజెక్టులన్నింటిపై అధికారాలను సొంతం చేసుకుంటూ రెండు నదులకూ బోర్డులను ఏర్పాటు చేస్తూ కేంద్రప్రభుత్వం గురువారం అర్ధరాత్రి గెజిట్లు విడుదల చేసింది. అంటే.. కేంద్రం పీట ముడి వేసినట్లుగా చెప్పాలి. ఇక్కడ మరో విషయాన్ని గుర్తించాలి.

కీలకమైన గెజిట్ ను గురువారం అర్థరాత్రి విడుదల చేయటానికి ముందు.. మాట వరుసకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్రం కనీసం మాట్లాడకపోవటం.. వారి అభిప్రాయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేయకపోవటం చూస్తే.. తాము తీసుకునే నిర్ణయాలకు ఘాటుగా రియాక్టు అయ్యే శక్తి సామర్థ్యాలు తెలుగు రాష్ట్రాలకు లేవన్న ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లుగా చెప్పాలి. కేంద్రం తాజాగా ఏర్పాటు చేసిన బోర్డులో తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలు లేకుండా చేసి.. బోర్డు నిర్వహణకు అయ్యే ఖర్చును మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలు భరించాలన్న తీరు చూస్తే.. పిట్ట పోరు..పిట్ట పోరును పిల్లి తీరిస్తే ఇలానే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమయ్యేలా చేసింది.