Begin typing your search above and press return to search.

పైలట్ కు లైన్ క్లియర్.. సర్దుకు పోవటమే మహేందర్ రెడ్డికి మిగిలింది

By:  Tupaki Desk   |   29 May 2023 11:38 AM GMT
పైలట్ కు లైన్ క్లియర్.. సర్దుకు పోవటమే మహేందర్ రెడ్డికి మిగిలింది
X
తొందరపాటుతో జరిగే లాభం కంటే నష్టమే ఎక్కువ. ఈ విషయాన్ని మాజీ మంత్రి మహేందర్ రెడ్డి మిస్ అయినట్లున్నారు. వాతావరణం వాటంగా లేని వేళలో నోరు విప్పి మాట్లాడితే జరిగే నష్టం ఎంతన్నది ఇప్పటికైనా అర్థమై ఉంటుందంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయిన ఆయన.. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగాలని ఆశిస్తున్నారు. అయితే.. ఇప్పటికే ఆ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే (కాంగ్రెస్ లో గెలిచి గులాబీ కారు ఎక్కారు) పైలట్ రోహిత్ రెడ్డి తువాలు వేసేసుకున్న పరిస్థితి.

అయినప్పటికీ తనకే టికెట్ దక్కాలన్న ప్రయత్నాలు చేసిన ఆయన.. దానిపై క్లారిటీ రాకపోవటంతో నోటికి పని చెప్పారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి బీఆర్ఎస్ లోకి వచ్చిన వారందరిని ప్రజలు రిజెక్టు చేస్తారంటూ చేసిన వ్యాఖ్యలపై అధినాయకత్వం ఆగ్రహంతో ఉందంటున్నారు. అలాంటి మాటలు ఎందుకు మాట్లాడాలి? అన్న ప్రశ్నను సంధించటంతో పాటు తలంటు ప్రోగ్రాం కూడా పెట్టినట్లు చెబుతున్నారు.

తాను కారు గర్తుపైనే గెలిచానని.. వేరే పార్టీ నుంచి గెలవలేదన్న మహేందర్ రెడ్డి.. 2014లో విజయం సాధించినా.. 2018 ఎన్నికల్లో మాత్రం ఓడారు. ఆయనపై విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి గులాబీ కారు ఎక్కేయటం తెలిసిందే. మొన్నామధ్య ఫాంహౌస్ ఎపిసోడ్ లోనూ పైలట్ రోహిత్ రెడ్డి పాత్ర ఎంత కీలకమన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో పైలట్ కు కాకుండా తనకుటికెట్ వస్తుందన్న అంచనాలు వేసుకున్న మహేందర్ కు నిరాశని చెప్పాలి.

నిజానికి మహేందర్ రెడ్డికి.. ఆయన కుటుంబానికి గులాబీ బాస్ కేసీఆర్ చాలానే చేశారని చెప్పాలి. తాజాగా టికెట్ ప్రయత్నాల వేళ.. మహేందర్ కు కేసీఆర్ సన్నిహితులు భారీ క్లాస్ పీకినట్లుగా చెబుతున్నారు. మహేందర్ కు టికెట్ ఇచ్చే ఆలోచన కేసీఆర్ లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తూనే.. కేసీఆర్ కారణంగా మహేందర్ రెడ్డి ఫ్యామిలీ ఎంత లాభ పడిందన్న విషయాన్ని వారు గుర్తు చేయటం గమనార్హం.

మహేందర్ రెడ్డిని గతంలో మంత్రిగా అవకాశం ఇవ్వటం.. ఆయన సతీమణికి రెండోసారి జిల్లా పరిషత్ ఛైర్మన్ గా అవకాశం ఇవ్వటం లాంటివి చేసినా గత ఎన్నికల్లో ఓడారు. అయినప్పటికీ ఆయన్ను చిన్నబుచ్చటం ఇష్టం లేక ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఆయన సోదరుడు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఆయన కుటుంబానికి బోలెడంత చేసిన కేసీఆర్.. ఇప్పుడు పార్టీలోకి వచ్చిన పైలట్ ను కాదని ఆయనకు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.

అదే సమయంలో.. అనవసర పేచీలకు పోతే నష్టపోతారన్న హెచ్చరిక కూడా మహేందరర్ కు అందినట్లు చెబుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తాండూర్ టికెట్ పైలట్ రోహిత్ రెడ్డికి రూట్ క్లియర్ అయ్యిందని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో మహేందర్ రెడ్డి మౌనంగా సర్దుకుపోవటం మినహా మరో ఆప్షన్ లేదంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.