Begin typing your search above and press return to search.

చెలామణి లో ఉన్న కరెన్సీ నోట్ల లెక్కలు చెప్పిన ఆర్ బీఐ

By:  Tupaki Desk   |   31 May 2023 10:22 AM GMT
చెలామణి లో ఉన్న కరెన్సీ నోట్ల లెక్కలు చెప్పిన ఆర్ బీఐ
X
డిజిటల్ ఇండియా అంటూ గతంతో పోలిస్తే సామాన్యుడి జీవితంలో చాలానే తేడా వచ్చేసింది. టీ బంకు వాడి దగ్గర నుంచి ఆటో వరకు.. ఆ మాటకు వస్తే.. సామాన్లు కొనే దగ్గర.. ఇలా ఒకచోట కాదు.. ప్రతి చోటా చెల్లింపులు కరెన్సీ నోట్ల తో కంటే కూడా ఫోన్ ద్వారా డిజిటల్ పేలు ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి.

చివర కు భిక్షాటన చేసే వారు సైతం క్యూఆర్ కోడ్లు చూపించి దానం చేయమంటున్న వైనం తెలిసిందే. ఇలాంటి వేళ.. మార్కెట్లో కరెన్సీ నోట్ల వినియోగం తక్కువగా ఉండాలి కదా? కానీ.. అందుకు భిన్నంగా కరెన్సీ నోట్ల లెక్కలు ఆశ్చర్యానికి గురి చేసేలా ఆర్ బీఐ తాజాగా విడుదల చేసిన రిపోర్టు చెబుతోంది.

ఆర్ బీఐ తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదికలో కరెన్సీ నోట్ల వినియోగం లెక్కలు ఆసక్తికరంగా మారాయి. 2023 నాటికి చలామణిలో ఉన్న బ్యాంకు నోట్ల విలువ.. పరిణామం పెరగటం గమనార్హం. ఊరట కలిగించే ఒకే ఒక్క అంశం ఏమంటే.. ఈ పెరుగుదల శాతం తగ్గటం ఒక్కటే. చలామాణిలో ఉన్న మొత్తం నోట్ల లో విలువ పరంగా చూస్తే.. రూ.2వేల నోట్లు.. రూ.500నోట్లు వాటా 87.9 శాతం కాగా.. 2022 మార్చి 31 నాటికి 87.1 శాతంగా ఉండేది.

డినామినేషన్ పరంగా చూస్తే.. రూ.500నోట్ల డినామినేషన్ 37.9శాతం వాటా ఉంటే.. తర్వాతి స్థానంలో రూ.10నోటు ఉండటం గమనార్హం. దీని వాటా 19.2 శాతం. 2022 మార్చి చివరి నాటికి రూ.500 నోట్ల సంఖ్య 4,55,468 లక్షలు అయితే.. 2023 మార్చి నాటికి రూ.500 నోట్ల డినామినేసన్ నోట్లు 5,16,338లక్షలుగా పేర్కొన్నారు. అంటే.. వ్యవస్థలో రూ.500 నోట్లు పెరిగినట్లే. ప్రస్తుతం చలామణిలో ఉన్న డినామినేషన్ల విషయానికి వస్తే 2, 5, 10, 20, 50, 100, 200, 500, 2000 నోట్లు ఉండగా, అర్థరూపాయి..రూపాయి.. రెండు రూపాయిలు.. ఐదు రూపాయిలు.. 20 రూపాయిలు డినామినేషన్ తో నాణాలు ఉన్నట్లుగా రిపోర్టు వెల్లడించింది.

2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాంకు నోట్ల ఇండెంట్.. సరఫరాలు రెండూ గత ఏడాది 2021-22తో పోలిస్తే 1.6శాతం పెరిగాయి. రూ.2వేల నోట్ల ప్రింటింగ్ కు ఇండెంట్ లేదన్న విషయం తెలిసిందే. రూ.2వేల నోట్ల కు సంబంధించి ఆర్ బీఐ తాజాగా పేర్కొన్న లెక్కల్ని చూస్తే.. 2023 మార్చి చివరకు రూ.3,62,220 కోటల విలువ చూసే 4,55,468 లక్షల నోట్లు చెల్లుబాటులో ఉన్నాయి. 2022 మార్చి చివరి నాటి కి చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో 1.6 శాతం ఉంటే 2022-23 మార్చి చివరి నాటికి 1.3 శాతానికి తగ్గినట్లుగా ఆర్ బీఐ పేర్కొంది.