Begin typing your search above and press return to search.

ఏపీలో కరోనా పరిస్థితి ఏంటి

By:  Tupaki Desk   |   18 July 2021 7:46 AM GMT
ఏపీలో కరోనా పరిస్థితి ఏంటి
X
ఏప్రిల్ మధ్య వారం నుంచి మొదలైన కరోనా సెకండ్ వేవ్.. మే మొదటి వారంలో విశ్వరూపాన్ని చూపించింది. అప్పటి వరకు రోజుకు నలభై వేల కంటే తక్కువ కేసులు నమోదువుతున్న స్థానే.. రోజుల వ్యవధిలో మూడు లక్షలకు చేరుకోవటం.. ఆ పై నాలుగు లక్షల మార్కును అందుకునేందుకు వడివడిగా అడుగులు వేసిన వైనం.. ఆ సందర్భంగా దేశ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల గురించి తెలిసిందే. ఆక్సిజన్ కోసం పరుగులు పెడుతూ.. ఆసుపత్రుల్లో బెడ్ల కోసం బారులు తీరి.. చివరకు అంబులెన్సుల కోసం సామాన్యులు పడిన పాట్లు అన్ని ఇన్ని కావు. అంతలా దడ పుట్టించిన సెకండ్ వేవ్.. ‘మే’ నెలాఖరు నాటికి ఒక కొలిక్కి రాగా.. జూన్ మొదటి వారం నుంచి కేసుల నమోదు తగ్గుదల మొదలైంది. జూన్ రెండో వారానికి కేసులు కనిష్ఠానికి నమోదవుతున్న పరిస్థితి.

దేశమంతా ఒకలాంటి పరిస్థితి ఉంటే.. మహారాష్ట్ర.. కర్ణాటక.. కేరళ.. ఆంధ్రప్రదేశ్ తో పాటు మరి కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కేసుల నమోదు తగ్గలేదు సరికదా.. సెకండ్ వేవ్ ఒక కొలిక్కి ఇంకా రాని పరిస్థితి. చాలా సందర్భాల్లో సెకండ్ వేవ్ ఒక ఊపు ఊపి.. కాస్త తగ్గిన తర్వాత.. మూడో వేవ్ మొదలవుతుంది. అంటే.. రెండో వేవ్ కు.. మూడో వేవ్ కు మధ్య కాస్త గ్యాప్ ఉండేది. తెలంగాణలో ఇప్పుడు అలాంటి పరిస్థితే ఉంది. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. రెండో వేవ్ తీవ్రత పెద్దగా తగ్గకుండానే మూడో వేవ్ ముంచుకొచ్చేసిందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ఇటీవల కాలంలో నమోదవుతున్న కేసుల నమోదును చూస్తే.. అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. సెకండ్ వేవ్ తీవ్రత పూర్తిగా తగ్గుముఖం పట్టకుండానే లాక్ డౌన్ ఆంక్షల్నిసడలించటం.. ప్రజలు పెద్దఎత్తున రోడ్ల మీదకు రావటం.. భౌతిక దూరం.. శానిటైజ్ చేసుకునే విషయంలో నిర్లక్ష్యం.. ముఖానికి మాస్కు పెట్టుకోవటంలో చోటు చేసుకుంటున్న తప్పులు.. వెరసి కేసుల తగ్గుదల స్థానే పెరగటానికి దోహదపడుతున్నాయి. దీని కారణంగానే ఏపీలోని పలు జిల్లాల్లో కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. విశాఖ పట్నంలోని కేజీహెచ్ ఆసుపత్రిలో చేరుతున్నపేషెంట్లను చూస్తే.. కర్ప్యూ అమల్లో ఉన్నప్పుడు పేషెంట్లు తక్కువగా ఆడ్మిట్ అయ్యే వారని.. ఆంక్షలు సడలించిన తర్వాత రోగులు పెరిగారని.. ప్రస్తుతం యాబై మంది వరకు ఉన్నట్లు అక్కడి వైద్యులు చెబుతున్నారు.

విజయవాడ జీజీహెచ్ లోనూ.. గుంటూరు జీజీహెచ్ లోనూ ఇలాంటి పరిస్థితి ఉందంటున్నారు. కాకినాడ జీజీహెచ్ విషయానికి వస్తే.. కర్ప్యూ అమల్లో ఉన్నప్పుడు కేసులు తక్కువగా ఉండేవని.. మినహాయింపులు మొదలయ్యాక కొత్త కేసులు పెద్ద ఎత్తున నమోదువుతున్నాయని చెబుతున్నారు. జులై 12న ఆక్సిజన్ వినియోగం 7కేఎల్ ఉంటే.. ప్రస్తుతం భారీగా పెరిగిందని చెబుతున్నారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ ప్రకారం 25,526 మంది కొవిడ్ తో చికిత్స పొందుతుంటే.. 20,441 మంది ఇళ్లల్లోనే ఉంటూ వైద్యం పొందుతున్నారు. మిగిలిన 5,085 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 27.3 శాతం ఐసీయూల్లో.. 21.19 శాతం మంది వెంటిలేటర్ల పైన.. 15.67 శాతం ఆక్సిజన్ పడకలపై చికిత్స పొందుతున్నట్లు చెబుతున్నారు. ఇదంతా చూస్తే.. ఏపీలో సెకండ్ వేవ్ కు సెలవు చెప్పకుండానే.. మూడో వేవ్ లోకి ఎంట్రీ ఇచ్చేసినట్లుగా చెబుతున్నారు. సో.. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.