Begin typing your search above and press return to search.

కడప వైసీపీ నాయకులు వైజాగ్ లో వేయి కోట్ల సెటిల్మెంట్ చేశారా...?

By:  Tupaki Desk   |   5 Dec 2022 5:32 AM GMT
కడప వైసీపీ నాయకులు వైజాగ్ లో వేయి కోట్ల  సెటిల్మెంట్ చేశారా...?
X
ఏపీలో నంబర్ వన్ సిటీ వైజాగ్. రాజధాని కాకపోయినా ఆ రాజసం ఉన్న నగరం విశాఖ. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖను రాజధానిగా చేస్తామని ఊరిస్తూ వస్తోంది. దాంతో అమాంతం ఈ సిటీ ప్రాముఖ్యత పెద్ద ఎత్తున పెరిగిపోయింది. ఇక మొదటి నుంచి చూస్తే ఇక్కడ భూములకు ఏనాడో రెక్కలు వచ్చేశాయి. విశాఖలో భూముల మీద హాట్ డిస్కషన్ ఎపుడూ జరుగుతూనే ఉంటుంది.

ఇక వైసీపీ ఏలుబడిలో విశాఖలో పెద్ద ఎత్తున భూదందా జరుగుతోందని ఒక వైపు టీడీపీ సహా విపక్షాలు గోల పెడుతూనే ఉన్నాయి. విమర్శలు చేస్తూనే ఉన్నాయి. దాన్ని తిప్పుకొడుతున్నా కూడా వైసీపీ మీద అనుమానాలు అలాగే ఉన్నాయి. ఇదిలా ఉండగా విశాఖలో భూముల దందాలతో పాటు సెటిల్మెంట్ వ్యవహారాలు యమ జోరుగా సాగుతున్నాయని అంటున్నారు.

భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నవి, అలాగే వివాదాల్లో ఉన్నవి, అదే విధంగా నిషేధిత భూములు, మాజీ సైనికులు, స్వాతంత్ర సమరయోధుల భూములతో పాటు ప్రైవేట్ భూములు కూడా ఈ ల్యాండ్ సెటిల్మెంట్ లోకి తెచ్చి మరీ వైసీపీ నేతలు దందాలు చేస్తున్నారు అన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఇందులో కడప జిల్లాకు చెందిన వైసీపీ నేతలు ఎక్కువగా ఉన్నారని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది.

ఇప్పటిదాకా ఇలా ల్యాండ్ సెటిల్మెంట్ చేసిన భూముల విలువ వేయి కోట్ల దాకా ఉంటుందని లెక్కలు తీసి మరీ విపక్షాలు చెబుతున్నాయి. ఈ భూముల దందాను అడ్డుకోవాలని కూడా కోరుతున్నారు. ఈ మధ్యనే బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు అయితే విశాఖ భూ దందా మీద సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అయితే పార్లమెంట్ లోనే విశాఖలో జరుగుతున్న భూ దందాల విషయాన్ని ప్రస్తావిస్తామని స్పష్టం చేశారు.

భూ దందా మీద టీడీపీ నేతలు సైతం ఆందోళన చేపట్టారు. ఇవన్నీ పక్కన పెడితే టీడీపీ హయంలో ఒక సిట్ ని వేసి భూ దందాల మీద యాక్షన్ అన్నారు. ఆ నివేదిక బయటకు రాలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మరో సిట్ వేశారు. దానికీ అతీ గతీ లేదు సిట్ ద్వారా వెల్లడైన విషయాలు చాలానే ఉన్నాయని, దానిని ఆధారం చేసుకునే భూ దందాలకు అధికార పార్టీ నాయకులు తెర తీశారు అని అంటున్నారు.

ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో మొత్తం వివరాలు తెప్పించికుని మరీ వైసీపీ నేతలు ల్యాండ్ సెటిల్మెంట్ కి పాల్పడుతున్నారు అని అంటున్నారు. ఇది నిజంగా దారుణం బాధాకరమని కూడా స్థానికులు అంటున్నారు. విశాఖలో భూ దందాలు ఎన్నడూ లేని విధంగా పెరిగిపోవడంతో పాటు ల్యాండ్ సెటిల్మెంట్ గ్యాంగులు విచ్చలవిడిగా తిరగడంతో జనాలు కూడా భయపడే పరిస్థితి ఉంది. ప్రభుత్వ అండదండలు తమకు ఉన్నాయని చెప్పుకుని మరీ వైసీపీ నాయకులు కొందరు ఈ విధంగా తెగబడుతున్నారని అంటున్నారు.

నోరూ వాయీ లేని వారు, రాజకీయ పలుకుబడి లేని వారు, దూరంగా ఎక్కడో విదేశాల్లో ఉన్న వారు భూములన్నీ ఈ విధంగా హాం ఫట్ అవుతున్నాయని అంటున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా సీమ నేతలు, ప్రత్యేకించి కడప జిల్లాకు చెందిన అధికార పార్టీ నాయకులు తరచూ విశాఖకు వస్తూ పోతూ ఉన్నారని, ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారాలను చేసేందుకే ఇదంతా అని విపక్షాలు అంటున్నాయి.

ఇక ఏకంగా వేయి కోట్ల రూపాయల విలువ చేసే భూములు ల్యాండ్ సెటిల్మెంట్ లో హాం ఫట్ అయ్యాయన్న మ్యాటర్ తో విశాఖతో పాటు విశాఖలోని విపక్షాలు జనాలు కూడా ఉలిక్కిపడుతున్నాయి. దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అంటున్నారు. గతంలో విశాఖ భూముల పరిరక్షణకు ఇదే వైసీపీ ఆద్వర్యంలో ఉద్యమాలు పోరాటాలు చేసి తీరా అధికారంలోకి వచ్చాక ఈ దందలౌ సెటిల్మెంట్స్ ఏంటి అని కూడా అంతా ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు సైతం చోధ్యం చూడడమే అసలైన విషాదం అంటున్నారు.

విశాఖను రాజధానిగా చేస్తామని చెప్పడం వెనక భూదందాలకు తెర లేపే కుట్ర ఉందని విపక్షాలు అంటున్నాయి.. సామాన్యుడికి సెంట్ జాగా కూడా విశాఖలో లేకుండా చేసేందుకే ఇదంతా చేస్తున్నారు అని అంటున్నారు. కడప వైసీపీ నేతల ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారాల విషయంలో వస్తున్న ఆరోపణల మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.