Begin typing your search above and press return to search.

ఈ విషయాలు చెప్పటం కోసమే జగన్ అసెంబ్లీ వదిలేసి మోడీ వద్దకు వెళ్లారా?

By:  Tupaki Desk   |   18 March 2023 5:00 PM GMT
ఈ విషయాలు చెప్పటం కోసమే జగన్ అసెంబ్లీ వదిలేసి మోడీ వద్దకు వెళ్లారా?
X
''రాష్ట్ర విభజన జరిగి 9 ఏళ్లు కావొస్తుంది. రాష్ట్రానికి నెరవేర్చాల్సిన అనేక అంశాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చాలా అంశాలు పరిష్కారం కాలేదు. రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద రూ.36,625 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. ఆ నిధులు వెంటనే విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలి. తగ్గించిన రుణ పరిమితిని పెంచాలి''

''పోలవరం కలను నెరవేర్చేందుకు ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసిన రూ2600 కోట్ల మొత్తాన్ని విడుదల చేయాలి. ఈ ప్రాజెక్టు అంచనాలను వెంటనే ఆమోదం తెలపాలి. పోలవరం ముంపు బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్టును మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు రూ.10వేల కోట్లు అడహాక్ గా మంజూరు చేయాలి''

''తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్ కోకు రావాల్సిన రూ.7058 కోట్ల బకాయిలు అలానే ఉన్నాయి. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్థిదారుల ఎంపికలో హేతుబద్ధత పాటించకపోవటం వల్ల ఏపీకి నష్టం వాటిల్లుతోంది. 56 లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రేషన్ ఇస్తోంది. ఇందుకోసం 5527 కోట్ల భారాన్ని మోస్తోంది. దీనిపై చర్యలు తీసుకోవాలి''

''ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. ప్రత్యేక హోదాను ఇవ్వాలి. రాష్ట్రంలోని 13 జిల్లాలకు బదులు 26 జిల్లాల్ని చేశాం. కొత్తగా మంజూరుచేసిన మూడు మెడికల్ కాలేజీలతో కలిపి మొత్తం 14 మాత్రమే ఉన్నాయి మరో 12 కాలేజీలకు వీలైనంత త్వరగా అనుమతులు మంజూరు చేయాలి. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన ఖనిజ కొరత లేకుండా ఎండీసీకి గనులు కేటాయించాలి''

ఇదంతా చదివిన తర్వాత ఏమనిపించిది? ఇవన్నీ ఇప్పటికే చాలాసార్లు ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ విన్నవించుకున్నారు కదా? మూడున్నరేళ్ల పాలనలో ఈ విషయాల మీద బోలెడన్నిసార్లు ప్రత్యేక విమానం వేసుకొని మరీ ఢిల్లీకి వెళ్లి అడిగారు కదా? ఇందులో ప్రత్యేకత ఏముంది? అన్న సందేహం కలుగక మానదు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన గురించి తెలిసిన వారు.. ఢిల్లీకి వెళ్లిన ఆయన ప్రధాని మోడీతో భేటీ అయ్యాక.. ఆయన వద్ద ప్రస్తావించిన అంశాలంటూ గొప్పగా ప్రచారం చేసుకోవటంపై విస్మయం వ్యక్తమవుతోంది.

రొడ్డుకొట్టుడు విషయాలపై అదేదో తరుముతున్నట్లుగా రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్ని వదిలేసి మరీ.. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఏమిటి? ప్రధాని నరేంద్ర మోడీని అంత అర్జెంట్ గా కలిసి.. ఆయనకు భారీ వెంకటేశ్వరస్వామి బొమ్మను.. తీర్థ ప్రసాదాల్ని.. మరిన్ని కానుకల్ని ఇచ్చేసి మరీ తమ వినతుల్ని పరిశీలించాలని.. సానుుకూలంగా స్పందించాలని అడగాల్సిన అవసరం ఉందా? అన్నది ప్రశ్న. ఎందుకంటే.. ఇప్పుడు ప్రస్తావించిన అంశాల్ని ఇప్పటికి పదుల సార్లు విన్నవించుకోవటం.. విని ఊరుకోవటం మోడీ సర్కారు చేసింది. ఇంతకాలం లేని చర్యలు ఇప్పుడే ఎందుకు చేస్తారు? అయినా ఏపీతో ఏం లాభం ఉందని చేస్తారు? అని ప్రశ్నిస్తున్నారు. మరి.. ఈ విషయాల్ని అడగటానికే అయితే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఉందా? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. అడిగిన అంశాలు వేరుగా ఉన్నాయని.. బయటకు మాత్రం ఇలా చెబుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో చూద్దాం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.