Begin typing your search above and press return to search.

ధరణి.. చివర కు ఊరినే లేకుండా చేశారే

By:  Tupaki Desk   |   31 May 2023 9:47 AM GMT
ధరణి.. చివర కు ఊరినే లేకుండా చేశారే
X
వినూత్నంగా ఆలోచించటం.. వాటిని అంతే కొత్తగా అమల్లోకి తీసుకొచ్చే సత్తా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాస్త ఎక్కువే. ధరణి పేరుతో.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భూముల్ని ఒక క్రమపద్దతిలో నమోదు చేయించే భారీ పనిని తలకెత్తుకోవటం తెలిసిందే. దీని పై ఎన్ని విమర్శలు వచ్చినా.. కించిత్ కూడా స్పందించకుండా ఉండిపోవటం.. జరగాల్సినవి జరగటమే తప్పించి.. వివరణ ఇవ్వటం.. కొన్ని తప్పుల విషయంలో విచారం వ్యక్తం చేయటం లాంటివి మాట వరస కు కూడా చేయని తీరు కేసీఆర్ లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది.

ధరణి ని అందుబాటులోకి తీసుకొచ్చి ఏళ్లు అవుతున్నా.. దానికి సంబంధించిన పంచాయితీలు ఒక కొలిక్కి రాని పరిస్థితి. తాము తీసుకున్న నిర్ణయానికి ఇబ్బందులు పడుతున్న ప్రజల కు.. వాటి నుంచి విముక్తి కలిగించేందుకు ఏర్పాటు చేయాల్సిన వ్యవస్థ అంతంతమాత్రంగా ఉండటంతో లక్షలాది మంది ఇబ్బందుల కు గురవుతున్న పరిస్థితి. ఏ రెవెన్యూ కార్యాలయానికి వెళ్లినా కుప్పలు కుప్పలుగా ఉన్న ధరణి దరఖాస్తులు కనిపిస్తాయే తప్పించి.. వాటి పరిష్కారాలు మాత్రం లభించని పరిస్థితి.

ఇలాంటి వేళ.. ధరణి నమోదు వేళ.. అధికారులు చేసిన ఒక పొరపాటు కు ఆ ఊరి ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు. ధరణి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఊరి ని అందులోకి ఎక్కించాల్సిన అవసరం ఉంది. కానీ.. అధికారులు ఒక ఊరినే ఎత్తేసిన వైనంతో.. ఆ ఊరి వారు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ధరణి పోర్టల్ లో ఒక ఊరిని చేర్చే విషయంలో జరిగిన పొరపాటు షాకింగ్ గా మారింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలానికి చెందిన ఈ ఊరి ముచ్చట ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఇంతకూ అంత పెద్ద తప్పు ఎలా జరిగిందన్న వివరాల్లోకి వెళితే..

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో శేరిగూడ.. భద్రాయపల్లి అనే రెండు ఊళ్లు ఉండేవి. ఇవి రెండు వేర్వేరు రెవెన్యూ విభాగాలు ఉండేవి. భద్రాయపల్లి లో తక్కువ ఇళ్లు ఉండటంతో ఏళ్ల క్రితమే వారంతా శేరిగూడ కు వచ్చేశారు. దీంతో ఒకే గ్రామంగా.. శేరిగూడ భద్రాయపల్లి పంచాయితీగా మార్చారు. భద్రాయపల్లి రెవెన్యూ పరిది విడిగానే ఉంది.

శేరిగూడలో 1-78 సర్వే నెంబర్లు ఉన్నాయి. భద్రాయపల్లిలో 1-88 సర్వే నంబర్లు ఉన్నాయి. ధరణి లో శేరిగూడ సర్వే నంబర్లను నమోదు చేసిన అధికారులు భద్రాయపల్లి లోని సర్వే నెంబర్లను నమోదు చేయలేదు. దీంతో.. ఆ ఊరి లోని భూముల్ని అమ్మాలన్నా.. కొనాలన్న.. ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే.. ఆ ఊరే ధరణి పోర్టల్ లో కనిపించదు మరి. దీని పై అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా.. ఫలితం లేని పరిస్థితి.

ఈ నేపథ్యంలో రంగా రెడ్డి జిల్లా మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో సర్పంచ్ అంబటి ప్రభాకర్ ఈ విషయాన్ని ప్రస్తావించి.. ఆ ఊరు ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల గురించి చెప్పటంతో.. మిగిలిన వారంతా షాక్ అయిన పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందిస్తారా? అలానే ఉండిపోతారా? అన్నది ప్రశ్నగా మారింది.