Begin typing your search above and press return to search.

వైఎస్‌ వివేకా హత్య కేసులో సంచలన పరిణామం!

By:  Tupaki Desk   |   28 Jan 2023 2:37 PM GMT
వైఎస్‌ వివేకా హత్య కేసులో సంచలన పరిణామం!
X
వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణకు ముందు వైసీపీ ఎంపీ అవినాశ్‌ రెడ్డి ఆసక్తికర పరిణామాలకు దారి తీశారు. సీబీఐ విచారణ కోసం హైదరాబాద్‌ చేరుకున్న అవినాశ్‌ రెడ్డి సీబీఐ విచారణకు వెళ్తూ హైదరాబాద్‌ లోని లోటస్‌ పాండ్‌ లో వైఎస్‌ విజయమ్మతో భేటీ కావడం హాట్‌ టాపిక్‌ గా మారింది. సీబీఐ విచారణకు ముందు లోటస్‌ పాండ్‌ లో విజయమ్మను కలిసి అవినాష్‌ రెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు. కాగా వైఎస్‌ వివేకాకు విజయమ్మ స్వయానా వదిన. వైఎస్‌ వివేకా హత్య జరిగినప్పుడు ఆమె రోదించారు. అంతేకాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.

కాగా విజయమ్మ ఆశీస్సులు తీసుకోవడానికే అవినాష్‌ రెడ్డి లోటస్‌ పాండ్‌ కు వచ్చినట్టు చెబుతున్నారు. జనవరి 28న మధ్యాహ్నం 3 గంటలకు కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లి అధికారుల విచారణకు హాజరుకానున్నారు. వైఎస్‌ వివేక హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్‌ రెడ్డి పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. స్వయానా వివేకా కుమార్తె సునీత.. అవినాష్‌ రెడ్డి పాత్రపై అనుమానాలు వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో అవినాశ్‌ రెడ్డి స్టేట్‌ మెంట్‌ ను సీబీఐ అధికారులు రికార్డు చేయనున్నారు. ఇప్పటికే వివేకా హత్య కేసులో పలువురి స్టేట్‌ మెంట్‌ అధికారులు తీసుకున్న సంగతి తెలిసిందే.

కాగా ఈ నెల 24నే అవినాశ్‌ రెడ్డిని విచారణకు రావాలని సీబీఐ అధికారులు నోటీసు జారీ చేసినా ఆయన వెళ్లలేదు. తనకు ఐదు రోజులు సమయం కావాలని అడిగారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటం వల్ల తాను విచారణకు హాజరు కాలేనని తెలిపారు. ఈ నేపథ్యంలో సీబీఐ జనవరి 28న విచారణకు రావాలని ఆయనకు నోటీసులు జారీ చేసింది.

కాగా వివేకా హత్య కేసులో తన ప్రతిష్టను దెబ్బతీస్తు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయని అవినాశ్‌ రెడ్డి ఇప్పటికే ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణ పారదర్శకంగా జరగాలని కోరుకుంటున్నానన్నారు. తన స్టేట్‌ మెంట్‌ రికార్డు చేయడానికి గానూ ఆడియో, వీడియోలకు అనుమతి ఇవ్వాలని కోరారు. తనతోపాటు తన న్యాయవాదిని కూడా అనుమతించాలన్నారు.

మరో సీబీఐ స్పెషల్‌ కోర్టు విచారణను వేగవంతం చేసింది. వైఎస్‌ వివేకా హత్య కేసులో ఐదుగురు నిందితులకు సమన్లు జారీ చేసింది.. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, వై.సునీల్‌ యాదవ్, జి.ఉమాశంకర్‌ రెడ్డి, షేక్‌ దస్తగిరి, డి.శివశంకర్‌ రెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు ఇచ్చింది. ఫిబ్రవరి 10వ తేదీన విచారణకు హాజరు కావాలని నిందితులను ఆదేశించింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.