Begin typing your search above and press return to search.

కేజ్రీవాల్ ను ‘గుజరాతీ ఐపీఎస్’తో కొడుతున్న మోడీ

By:  Tupaki Desk   |   30 July 2021 3:34 PM GMT
కేజ్రీవాల్ ను ‘గుజరాతీ ఐపీఎస్’తో కొడుతున్న మోడీ
X
ప్రతిసారి రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోడీకి గుజరాతీలే దిక్కవుతున్నారు. మోడీ ప్రధాని కాగానే గుజరాత్ నుంచి అమిత్ షాను తీసుకొచ్చి బీజేపీ అధ్యక్షుడిని చేశారు. ఇక కీలకమైన శాఖల్లో, పీఎంవోలో అందరినీ గుజరాత్ అధికారులను డిప్యూటేషన్ పై తీసుకొచ్చి నింపేశారు. సీబీఐ, ఈడీ వంటి స్వతంత్ర్య వ్యవస్థల్లోనూ ఆ రాష్ట్రం అధికారులే, మోడీకి సన్నిహితులనే పెట్టి రాజకీయ ప్రత్యర్థులను వేధించారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు మరో రెండు నెలల్లో దిగిపోయే గుజరాతీ ఐపీఎస్ ను తీసుకొచ్చి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నెత్తిన పెట్టారు. ఆయన ఊరుకుంటారా? పోరుబాట పట్టారు. దీంతో ఈ వివాదం రంజుగా సాగుతోంది.

దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతం 'రాష్ట్రానికి ఎక్కువ.. కేంద్రపాలిత ప్రాంతానికి తక్కువ'. దీనికి రాష్ట్ర హోదా ఉన్నా అన్ని అధికారాలు కేంద్రం చేతిలోనే.. కేంద్రం ఏం చెబితే అదే జరుగుతోంది. ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ గెలిచినా ఆయన పెత్తనం ఏం సాగకుండా బీజేపీ పెద్దలు చక్రం తిప్పుతున్నారు. తాజాగా మరో వివాదం చెలరేగింది.

మోడీ సర్కార్ ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా రాకేష్ అస్థానాను నియమించింది. ఆయన నియామకాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే రాకేష్ అస్థానా.. ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రం గుజరాత్ క్యాడర్ కు చెందిన ఐపీఎస్. అంతేకాకుండా మోడీకి నమ్మినబంటు. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆయనను తక్షణం పదవి నుంచి తప్పించాలని కేజ్రీవాల్ సర్కార్ ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం సంచలనమైంది.

పోలీసు బలగాలు, కీలకమైన రక్షణ వ్యవస్థ కేంద్రం చేతుల్లో పెట్టుకోవడానికే రాకేష్ ను నియమించాలరని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే రాకేష్ కేంద్రప్రభుత్వం మద్దతుతోనే గతంలో సీబీఐకి వెళ్లి బీజేపీ రాజకీయ ప్రత్యర్థులను వేటాడారనే విమర్శ ఉంది. ఓ సందర్భంలో సీబీఐ డైరెక్టర్ గా ఉన్న అలోక్ వర్మ ఫోన్ నే ట్యాపింగ్ చేయించారని.. ఆయన దర్యాప్తు చేస్తున్న కేసులను ట్యాంపర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు.

ఓ దశలో సీబీఐలో ఉన్నప్పుడు డైరెక్టర్ అలోక్ వర్మ ఏకంగా రాకేష్ అస్తానాపై విచారణకు ఆదేశించుకున్నారు. సీబీఐ అధికారులు రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి.

ఇక ఈ కేసు దుమారం రేగడంతో సుప్రీంకోర్టు చొరవతో సీబీఐ నుంచి రాకేష్ వైదొలిగి ఐపీఎస్ గా కొనసాగారు. అలోక్ వర్మ రాజీనామా చేసి సర్వీస్ నుంచి వైదొలిగారు.

సీబీఐలో ఉండగా బీజేపీకి ఫేవర్ గా చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న రాకేష్ అస్థానాకు తర్వాత బీఎస్ఎఫ్ డీజీ పోస్టును కేంద్రం కట్టబెట్టింది. ఇక తాజాగా సీబీఐచీఫ్ గా కూడా నియమించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని అంటున్నారు. టాప్ త్రీలో ఆయన పేరు కూడా ఉంది. కానీ నియామకం ప్యానెల్ లో సభ్యుడు అయిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.. రెండేళ్ల సర్వీస్ ఉండి ఉండాలనే నిబంధన ఎత్తి చూపడంతో ఆయనకు అవకాశం రాకుండా పోయింది. మరో రెండు నెలల సర్వీస్ మాత్రమే ఆస్థానాకు ఉంది. దీంతో ఆయనను ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా కేంద్రం నియమించింది. ఆయన పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగించడానికి సిద్ధమైంది.

ఆస్థానాకు ఢిల్లీ పోలీస్ చీఫ్ బాధ్యతలు ఇవ్వడం కేజ్రీవాల్ సర్కార్ ను ఇబ్బంది పెట్టడానికేనని ఆప్ సర్కార్ భావిస్తోంది. బీజేపీపై విరుచుకుపడుతోంది. ఆయన నియామకాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. దీనిపై పోరుబాట పట్టేందుకు రెడీ అయ్యింది.