Begin typing your search above and press return to search.

అప్పుల ఇండియా...మోడీ ఏలుబడిలో రికార్డు మోత

By:  Tupaki Desk   |   24 Jan 2023 9:18 AM GMT
అప్పుల ఇండియా...మోడీ ఏలుబడిలో రికార్డు మోత
X
మనది స్వర్ణ భారతం కాదు రుణ భారతం అని ఏలికలు రుజువు చేస్తున్నారు భారత దేశం ఏ ఏటి కా ఏడు అప్పులలో మునిగితేలుతోంది. ఈ అప్పులు కూడా భారీగా పెరుగుతున్నాయి. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేయడమే తమాషా. మోడీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినపుడు చేస్తే దేశ వార్షిక రుణం 5.92 లక్షల కోట్లు ఉంది. అదే ఆ తరువాత పెరుగుతూ పోయింది.

అలా చూసుకుంటే 2022-23 ఏడాదిలో 14.2 లక్షల కోట్లు కేంద్రం అప్పులు చేసింది. ఈ ఏడాది బడ్జెట్ లో చూస్తే ఆ రుణం కాస్తా 16 లక్షల కోట్ల రూపాయలు ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి ఇన్ని లక్షల కోట్లలో రుణం అంటే భారత దేశం మీద ఎంత భారం అన్నది కూడా ఆలోచించాల్సి ఉంది. ఎందుకు ఇంతలా రుణాలు చేయాల్సి ఉంటోంది అంటే కరోనా వల్ల గత నాలుగేళ్ళుగా ఖర్చులు బాగా పెరిగిపోయాయని ఫలితంగా ప్రజా సంక్షేమం మీదనే ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వచ్చిందని కేంద్ర నివేదికలు తెలియచేస్తున్నాయి.

ఒక వైపు కరోనా వంటి పెను సంక్షోభం వల్ల వృద్ధి రేటు తగ్గిందని, ఇక ఆర్ధిక క్రమశిక్షణతో ఆదాయం కూడా తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. ఇక రుణాలు తీసుకోవడం ఎందుకు అంటే గత చెల్లింపుల కోసం అని కూడా అంటున్నారు. ఈ నూతన ఆర్ధిక సంవత్సరంలోనే ఏకంగా 4.4 లక్షల కోట్ల చెల్లింపు కేంద్ర ప్రభుత్వం మీద భారంగా ఉన్నాయి. అందుకే పదహారు లక్షల కోట్లు రుణాలు చేయాల్సి వస్తోంది అని అంటున్నారు.

మరో వైపు ప్రభుత్వం ఆశలు ఆకాంక్షలు ఒకలా ఉంటే కళ్ల ముందున్న ఆర్ధిక చిత్రం మరోలా ఉంది అంటున్నారు. అదెలా అంటే 2023-24లో బడ్జెట్ లోటు జీడీపీలో 6 శాతానికి తగ్గుతుందని అనుకున్నా అలా జరిగే సూచనలు అయితే ఇప్పటికీ లేవు అంటున్నారు.

మరో రెండేళ్ల తరువాత అంటే 2025-26 నాటికి 4.5 శాతానికి ఈ బడ్జెట్ లోటుని పరిమితం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి మాత్రం చాలా దూరంలో ఉండనున్నట్లుగా ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు.

ఈ పరిస్థితులను చూసి దేశీయ ఆర్ధిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు. మరింత మెరుగైన ఆర్ధిక ప్రణాళికలతో కేంద్రం ముందుకు రావాల్సిన అవసరం ఉందని సూచనలు అందుతున్నాయి. ఇలా అనకొండలా అప్పుల భారం పెరిగిపోతే అది దేశ హితానికి మంచిది కాదనే అంటున్నారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అయితే ఇండియా రుణ రేటింగ్ పైన పలు సూచనలు ఇప్పటికే చేసింది.

ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇంకో ఆందోళనకరమైన సమాచారాన్ని వెల్లడించింది. అదేంటి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రుణభారం చూస్తే జీడీపీలో 83% శాతం ఉందని చెప్పడం.ఇది ప్రపంచంలోని ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే చాలా అధికమని కూడా అభిప్రాయపడింది. ఇలా కనుక పెరుగుతూ పోతే అంతర్జాతీయంగా భారత్ క్రెడిట్ రేటింగ్ మీద పెను ప్రభావం చూపిస్తుందని కూడా వెల్లడించింది. మొత్తానికి చూస్తే నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ళ పాలనలో రుణ భారం నాలుగింతలు పెరిగింది అని ఆర్ధిక నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.