Begin typing your search above and press return to search.

రికవరీలో ఏపీ దూకుడు.. టాప్ టెన్ లో నెంబర్ స్థానం

By:  Tupaki Desk   |   19 Oct 2020 6:30 AM GMT
రికవరీలో ఏపీ దూకుడు.. టాప్ టెన్ లో నెంబర్ స్థానం
X
కొన్ని సందర్భాల్లో ఫలితాలు నిలకడ మీదనే వస్తాయి. అప్పటికిప్పుడు హడావుడి.. ఆగమాగం అయిపోయి.. ఏదేదో జరుగుతున్నట్లుగా ప్రచారం చేయకుండా.. నిజాయితీగా..చిత్తశుద్ధితో పని చేస్తే.. ఫలితాలు ఏ రీతిలో ఉంటాయన్న విషయాన్ని ఏపీలో కరోనా కేసుల విషయంలో కనిపిస్తోంది. ఒక దశలో దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న రెండో రాష్ట్రంగా ఏపీ నిలిచింది. పెద్ద ఎత్తున పరీక్షలు చేయిస్తున్నా.. వైద్య సాయం అందించినా.. భారీగా మౌలిక వసతులు కల్పించినా..రోజుకు పదివేలకు పైనే కేసులు నమోదయ్యే దుస్థితి ఏపీలో ఉండేది.

ప్రభుత్వ పరంగా ఎన్ని చర్యలు.. జాగ్రత్తలు తీసుకున్నా ఇంత తీవ్రంగా కరోనా కేసులునమోదు కావటంపై పలు వాదనలు వినిపించేది. అయితే.. వీటిని పట్టించుకోకుండా.. తాను చేయాల్సిన పనిని చేసుకుంటూ పోయిన జగన్ సర్కారుకు తాజాగా సానుకూల ఫలితాలు వస్తున్నాయి. కొద్దికాలం క్రితం వరకు కేసుల నమోదులో టాప్ టూలో ఉన్న రాష్ట్రం.. ఇప్పుడు అందుకు భిన్నంగా రికవరీలో టాప్ వన్ లో నిలవటం గమనార్హం.

కోలుకుంటున్న వారి సంఖ్య రాష్ట్రంలో అంతకంతకూ పెరుగుతోంది. ప్రతి పదిలక్షల మంది జనాభాలో అత్యధికంగా పరీక్షలు చేయటంతో పాటు.. వైరస్ బారినపడిన వారికి వైద్యం అందించి.. వారు రికవరీ అయ్యేలా చేయటంలో ఏపీ సాధించిన విజయం ఇప్పుడు గణాంకాల రూపంలో కనిపిస్తోందని చెప్పాలి.
దేశ వ్యాప్తంగా టాప్ టెన్ రికవరీ రాష్ట్రాల్లో చూస్తే.. 94.52 శాతంతో ఏపీ మొదటి స్థానంలో నిలిస్తే.. బిహార్ (94.24 శాతం) రెండో స్థానంలో నిలిచింది.

తమిళనాడు (92.42).. జార్ఖండ్ (92.28).. హర్యానా (91.84).. పంజాబ్ (91.66).. ఒడిశా (91.38).. ఢిల్లీ (91.14).. ఉత్తరప్రదేశ్ (90.70) నిలిచింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కేసుల నమోదులో తక్కువగా ఉండే తెలంగాణ రాష్ట్రం రికవరీ విషయంలో టాప్ టెన్ లిస్టులో లేకపోవటం గమనార్హం.

ఇదిలా ఉంటే.. రికవరీతో పాటు.. నిర్దారణ పరీక్షల్లోనూ ఏపీ దూసుకెళుతోంది. ప్రతి పదిలక్షల మంది జనాభాకు 1,32,326 మంది పరీక్షలు చేస్తున్నారు. ఈ విషయంలో అసోం రెండో స్థానంలో నిలిచింది. మరణాల నియంత్రణలోనూ ఏపీలో పరిస్థితి మారింది. ఆ మధ్య వరకు రోజుకు 90 మరణాలు ఉంటే.. ఇప్పుడు అది కాస్తా 25కు తగ్గటం చూస్తే.. జగన్ సర్కారు తీసుకుంటున్న చర్యలు.. జాగ్రత్తలు ఇప్పుడిప్పుడే ఫలితాలు చూపటం షురూ అయినట్లుగా కనిపించక మానదు.