Begin typing your search above and press return to search.

మళ్లీ అదే తప్పు: అమెరికాలో మోడీ పై విమర్శలు!

By:  Tupaki Desk   |   1 Jun 2023 5:00 AM GMT
మళ్లీ అదే తప్పు: అమెరికాలో మోడీ పై విమర్శలు!
X
భారత దేశానికి ట్రంప్ వచ్చి జోబైడెన్ గురించి విమర్శలు చేస్తే? ఆయన్ను తప్పు పడితే? అలానే.. దేశం ఏదైనా కావొచ్చు. ఒక దేశ ప్రతిపక్ష నేత ఒకరు విదేశాని కి వెళ్లి.. అక్కడి వేదికల మీద తమ దేశాధ్యక్షుడి గురించో.. ప్రధానమంత్రి గురించో విమర్శలు చేస్తే ఎలా ఉంటుంది? గతంలోనూ అలాంటి తీరునే ప్రదర్శించిన రాహుల్ గాంధీ.. తాజాగా మరోసారి అలాంటి తప్పునే చేశారు. దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నా.. అంతర్జాతీయ వేదికల మీద ప్రధాని నరేంద్ర మోడీ కి లభిస్తున్న గౌరవ మర్యాదల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటీవల ప్రధాని మోడీ జరిపిన విదేశీ పర్యటనకు ఎలాంటి స్పందన వచ్చిందో తెలిసిందే.

ఇలాంటి వేళలో.. అమెరికా కు వెళ్లిన రాహుల్.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో హక్కుల కార్యకర్తలు.. విద్యావేత్తలతో జరిగిన చర్చా కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నారు. అనంతరం ప్రవాస భారతీయుల తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోడీ పై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతా తమకే తెలుసని ప్రజలను నమ్మించే వ్యక్తులు భారత్ లో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్లుగా మండిపడ్డారు.

'వారు శాస్త్రవేత్తలకే శాస్త్రాన్ని చెబుతారు. చరిత్రకారులకు చరిత్రను వివరిస్తారు. సైన్యానికి యుద్ధాన్ని నేర్పిస్తారు. వారు దేవుడితో కూర్చుంటే భగవంతుడికే ఈ ప్రపంచం ఎలా పని చేస్తుందో వివరిస్తారు. అప్పుడు దేవుడు సైతం తాను క్రియేట్ చేసిన విశ్వం ఇదేనా? అన్న గందరగోళానికి గురవుతారు' అంటూ వ్యంగ్య వ్యాఖ్యల తో మోడీ కి మంట పుట్టేలా మాట్లాడారు.ప్రతిపక్షాలన్నీ సరిగ్గా ఏకమైతే బీజేపీ కచ్ఛితంగా ఓడిపోతుందన్న ఆయన.. అందుకు కర్ణాటక ఎన్నికలే ఉదాహరణ అని పేర్కొన్నారు. ప్రపంచ మీడియాలో చూపించినట్లుగాభారత్ లో పరిస్థితులు లేవన్న ఆయన.. అదంతా రాజకీయ ప్రచారమే అని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

వారం రోజుల పర్యటన కోసం అమెరికా కు చేరుకున్న రాహుల్.. మొహబత్ కి దుకాణ్ (ప్రేమ దుకాణాలు)పేరుతో కాలిఫోర్నియాలో కార్యక్రమాన్ని నిర్వహించారు. తన పర్యటనలో భాగంగా వాషింగ్టన్.. న్యూయార్కుల లోనూ రాహుల్ పర్యటించనున్నారు. అమెరికా చట్టసభ ప్రతినిధులతోపాటు.. ఇతర రంగాల ప్రముఖుల తోనూ భేటీ కానున్నారు. ఇదిలా ఉంటే.. రాహుల్ చేసిన వ్యాఖ్యల పై కేంద్ర మంత్రులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాహుల్ వ్యాఖ్యల పై ఘాటు కౌంటర్లు సంధించారు.

విదేశీ పర్యటనల్లో ఉన్న రాహుల్ భారత్ ను అవమానించేలా మాట్లాడటం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని.. మోడీని అవమానించేందుకు ఆయన దేశ ప్రగతి గురించి ప్రశ్నిస్తున్నారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ మండిపడ్డారు. "ఇటీవల దేశ ప్రధాని మోడీ అనేక దేశాల్లో పర్యటించారు. ఆ సమయంలో మోడీ పాపులర్ లీడర్ అని చాలామంది ప్రపంచ నేతలు కొనియాడారు. మోడీ.. ది బాస్ అని ఆస్ట్రేలియా ప్రధాని ప్రశంసించారు. రాహుల్ దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు" అని విరుచుకుపడ్డారు.

మరో మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ఏమీ తెలియని వ్యక్తి ఇప్పుడు ఉన్నట్టుండి నిపుణుడిగా మారటం హాస్యాస్పదంగా ఉందన్నారు. 'బంగాళదుంపల నుంచి బంగారం వస్తుందని చెప్పిన వ్యక్తి. సైన్స్ గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు. మిస్టర్ నకిలీ గాంధీ.. భారత్ అంటే ఒక కల్చర్.. మీలా విదేశీ గడ్డ మీద భారత ప్రతిష్టను దిగజార్చకుండా ప్రతి భారతీయుడు తమ చరిత్ర గురించి గర్వపడతాడు' అని విమర్శించారు.

ఇక.. కేంద్ర మాజీ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మరింత ఘాటుగా రియాక్టు అయ్యారు. రాహుల్ విదేశాల్లో అడుగు పెట్టగానే..ఆయనలో జిన్నా లేదంటే అల్ ఖైదా లా ఆలోచించే వారి ఆత్మ ప్రవేశిస్తుందని.. అందుకు ఆయన చికిత్స తీసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యం అంటే వారసత్వం అనుకుంటున్నారని.. భూస్వామ్య దౌర్జన్యాన్ని ప్రధాని మోడీ నాశనం చేశారన్న నిజాన్ని రాహుల్ జీర్ణించుకోలేకపోతున్నారని ఇంకా అంగీకరించటం లేదని నిప్పులు చెరిగారు.