Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: ఏపీలో కరోనాతో మరొకరు మృతి !

By:  Tupaki Desk   |   4 April 2020 8:50 AM GMT
బ్రేకింగ్: ఏపీలో కరోనాతో మరొకరు మృతి !
X
కరోనా మహమ్మారి భారిన పడి మరొకరు ఏపీలో తుదిశ్వాస విడిచారు. దీనితో రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య రెండుకు చేరింది. అనంతపురం జిల్లా హిందుపురానికి చెందిన ముస్తాక్‌ ఖాన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. ఈ మేరకు వైద్యులు అతడు కరోనాతో మరణించినట్టు ధృవీకరించారు.
కాగా ఢిల్లీలోని జమాత్‌ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన 16మంది హిందూపూర్ వాసులకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ అని వచ్చినట్లు వైద్య అధికారులు తెలిపారు. వారందర్నీ ఇదివరకే క్వారంటైన్‌ కు తరలించిన విషయం తెలిసిందే.

వీరందరికి నెగిటివ్‌ రావడంతో పట్టణ ప్రజలు - అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా హిందూపురం లో ఓ మహిళ కు పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఆమె బంధువులు, ఆమెను కలిసిన 19మందికి కూడా వైద్య పరీక్షల కోసం నమూనాలను సేకరించి అనంతపురం పంపారు. వీరి ఫలితాలు తెలియాల్సి ఉంది. కాగా కృష్ణా జిల్లా విజయవాడ లో తొలి కరోనా మరణం చోటు చేసుకుంది. ఢిల్లీ మత ప్రార్థనకు వెళ్లొచ్చిన యువకుడి నుంచి అతడి తండ్రికి కరోనా సోకడంతో ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా వైరస్‌ కేసులు మరిన్ని పెరిగిపోయాయి. నిన్న రాత్రి 10.30 గంటల నుంచి ఈ రోజు ఉదయం 10 గంటల మధ్య కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరిందని ఏపీ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. నెల్లూరులో అత్యధికంగా 32 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కృష్ణా జిల్లాలో అత్యధికం గా 27 - గుంటూరు - కడప జిల్లాల్లో 23 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఏపీలో అత్యధిక బాధితులు ఢిల్లీలోని నిజాముద్దీన్‌ లో మర్కజ్‌ కు వెళ్లి వచ్చినవారే ఉన్నారు.