Begin typing your search above and press return to search.

హైదరాబాద్ టాప్.. 16 జిల్లాల్లో సింగిల్ డిజిట్

By:  Tupaki Desk   |   5 April 2020 6:33 AM GMT
హైదరాబాద్ టాప్.. 16 జిల్లాల్లో సింగిల్ డిజిట్
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసినప్పుడు కరోనా కేసులు తెలంగాణలో పెద్ద ఎత్తున పాజిటివ్ లు నమోదవుతున్నాయి. తొలుత కేసుల నమోదు నెమ్మదిగా ఉన్న స్థానే.. ఇప్పుడు రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజులో 75 కేసులు నమోదైతే.. శనివారం నమోదైన కేసులు 43 మాత్రమే. అయితే.. అనుమానితుల సంఖ్య భారీగా ఉంది. వారికి పరీక్షలు జరిపి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో.. శనివారం నాడు వెల్లడైన పాజిటివ్ ల సంఖ్య తక్కువగా కనిపిస్తున్నా.. రానున్న రోజుల్లో బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని చెప్పక తప్పదు.

కేవలం రెండు రోజుల (ఏప్రిల్ 3 - 4) వ్యవధిలో 118 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కేసుల సంఖ్య 272కు పెరిగింది. కాకుంటే.. వీరిలో 33 మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కారణంగా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకూ పదకొండు మంది మరణించారు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల్ని చూస్తే.. అత్యధిక కేసులు హైదరాబాద్ మహానగరంలోనే ఉన్నాయి. తాజాగా వెల్లడైన పాజిటివ్ కేసులతో సెంచరీ దాటేసినట్లుగా చెబుతున్నారు.

తెలంగాణలోని మొత్తం జిల్లాల్లో 23 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటివరకూ నమోదయ్యాయి. మరో పది జిల్లాల్లో ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అత్యధిక కేసుల స్థానంలో హైదరాబాద్ ఉంటే.. అట్టడుగు స్థానంలో సిద్దిపేట.. సూర్యాపేట.. మహబాబూబాబాద్.. జయశంకర్ జిల్లాల్లో ఒక్కొక్క కేసు మాత్రమే నమోదయ్యాయి.

హైదరాబాద్ తర్వాత అత్యధిక కేసులు నమోదైన జిల్లాగా వరంగల్ అర్బన్ ను చెప్పాలి.ఈ జిల్లాలో ఇప్పటివరకూ 21 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానం నిజామాబాద్ జిల్లాగా చెప్పాలి. ఇక్కడ 18 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నల్గొండజిల్లాలో 13..మేడ్చల్ జిల్లాలో 12 పాజిటివ్ లుగా తేలాయి.
మొత్తంగా చూస్తే.. 23 జిల్లాల్లో సింగిల్ డిజిట్ కేసులు 16 జిల్లాల్లో నమోదు కావటం కాస్త ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. మొత్తంగా చూస్తే.. ఏడు జిల్లాల్లోనే పాజిటివ్ ల సంఖ్య ఎక్కువగా ఉన్నాయి. అందులో హైదరాబాద్ మహానగరంలోనే కేసులన్ని నమోదు కావటం కాస్త ఆందోళన కలిగించే అంశంగా చెప్పక తప్పదు.