Begin typing your search above and press return to search.

కరోనాతో 40 కోట్ల మంది జీవితాలు చిన్నాభిన్నం

By:  Tupaki Desk   |   9 April 2020 1:30 AM GMT
కరోనాతో 40 కోట్ల మంది జీవితాలు చిన్నాభిన్నం
X
కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలమవుతున్నాయి. అమెరికా వంటి అగ్రరాజ్యంతో పాటు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను కరోనా చిన్నాభిన్నం చేసింది. లాక్ డౌన్ విధించక తప్పనిసరి పరిస్థితులు కల్పించిన కరోనా...లాక్ డౌన్ తర్వాత కూడా చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలపై తన పంజా విసరబోతోందిన ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వల్ల భారత్ లో విధించిన 21 రోజుల లాక్ డౌన్ వల్ల...అనేక మంది వలస కార్మికులు - దినసరి కూలీలు - రోజువారీ వేతన జీవులు - అణగారిన వర్గాల వారు - దిగువ మధ్య తరగతి - మధ్య తరగతి ప్రజల జీవితాల్లో కల్లోలం రేగింది. పొట్ట చేత బట్టుకొని...ఆకలితో అలమటిస్తూ తమ సొంత స్థలాలకు వెళుతున్న వేలాది మంది వలస కార్మికుల కష్టాలు చూసి చలించని వారు లేదు. అయితే, కరోనా దెబ్బకు వారి కష్టాలు మున్ముందు మరింత ఎక్కువ కాబోతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో మరో షాకింగ్ నివేదికలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత భారత్ లో దాదాపు 40 కోట్ల మంది కటిక పేదరికంలోకి జారుకునే అవకాశముందని ఐక్యరాజ్యసమితి కార్మిక సంస్థ వార్నింగ్ ఇచ్చింది.

కరోనా దెబ్బకు భారత్‌ లో కూలీనాలీ చేసుకునే వారు - దినసరి కార్మికులు - చిన్న చిన్న వ్యాపారాలు వంటి అనధికారిక ఆర్థిక రంగంలో పని చేస్తున్న వారి జీవితాల్లో పెనుమార్పులు రాబోతున్నాయని ఐరాస హెచ్చరిస్తోంది. ఒక్క భారత్ లోనే దాదాపు 40 కోట్ల మంది (400 మిలియన్లు) కటిక పేదరికంలోకి జారుకునే అవకాశం ఐరాస అంచనా వేస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లమంది ఉద్యోగాలు కోల్పోబోతున్నారని అంచనా వేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన అత్యంత సంక్షోభ ఆర్థిక పరిస్థితులను కరోనా వల్ల ప్రపంచం చవిచూడబోతోందని హెచ్చరించింది. భారత్, నైజీరియా, బ్రెజిల్ వంటి అనేక దేశాల్లో అధిక సంఖ్యలో అనధికార - అసంఘటిత రంగంలోని కార్మికులున్నారని - వారిపై ఈ ప్రభావం తీవ్రంగా పడబోతోందని అంచనా వేసింది. ఒక్క భారత్‌ లోనే 90 శాతం మంది ప్రజలు అనధికార ఆర్థిక రంగంలో పని చేస్తున్నారని - వారంతా కటిక పేదరికాన్ని ఎదుర్కొనే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేసింది. లాక్ డౌన్ వల్ల కార్మికులు మరలా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని అంచనా వేసింది. అయితే, ఆయా దేశాల ప్రభుత్వాలు శరవేగంగా - నిర్ణయాత్మకంగా - వేగవంతంగా సరైన చర్యలు తీసుకుంటే కొంత లాభం ఉంటుందని తెలిపింది.

ఉన్నత - మధ్యస్త ఆర్థిక వ్యవస్థలు ఉన్న దేశాలు కూడా 2008 ఆర్థిక సంక్షోభం వల్ల నష్టపోయిన దానికన్నా అధికంగా నష్టపోబోతున్నాయని తెలిపింది. ఆయా దేశాలు తీసుకునే విధానపర చర్యలపై నిరుద్యోగ శాతం ఆధారపడి ఉంటుందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 1.25 బిలియన్ల మంది కార్మికులు - ఉద్యోగులు హైరిస్క్‌ లో ఉన్నారని - వారిని సంస్థలు తొలగించే అవకాశం లేక వేతనాల్లో కోత విధించే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడింది. తక్కువ వేతనం వచ్చే ఉద్యోగాలు, పనికి తక్కువ నైపుణ్యాలు అవసరం ఉన్న ఉద్యోగాలను ఒక్కసారిగా కోల్పోయే అవకాశం ఉందని తెలిపింది. ఏది ఏమైనా కరోనా వల్ల దాదాపు అన్ని రంగాలు సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఐరాస అంచనా వేస్తోంది.