Begin typing your search above and press return to search.

మనం లైట్ తీసుకున్న కరోనా.. ఇప్పుడా దేశాల్లో వణుకు పుట్టిస్తోంది

By:  Tupaki Desk   |   25 Nov 2021 6:34 AM GMT
మనం లైట్ తీసుకున్న కరోనా.. ఇప్పుడా దేశాల్లో వణుకు పుట్టిస్తోంది
X
వణికించిన కరోనాను పెద్ద విషయంగా పరిగణించే రోజులు పోయి చాలా కాలమే అయ్యింది. దేశ వ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొని ఉండటమే కాదు.. కరోనా ముందటి పరిస్థితికి దేశం వచ్చేస్తోంది. అక్కడక్కడా కొన్ని కేసులు వెలుగు చూస్తున్నా.. దాని తీవ్రత పెద్దగా లేకపోవటం పెద్ద ఉపశమనంగా చెప్పాలి.

కరోనా భయం నుంచి దాదాపుగా అందరూ బయటకు వచ్చేసిన పరిస్థితి. కాకుంటే.. నేటికి ముఖానికి మాస్కులు.. చేతికి శానిటైజర్లు పూయటం లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇది మినహా పెళ్లిళ్లు.. శుభకార్యాలు..చావులు లాంటివి ఏవైనా సరే.. కరోనా ముందటి పరిస్థితికి దేశం మొత్తం దాదాపుగా వచ్చేసిన పరిస్థితి.

ఇలాంటివేళ.. కొన్ని దేశాల్లో కరోనా తీవ్రంగా వ్యాపిస్తూ వణికిస్తున్న వైనం వింటే కాసింత ఆశ్చర్యపోవాల్సిందే. తాజాగా యూరప్ లోని కొన్ని దేశాల్లో కరోనా వ్యాప్తి చెందుతున్న తీరుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆందోళన వ్యక్తం చేసే స్థాయిలో ఉండటం గమనార్హం. పలు దేశాల్లో మహమ్మారి తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. యూరప్ లోని పలు దేశాల్లో మాత్రం గత వారంలో ఏకంగా 11 శాతం కేసులు పెరగటం గమనార్హం.

అక్టోబరు మధ్య నుంచి మొదలైన ఈ పెరుగుదల అలానే కొనసాగుతుందని చెబుతున్నారు. కరోనాపై తాజాగా విడుదల చేసిన సమీక్షంలో ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కేసులు.. దాని కారణంగా చోటు చేసుకుంటున్న మరణాలు ఆరు శాతానికి పెరిగినట్లుగా పేర్కొన్నారు. గత వారంలో 3.6 మిలియన్ల పాజిటివ్ కేసులు రాగా.. 5100 మంది మరణించినట్లుగా అధికారిక సమాచారం వెల్లడైంది.

తాజాగా వ్యాప్తి చెందుతున్న కరోనాను కంట్రోల్ చేయకుంటే భారీ నష్టం తప్పదంటున్నారు. తక్షణ చర్యలు తీసుకోకుంటే కరోనా కారణంగా 7 లక్షల వరకు మరణాలు చోటు చేసుకోవటం ఖాయమని వార్నింగ్ ఇస్తున్నారు డబ్ల్యూహెచ్ వో డైరెక్టర్ డాక్టర్ హాన్స్ లుగే. సంపన్న దేశాలుగా ముద్ర పడిన యూరప్ ప్రాంతం ఇంకా కరోనా తాకిడికి వణికిపోవటానికి కారణం ఏమిటన్నది చూస్తే.. వ్యాక్సినేషన్ వేగంగా సాగపోవటంగా చెబుతున్నారు.

మిగిలిన చాలా దేశాలతో పోలిస్తే.. వ్యాక్సినేషన్ విషయంలో భారత్ మిగిలినవారికి భిన్నంగా వ్యవహరించిందనే చెప్పాలి. భారత్ లాంటి దేశంలో వేగంగా వ్యాక్సినేషన్ చేయటంతో పాటు.. దాదాపు 120 కోట్ల మేర వ్యాక్సినేషన్ పూర్తి కావటం కూడా ఇప్పటి పరిస్థితికి కారణంగా చెప్పాలి.

యూరోప్ విషయానికి వస్తే.. ఇప్పటికి అందులోని దేశాలు కొవిడ్ కబంధ హస్తాల్లోనే ఉందని చెబుతున్నారు. టీకా కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని కోరుతున్నారు. కఠిన లాక్ డౌన్ లను విధించే పరిస్థితి తెచ్చుకోకుండా మాస్కులు పెట్టుకోవటం.. భౌతికదూరాన్ని పాటించటం లాంటి పద్దతుల్ని పాటించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

ఇప్పటివరకు యూరోపియన్ ప్రాంతంలో ఒక బిలియన్ కు పైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లుగా చెబుతున్నారు. బిలియన్ అంటే 10కోట్లు. మన దేశంతో పోలిస్తే యూరోప్ లోని దేశాల్లో జనాభా తక్కువే అయినా.. వ్యాక్సినేషన్ జరిగిన తీరు కూడా కొవిడ్ తీవ్రత తగ్గకపోవటానికి కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి.

యూరోప్ ను వణికిస్తున్న కరోనా.. ఆగ్నేయాసియాలో 11 శాతం.. మధ్య తూర్పు దేశాల్లో 9 శాతం తగ్గుదలను నమోదు చేస్తే.. యూరోపలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఉండటం గమనార్హం. గత వారంలో ఆస్ట్రియా.. నెదర్లాండ్స్.. బెల్జియం దేశాలు కొవిడ్ నియంత్రణకు పాక్షిక లాక్ డౌన్ సహా పలు కఠిన చర్యలు తీసుకున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వివరాల్ని వెల్లడించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. డెవలప్ మెంట్ కు దూరంగా ఉంటుందని చెప్పే ఆఫ్రికాలోకరోనా మరణాలు భారీ స్థాయిలో తగ్గటం విశేషం. ప్రపంచానికి పెద్ద అయిన అమెరికాలో కేసుల నమోదు స్థిరంగా ఉన్నప్పటికీ.. మరణాలు మాత్రం 19 శాతానికి పెరగటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పక తప్పదు. ఇదంతా చూస్తే.. మన దేశంలో కరోనా తీవ్రత అంతగా లేదనే భావన కలగటం ఖాయం.