Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ : ఒక్కరోజులోనే 45కి చేరిన కరోనా మృతుల సంఖ్య !

By:  Tupaki Desk   |   1 April 2020 5:10 AM GMT
బ్రేకింగ్ : ఒక్కరోజులోనే 45కి చేరిన కరోనా మృతుల సంఖ్య !
X
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి సాగుతోంది. ఈ మహమ్మారి ప్రస్తుతం 200 దేశాలకు విస్తరించి, వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. చైనాలో గతేడాది డిసెంబరులో వెలుగుచూసిన ప్రాణాంతక కరోనా వైరస్.. ప్రపంచాన్ని జలగలా పట్టిపీడిస్తోంది. భారత్‌లో రోజురోజుకీ కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే దీన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కఠిన నిర్ణయాలు తీసుకోని అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి.

ఇది చాలదు అన్నట్టుగా తాజాగా ఢిల్లీ మర్కజ్‌‌ లో జరిగిన ప్రార్థనలు.. మరింత కలవరం పెడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కరోనా కల్లోలం పెరిగిపోవడానికి కారణమైన నిజాముద్దీన్‌ మర్కజ్‌ పరిణామాలు వివిధ శాఖల్ని కుదిపేస్తున్నాయి. కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న తరుణంలోనూ పెద్దఎత్తున విదేశీయులు సహా దేశంలోని అనేక రాష్ట్రాల వారు రోజుల తరబడి ఒకేచోట ఉండడం, వారిపై ఎలాంటి పరిశీలన లేకపోవడం ప్రస్తుత పరిస్థితికి కారణమని బలంగా వినిపిస్తోంది.ఢిల్లీ నుంచి గల్లీ దాకా మర్కజ్ ఘటనతో ఉలిక్కి పడుతున్నారు.

గత రెండు రోజుల వరకు ఏపీలో కరోనా కేసులు అంతగా లేవు. కానీ , మర్కజ్ ఘటన బయటకి వచ్చిన తరువాత ఏపీలో కూడా ఒక్కసారిగా కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఇకపోతే భారత్ లో ఇప్పటివరకు 45కి చేరగా, పాజిటివ్ కేసుల సంఖ్య 1,418 అని కేంద్రం వెల్లడించింది. పరిస్థితి తీవ్రతకు నిదర్శనంగా ఇవాళ ఒక్కరోజే 13 మరణాలు సంభవించాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. కరోనా వైరస్ నుంచి కోలుకుని 123 మంది డిశ్చార్జి అయ్యారని వెల్లడించింది.

అలాగే మరలా కొత్తగా 167 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మూడు రోజుల కిందటి వరకూ పరిస్థితి అదుపులోనే ఉన్నట్టు కనిపించింది. కానీ , ఒక్కసారిగా విస్ఫోటనం చెందిన స్థాయిలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ఢిల్లీలోని మర్కజ్‌ లో జరిగిన ఓ మత సమావేశానికి హాజరైన వారు, వారిని కలిసిన వ్యక్తులు పాజిటివ్ కేసులుగా తేలారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మరిన్ని పాజిటివ్ కేసులు వస్తాయన్న ఆందోళనలు వినిపిస్తున్నాయి. అయితే , ఢిల్లీలోని ఆ మర్కజ్ ప్రార్థనలు వెళ్లిన వారు స్వచ్ఛందంగా బయటకి వచ్చి , కరోనా పరీక్షలు చేపించుకోవాలని ప్రభుత్వం చెప్తుంది.