Begin typing your search above and press return to search.

అగ్రరాజ్యం డొల్లతనం... కరోనాతో బయటపడిపోయిందిగా

By:  Tupaki Desk   |   5 April 2020 12:30 AM GMT
అగ్రరాజ్యం డొల్లతనం... కరోనాతో బయటపడిపోయిందిగా
X
పేరుకే అగ్రరాజ్యం. చిన్న ఉత్పాతం వచ్చినా తట్టుకుని నిలబడే సత్తా అమెరికాకు లేదని తేలిపోయింది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి అగ్రరాజ్యం హోదాలో ఉన్న అమెరికాను కూడా వదిలిపెట్టలేదు. అంతేనా... తాను పుట్టిన చైనా కంటే కూడా అమెరికాలోనే కరోనా వైరస్ విశ్వరూపం చూపుతోంది. ఇలాంటి కీలక సమయాన... అమెరికా తన శక్తి ఏ పాటిదో చెప్పకనే చెప్పేసింది. కోవిడ్-19 రోగులకు అత్యవసరంగా మారిన వెంటిలేటర్లను అందుబాటులో ఉంచే విషయంలో అమెరికా దాదాపుగా చేతులెత్తేసింది. అమెరికాను... అందులోనూ ప్రత్యేకించి ఆ దేశ వాణిజ్య రాజధాని న్యూయార్క్ ను ఓ కుదుపు కుదిపేస్తోంది. ఈ క్రమంలో నానాటికీ పెరిగిపోతున్న కోవిడ్-19 రోగులకు సరిపడ వెంటిలేటర్లు తమ వద్ద లేవని స్వయంగా న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో కుండబద్దలు కొట్టేశారు. ప్రస్తుతం ఉన్న వెంటిలేటర్లు ఆరో రోజుల వరకు మాత్రమే సరిపోతాయని, ఆ తర్వాత పరిస్థితి ఏమిటన్న దానిపై ఏం చేయాలో పాలుపోవడం లేదని కూడా ఆండ్రూ పేర్కొనడం గమనార్హం.

ఈ దిశగా ఆండ్రూ ఏమన్నారన్న విషయానికి వస్తే... " రాష్ట్రంలో వెంటిలేట‌ర్ల కొర‌త ఉంది. రాబోయే ఆరు రోజుల‌కు స‌రిప‌డా వెంటిలేట‌ర్లు మాత్ర‌మే ఉన్నాయి. రాబోయే రోజుల్లోనూ కావాల్సిన‌న్ని వెంటిలేట‌ర్ల‌ను అందించే స్థితిలో ప్ర‌భుత్వం ఉంద‌ని తాను భావించ‌డం లేదు" అని ఆండ్రూ ప్రస్తుతం న్యూయార్క్ లో నెలకొన్న పరిస్థితిని కళ్లకు కట్టారనే చెప్పాలి. క‌రోనా కోర‌ల్లో చిక్కుకున్న అమెరికాలో క‌రోనా బాధితుల సంఖ్య 2,77,000లు దాటింది. ప్రాణాంత‌క వైర‌స్‌ సోకి ఇప్పటికే 7,402 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌భుత్వం గ‌త‌వారం న్యూయార్క్ న‌గ‌రానికి 400 వెంటిలేట‌ర్ల‌ను అందించింది. ఇప్ప‌టికే 2,200 వెంటిలేట‌ర్లు స్టాక్‌లో ఉన్నా అంత‌కంత‌కూ పెరుగుతున్న క‌రోనా బాధితుల‌కు ఇవి స‌రిపోవ‌డం లేద‌ని ఆండ్రూ తెలిపారు. ప్ర‌తిరోజు దాదాపు 350 మంది కోవిడ్‌-19 బాధితులు ఆసుప‌త్రుల‌కు వ‌స్తున్నార‌ని తెలిపారు. ప్ర‌స్తుతం వారికి చికిత్స అందించేందుకు త‌గినంత హాస్పిట‌ల్స్‌, వైద్య‌సిబ్బంది, వైద్య ప‌రికరాలు లేవ‌ని పేర్కొన్నారు. అమెరికాలో క‌రోనా బాధితుల సంఖ్య ఇప్ప‌టికే 2 ల‌క్ష‌లు దాటేసింది. జావిట్స్ సెంటర్ మరియు బ్రూక్లిన్ క్రూయిజ్ టెర్మినల్ వంటి ప్రదేశాలలో తాత్కాలిక ఆసుపత్రులను నిర్మిస్తున్నట్లు ఆండ్రూ క్యూమా ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉండ‌గా, వ‌చ్చే వంద రోజుల్లో 1,00,000 వెంటిలేటర్లను అందుబాటులో ఉంచనున్నట్టు గత నెల 27న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇప్ప‌టికే వీటి త‌యారీ కోసం వివిధ సంస్థ‌ల‌తో ఒప్పందాలు కుదుర్చుకున్న‌ట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో ఇత‌ర దేశాల‌కు కూడా వెంటిలేట‌ర్ల‌ను పంపిణీ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. చైనాలోని వూహాన్‌లో 2019 డిసెంబ‌ర్‌లో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ వ్యాప్తంగా 59 వేల మందిని బ‌లితీసుకుంది. ఈ మ‌హమ్మారి వైర‌స్ ఇప్ప‌టికే 205 దేశాలు, ప్రాంతాలకు పాకింది. ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విజృంభిస్తోన్న వైర‌స్ ధాటికి ప‌లు దేశాలు లాక్‌డౌన్‌ను అనుస‌రిస్తున్నాయి. ప్ర‌స్తుతానికి క‌రోనా బాధితుల సంఖ్య అమెరికాలోనే ఎక్కువ‌.