Begin typing your search above and press return to search.

కొత్త కమిటీతో కాంగ్రెస్ పరిస్థితి మారుతుందా?

By:  Tupaki Desk   |   14 Sep 2021 6:55 AM GMT
కొత్త కమిటీతో కాంగ్రెస్  పరిస్థితి మారుతుందా?
X
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఒక్కతాటిపైకి తెచ్చేందుకు సీనియర్ నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. పార్టీకి పెద్ద మైనస్ గా మారిన అంతర్గత కలహాల సమస్యను పరిష్కరిస్తే పార్టీ బలంగా మారుతుందని నమ్ముతారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఎంతో కొంత నమ్మకం ఉంది. కానీ పార్టీలోని కొందరు నాయకుల తీరుతో దీనిని దూరం పెడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన కొత్త టీపీపీసీ అసంతృప్తి నాయకులను బుజ్జగించేందుకు ఇటీవల ఢిల్లీ అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుంది. సీనియర్ నాయకులందరినీ కలిపి పొలిటికల్ అఫైర్స్ కమిటీ(పీఏసీ) వేసింది. ఇందులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నవారు నియమితులవడం విశేషం.

తెలంగాణ కాంగ్రెస్ ను గాడిలో పెట్టేందుకు ఢిల్లీ పెద్దలు టీపీసీపీ కొత్త కమిటీని నియమించిన విషయం తెలిందే. రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కమిటీ పనిచేయనుంది. అయితే రేవంత్ రెడ్డి నియామకంపై చాలా మంది సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ కొత్త టీపీసీసీ పై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అయితే త్వరలో జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికలో రేవంత్ రెడ్డి హయాంలో పార్టీ బలం పెంచాలని ప్రయత్నిస్తున్నారు. కానీ కొందరు సీనియర్ల వ్యాఖ్యలతో పార్టీ ప్రతిష్ట పోతుందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో అసంతృప్తిగా ఉన్న నేతలందరికీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ఢిల్లీ పెద్ద లు పొలిటికల్ అఫైర్స్ కమిటీ(పీఏసీ) వేసింది. ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కోమటి రెడ్డి బ్రదర్స్ కు చోటు కల్పించారు. అయితే పీఏసీలో సభ్యుల పేర్లను ఎమ్మెల్యే జగ్గారెడ్డి పంపించినట్లు సమాచారం. ఆయన పంపించిన పేర్లు ఆధారంగానే ఢిల్లీ పెద్దలు ప్రకటించారని తెలుస్తోంది. ఇక కోమటి రెడ్డి బ్రదర్స్ పేర్లు జగ్గారెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారట. ఎందుకంటే జగ్గారెడ్డికి కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడూ సాన్నిహిత్యంగా ఉంటారు. అందుకే వారి పేర్లను సూచించినట్లు తెలుస్తోంది.

కోమటిరెడ్డి బ్రదర్స్ గాంధీ భవన్ మెట్లెక్కి చాలా కాలమైంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిపన్పటినుంచి ఆయన గాంధీభవన్ మొహం చూడలేదు. పైగా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ అని వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ లో కలకలం రేపింది. అయతే ఆయన బీజేపీలోకి వెళ్తున్నారన్న ప్రచారాన్ని మాత్రం తిప్పికొట్టారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్లోనే ఉంటానని తెలిపారు. ఇప్పుడు పీఏసీలో ఆయనకు చోటు కల్పించారు. అయితే ఈ కమిటీ సమావేశానికి రాజగోపాల్ రెడ్డి వస్తారా..? అన్న చర్చ జరుగుతోంది.

కోమటి రెడ్డి బ్రదర్స్ లో మరొకరు వెంకటరెడ్డి. టీపీసీసీ నూతన కమిటీ వేసినప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. అప్పటి నుంచి ఆయన కూడా గాంధీ భవన్ వైపు వెళ్లలేదు. ముందుగా రేవంత్ రెడ్డి నియామకాన్ని వ్యతిరేకించిన ఆయన ఆ తరువాత కామ్ అయ్యారు. అయితే పార్టీకి మాత్రం దూరంగానే ఉంటున్నారు. అయితే జగ్గారెడ్డి చొరవతో ఆయన పేరు కూడా పీఏసీలో చేర్చారు. దీంతో కోమటిరెడ్డి అసంతృప్తిని వీడే అవకాశం ఉందా..? అని అనుకుంటున్నారు.

పోలిలికల్ అఫైర్స్ కమిటీలో 30 మందికి చోటు కల్పించారు. ఇందులో మాజీ పీసీసీ చీఫ్ లకు కూడా అవకాశం కల్పించారు. మొన్నటి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇందులో సభ్యుడిగా ఉన్నారు. అలాగే మాజీ మంత్రలు కూడా ఉన్నారు. పార్టీలో చాలా కాలం నుంచి ఉంటూ తమకు పదవులు దక్కలేదనుకున్న వారికి కూడా అవకాశం ఇచ్చారు. అయితే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ కమిటీ వేశారని తెలుస్తోంది. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులంతా ఒక్కతాటిపైకి వస్తారా..? అన్న చర్చ సాగుతోంది.