Begin typing your search above and press return to search.

జగన్ విషయంలో రెండుగా చీలిన కాంగ్రెస్ హై కమాండ్?

By:  Tupaki Desk   |   15 May 2019 2:30 PM GMT
జగన్ విషయంలో రెండుగా చీలిన కాంగ్రెస్ హై కమాండ్?
X
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఏపీలో మెజారిటీ ఎంపీ సీట్లు సాధించుకోవచ్చు అనే అంచనాల నేపథ్యంలో ఆయన మద్దతును పొందేందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్లు ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి ఉమెన్ చాందీ జగన్ తో టచ్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు సాగించారని జాతీయ మీడియా కూడా ధ్రువీకరించింది. జగన్ మోహన్ రెడ్డితో చాందీ సంప్రదింపులు జరిపారని… ఆ సమయంలో జగన్ ఒకే విషయాన్ని చెప్పారని, ఫలితాలు వచ్చాకా మాట్లాడుకుందామంటూ జగన్ వ్యాఖ్యానించారని నేషనల్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఢిల్లీలో ఫలితాల అనంతరం జగన్ ను సంప్రదించే విషయంలో కాంగ్రెస్ పార్టీ వాళ్లు విభేదాలతో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. కొందరేమో జగన్ తో మద్దతు కోసం సంప్రదింపులు జరపాలని - అలా కాదు.. చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడంటూ మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారని భోగట్టా. ఈ విషయంలో కాంగ్రెస్ హై కమాండ్ నేతల్లో చీలిక కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేతు దిగ్విజయ్ సింగ్ - సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ - రాహుల్ కు సన్నిహితుడు అయిన జ్యోతిరాదిత్య సింధియా వంటి వాళ్లంతా జగన్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం. అయితే కేంద్ర మాజీ మంత్రి చిదంబరం మాత్రం చంద్రబాబు వైపు మొగ్గు చూపుతున్నాడట.

గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో చిదంబరంతో చంద్రబాబు నాయుడు సాన్నిహిత్యాన్ని మెయింటెయిన్ చేశారు. చీకట్లో చిదంబరంతో సమావేశం అంటూ చంద్రబాబుపై అప్పట్లోనే కథనాలు వచ్చాయి. ఆ పరిచయాలతో ఇప్పుడు మళ్లీ చంద్రబాబుతో వైపు మొగ్గు చూపుతున్నాడట చిదంబరం.

అయితే ఇప్పుడు ఎవరు ఎటు వైపు మొగ్గు చూపినా.. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేదే కేంద్రంలో వారి విలువను డిసైడ్ చేస్తుందని పరిశీలకులు అంటున్నారు.