Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ చింత‌న్ శిబిర్ ల‌క్ష్యం.. ఆరు అంశాల‌తో స‌రా?!

By:  Tupaki Desk   |   14 May 2022 2:30 PM GMT
కాంగ్రెస్ చింత‌న్ శిబిర్ ల‌క్ష్యం.. ఆరు అంశాల‌తో స‌రా?!
X
రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ వేదికగా జరుగుతున్న కాంగ్రెస్‌ పార్టీ నవ సంకల్ప్‌ చింతన్‌ శిబిర్‌లో ప్ర‌ధానంగా ఆరు అంశాల‌కే చ‌ర్చ‌ల‌ను ప‌రిమితం చేశారు. వీటిని చ‌ర్చించి.. తీర్మానాలు రూపొందించేందుకు ఆరు క‌మిటీల‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇదే స‌మ‌యంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాటంలో భాగంగా చేపట్టనున్న జనజాగరణ్‌ అభియాన్‌పై సోనియా, పార్టీ నేత రాహుల్‌ గాంధీ చర్చించారు. అటు వ్యవసాయం సహా వివిధ అంశాలపై ఏర్పాటైన 6 కమిటీలు చర్చలు కొనసాగిస్తున్నాయి.

వరుస ఓటములతో బలహీనమైన పార్టీలో జవసత్వాలు నింపడం, రాబోయే ఎన్నికలకు సమాయత్తం కావడంపై మేథోమథనం కోసం రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో నవసంకల్ప్‌ చింతన్‌ శిబిర్‌ ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ రెండో రోజు కీలక అంశాలపై చర్చించింది. తొలి రోజు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన అధినేత్రి సోనియా....రెండోరోజు పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు.

ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో భేటీ అయిన సోనియా కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రజలకు వివరించేందుకు చేపట్టనున్న జనజాగరణ్‌ అభియాన్‌పై చర్చించారు. పార్టీ నేత రాహుల్‌ గాంధీ కూడా ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

దేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక, వ్యవసాయ, యువజన, పార్టీ సంస్థాగత వంటి ఆరు ప్ర‌ధాన అంశాలపై చ‌ర్చించేందుకు ఆరు క‌మిటీల‌ను ఏర్పాటు చేశారు. ఈ అంశాల‌పై ఈ 6 కమిటీలు చర్చలు జరుపుతున్నాయి. దేశ రైతాంగ సమస్యలు, వ్యవసాయ రంగంపై పార్టీ నేత భూపీందర్‌ సింగ్ హుడా నేతృత్వంలోని కమిటీ చర్చించింది. కమిటీ ముందు పార్టీ నేతలు తమ అభిప్రాయా లు వెల్లడించారు.

చింతన్‌ శిబిర్‌లో ఆరు కమిటీలు చర్చలు జరపనున్నాయి. ఆయా అంశాల‌పై కమిటీ సభ్యులు తీర్మానాలను ఖ‌రారు చేసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి అందజేస్తారు. ఆదివారం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరగనుండగా, ఆరు కమిటీల తీర్మానాలపై అక్కడ చర్చ జరగనుంది. చర్చ తర్వాత సోనియా గాంధీ ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నారు.

సోనియా ఏమ‌న్నారంటే..

స్వప్రయోజనాలు పక్కనపెట్టి పార్టీ కోసం పని చేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోందంటూ ధ్వజమెత్తారు. సవాళ్లను ఎదుర్కొని పోరాడి గెలవాల్సిన తరుణమిది అని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

2016 నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారి పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీలను బూచిగా చూపుతూ ప్రజల మధ్య విరోధాలు పెంచి భయాందోళనలను సృష్టిస్తున్నారని సోనియా ఆరోపించారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ గతంలో మాదిరిగా క్రియాశీల పాత్ర పోషించాలని ప్రజలు కోరుకుంటున్నారని, వారి ఆశలను నెరవేర్చేలా క్షేత్ర స్థాయి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేద్దామని నేతలకు ఆమె సూచించారు.

ఇప్పటివరకూ కాంగ్రెస్‌ పార్టీ.. నేతలకు ఎంతో చేసిందని, ఇప్పుడు దాని రుణం తీర్చుకొనే సమయం వచ్చిందని ఉద్బోధించారు. మేధోమథన సదస్సు అనంతరం పార్టీ అంతా ఐక్యంగానే ఉందన్న సందేశం దేశ ప్రజలకు వెళ్లాలని సోనియా గాంధీ సూచించారు. ఆమె తన ప్రసంగాన్ని ఆంగ్లం, హిందీలో కొనసాగించారు. మోడీ ప్రభుత్వ వైఖరిని తూర్పారపడుతూనే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.